యాచారం : సీఎం రిలీఫ్ ఫండ్ పథకం పేదలకు వరంలాంటిదని ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్రెడ్డి అన్నారు. మండలంలోని మొండిగౌరెల్లి గ్రామానికి చెందిన దేవరకొండ మౌనిక అనే మహిళ ఇటివల అనారోగ్యానికి గురై ప్రైవేటు దవాఖానలో చికిత్స చేయించుకుంది. దవాఖాన ఫీజులు చెల్లించలేక ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న ఆమెకు సీఎం సహాయనిధి పథకం ద్వారా మంజూరైన రూ. 45,000ల చెక్కును మంగళవారం క్యాంపు కార్యాలయంలో బాధితురాలికి ఆయన అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ సీఎం రిలీఫ్ ఫండ్ పథకం ఎంతోమంది పేదలకు అండగా నిలుస్తుందన్నారు.
ఇప్పటికే నియోజకవర్గంలో ఎన్నో కుటుంబాలను ఆర్థికంగా ఆదుకుందన్నారు. పేద ప్రజల సంక్షేమం కోసం ప్రభుత్వం అనేక పథకాలను ప్రవేశపెట్టి ఆదుకుంటుందన్నారు. ప్రభుత్వ పథకాలను ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలన్నారు. కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ బండిమీది కృష్ణ, టీఆర్ఎస్ నాయకులు కట్టెల కృష్ణయ్య, డేరంగుల శ్రీనివాస్, శ్రీనివాస్, ఎట్టి ప్రహ్లాద్, గజ్జల కృష్ణ తదితరులు ఉన్నారు.