రంగారెడ్డి, నవంబర్ 13 (నమస్తే తెలంగాణ) : ఉద్యమాల గడ్డ ఇబ్రహీంపట్నానికి బీఆర్ఎస్ అధినేత, ముఖ్యమంత్రి కేసీఆర్ మంగళవారం వస్తున్నారు. రెండో విడుత ఎన్నికల ప్రచారంలో భాగంగా రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నంలో సాయంత్రం 3 గంటలకు జరిగే ప్రజా ఆశీర్వాద సభలో పాల్గొననున్నారు. ఈ సందర్భంగా సీఎం కేసీఆర్కు స్వాగతం పలికేందుకు నేతలు ఘనంగా ఏర్పాట్లు చేశారు. జిల్లాలో తొలి ఎన్నికల ప్రచార బహిరంగ సభ కావడంతో సక్సెస్ చేసేందుకు భారీగా జనాన్ని సమీకరిస్తున్నారు. ఇబ్రహీంపట్నం శివారులో హైదరాబాద్-సాగర్ హైవే పక్కనే దేవరకొండ వైపునకు వెళ్లే మార్గంలో విశాలమైన స్థలంలో ప్రజా ఆశీర్వాద సభకు ఏర్పాట్లు చేశారు. గతంలో కూడా ఇక్కడే సీఎం సభలను నిర్వహించడంతో.. అదే సెంటిమెంట్తో ఎమ్మెల్యే మంచిరెడ్డి ఈసారి కూడా సభను అదే స్థలంలో నిర్వహిస్తున్నారు. సీఎం కేసీఆర్ హెలికాప్టర్లో రానుండగా.. సభా స్థలికి పక్కనే హెలీప్యాడ్ను ఏర్పాటు చేశారు. సీఎం పర్యటన ఏర్పాట్లను బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి మంచిరెడ్డి కిషన్రెడ్డి సోమవారం పరిశీలించారు. అన్ని వర్గాల ప్రజలు భారీగా తరలివచ్చి ఆశీర్వదించాలని ఆయన పిలుపునిచ్చారు. గులాబీ బాస్ రాకతో జిల్లాలో బీఆర్ఎస్ ఎన్నికల ప్రచారం కొత్త పుంతలు తొక్కనున్నది.
భారీ జన సమీకరణతో సభ
అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా నిర్వహిస్తున్న ప్రజా ఆశీర్వాద సభను బీఆర్ఎస్ పార్టీ ప్రతిష్టాత్మకంగా తీసుకున్నది. ఇబ్రహీంపట్నం, మంచాల, యాచారం, అబ్దుల్లాపూర్మెట్ మండలాలతోపాటు ఇబ్రహీంపట్నం, ఆదిబట్ల, తుర్కయాంజాల్, పెద్దఅంబర్పేట మున్సిపాలిటీల నుంచి భారీగా జనాన్ని సమీకరించేలా బూత్ కమిటీలకు బాధ్యతలు అప్పగించారు. సభకు తరలివచ్చేందుకు లబ్ధిదారులతోపాటు సబ్బండ వర్ణాల ప్రజానీకం సిద్ధమవుతున్నది. 70వేల మందికి పైగా సభకు తరలివచ్చే అవకాశం ఉందని పార్టీ శ్రేణులు పేర్కొంటున్నారు. సభకు వచ్చేవారికి ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నారు. సభకు వచ్చే వీఐపీలు, మీడియా, స్థానిక ప్రజాప్రతినిధులు, మహిళలు ఇలా.. వేర్వేరుగా గ్యాలరీలు ఏర్పాటు చేశారు. సభాస్థలికి నలువైపులా కొద్ది దూరంలో పార్కింగ్ స్థలాలను ఏర్పాటు చేశారు. ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్రెడ్డి దగ్గరుండి సభా ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు.
ఇబ్రహీంపట్నం గులాబీమయం
సీఎం కేసీఆర్ పాల్గొనే ఎన్నికల బహిరంగ సభకు ఇబ్రహీంపట్నం ముస్తాబైంది. పట్టణంలోని రోడ్లన్నీ గులాబీ జెండాలతో రెపరెపలాడుతున్నాయి. ప్రధాన కూడళ్లు, రహదారుల వెంట గులాబీ ఫ్లెక్సీలు, జెండాలను పెద్దఎత్తున ఏర్పాటు చేశారు. సభా ప్రాంగణాన్ని గులాబీమయం చేశారు. గులాబీ జెండాలు చేతబట్టుకుని ర్యాలీగా పెద్దఎత్తున జనం సభా ప్రాంగణానికి చేరుకోనుంది. ప్రజలు దూరం నుంచి కూడా సభను వీక్షించేందుకు ప్రత్యేక స్క్రీన్లు ఏర్పాటు చేశారు.
అభివృద్ధి ప్రదాతకు అపూర్వ స్వాగతం పలకాలి
ఇబ్రహీంపట్నం : నియోజకవర్గ అభివృద్ధి ప్రదాత ముఖ్యమంత్రి కేసీఆర్ నేడు ఇబ్రహీంపట్నం విచ్చేస్తున్న సందర్భంగా ఆయనకు అపూర్వ స్వాగతం పలకాలని బీఆర్ఎస్ ఇబ్రహీంపట్నం అభ్యర్థి మంచిరెడ్డి కిషన్రెడ్డి పిలుపునిచ్చారు. సోమవారం ముఖ్యమంత్రి బహిరంగ సభ ఏర్పాట్లను పరిశీలించిన అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. ఎన్నికల ప్రచారంలో భాగంగా ముఖ్యమంత్రి మంగళవారం 3 గంటలకు ఇబ్రహీంపట్నంలో జరిగే బహిరంగ సభకు హాజరవుతారని ఆయన తెలిపారు. ముఖ్యమంత్రి కేసీఆర్కు ఇబ్రహీంపట్నం నియోజకవర్గంపై ప్రత్యేక అభిమానం ఉన్నదని.. ప్రతిసారి ఇబ్రహీంపట్నం వచ్చిన సందర్భంగా అనేక అభివృద్ధి కార్యక్రమాలకు నిధులు కేటాయించారన్నారు. గత పదేండ్లలో ఇబ్రహీంపట్నం నియోజకవర్గంలో రూ.2931 కోట్లతో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టామన్నారు. రాష్ట్రంలో బీఆర్ఎస్ పార్టీ మళ్లీ అధికారంలోకి రావాలని ప్రజలు కోరుకుంటున్నారని పేర్కొన్నారు. ఎన్నికల ప్రచారంలో ప్రజల నుంచి మంచి స్పందన వస్తున్నదని తెలిపారు. 85 నుంచి 90 స్థానాలు బీఆర్ఎస్కు రావడం ఖాయమని.. ఇబ్రహీంపట్నంలో కూడా తాను మంచి మెజార్టీతో గెలుస్తానని ధీమా వ్యక్తం చేశారు. సాగర్ రహదారిని నాలుగు లైన్ల రోడ్డుగా మార్చడానికి రూ.420 కోట్ల అవసరమని.. ఈ విషయమై ముఖ్యమంత్రి దృష్టికి తీసుకుపోతానన్నారు. అలాగే తుర్కయాంజాల్ మున్సిపాలిటీ పరిధి కోహెడ వద్ద 170 ఎకరాల్లో అంతర్జాతీయ ప్రమాణాలతో పండ్ల మార్కెట్ నిర్మాణానికి రూ.418 కోట్లు కేటాయించేలా.. శివన్నగూడ ఎత్తిపోతల ద్వారా లిఫ్ట్ ఇరిగేషన్తో నియోజకవర్గంలోని 75 వేల ఎకరాలకు సాగు నీరందించాలని సీఎంను కోరనున్నట్లు ఆయన తెలిపారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు మల్లేశ్, గ్రంథాలయ సంస్థ జిల్లా చైర్మన్ వెంకటరమణారెడ్డి, మార్కెట్ కమిటీ చైర్మన్ చంద్రయ్య, మంచాల ఎంపీపీ నర్మద, మున్సిపల్ వైస్ చైర్మన్ యాదగిరి, కౌన్సిలర్లు శంకరయ్య, సుజాత, సుధాకర్, బీఆర్ఎస్ మున్సిపల్ అధ్యక్షుడు వెంకట్రెడ్డి, ప్రధాన కార్యదర్శి వేణుగోపాల్రావు, నాయకుడు అరవింద్ ఉన్నారు.
22న పరిగిలో సీఎం కేసీఆర్ బహిరంగసభ
పరిగి : అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా పరిగిలో ఈ నెల 22న జరిగే భారీ బహిరంగసభలో బీఆర్ఎస్ అధినేత, సీఎం కేసీఆర్ పాల్గొననున్నారు. గత ఎన్నికల సమయంలో నిర్వహించిన జింఖానా గ్రౌండ్లోనే ఈసారి కూడా బహిరంగసభ నిర్వహించాలని నిర్ణయించారు. ఈ మేరకు బహిరంగసభ స్థలాన్ని ఎమ్మెల్యే కొప్పుల మహేశ్రెడ్డి సోమవారం పరిశీలించారు. గ్రౌండ్ను పూర్తిస్థాయిలో శుభ్రం చేయించాలని, చెత్తాచెదారాన్ని తొలగించే పనులు వెంటనే ప్రారంభించాలని పార్టీ నాయకులను ఎమ్మెల్యే ఆదేశించారు. గ్రౌండ్ పూర్తిస్థాయిలో చదును చేసి బహిరంగసభకు ఏర్పాట్లు చేపట్టేందుకు అవసరమైన విధంగా తయారు చేయాలని ఆయన పేర్కొన్నారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ ముకుంద అశోక్, ఎంపీపీ అరవిందరావు, మార్కెట్ కమిటీ చైర్మన్ సురేందర్, జడ్పీ మాజీ కో-ఆప్షన్ సభ్యుడు మీర్ మహమూద్అలీ, బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు ఆంజనేయులు, సీనియర్ నాయకుడు ప్రవీణ్కుమార్రెడ్డి, కౌన్సిలర్లు రవీంద్ర, వెంకటేశ్, బీఆర్ఎస్ నాయకులు రవికుమార్, అశోక్, నజీర్, సమద్, తాహెర్ అలీ పాల్గొన్నారు.