వికారాబాద్, ఆగస్టు 12 : సాధ్యంకాని పనులను సైతం చేసి చూపిస్తున్న అసాధ్యుడు సీఎం కేసీఆర్ అని.. అందుకు నిలువెత్తు నిదర్శనం కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణమేనని వికారాబాద్ ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్ తెలిపారు. సీఎం ప్రత్యేక చొరవతోనే ప్రజల దశాబ్దాల కల అయిన పాలమూరు – రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి అడ్డంకులు తొలగాయన్నారు. ప్రాజెక్టు పర్యావరణ అనుమతులకు ఈఏసీ కమిటీ ఒకే చెప్పడంపై ఆయన హర్షం వ్యక్తం చేస్తూ శనివారం సీఎం కేసీఆర్ చిత్రపటానికి క్షీరాభిషేకం చేశారు. అనంతరం స్వీట్లు పంచిపెట్టారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మెతుకు ఆనంద్ మాట్లాడుతూ పాలమూరు- రంగారెడ్డి ఎత్తిపోతలతో మన జిల్లాలోని లక్షల ఎకరాలకు సమృద్ధిగా కృష్ణా జలాలు అందనున్నాయన్నారు. మరోవైపు జిల్లావ్యాప్తంగా సంబురాలు కొనసాగుతున్నాయి. పలుచోట్ల ప్రజాప్రతినిధులు, నాయకులు సీఎం కేసీఆర్ చిత్రపటాలకు క్షీరాభిషేకం చేసి కృతజ్ఞతలు తెలిపారు.