కుమ్రం భీం ఆసిఫాబాద్, ఆగస్టు 12(నమస్తే తెలంగాణ ): నకిలీ పత్తి విత్తనాలను కారులో అక్రమ తరలిస్తున్న ఇద్దరిని పట్టుకున్నట్లు ఆసిఫాబాద్ ఎస్ఐ నీలం రవి తెలిపారు. బుధవారం ఆయన విలేకరుల సమావేశంలో వివరాలు వెల్లడించారు. నకిలీ పత్తి విత్తనాలను అక్రమంగా రవాణా చేస్తున్నారనే విశ్వసనీయ సమాచారంతో మంగళవారం రాత్రి ఆసిఫాబాద్ పోలీసులు ఆదిలాబాద్ ఎక్స్ రోడ్డు వద్ద వాహనాల తనిఖీలు చేపట్టారు. అనుమానాస్పదంగా వెళ్తున్న కారును ఆపి తనిఖీ చేయగా, అందులో సుమారు రూ.4 లక్షల విలువైన సుమారు 2 క్వింటాళ్ల నకిలీ పత్తి విత్తనాలు, నాలుగు పాలిథిన్ బ్యాగుల్లో లభించాయి.
ఈ సందర్భంగా వాహనంలో ఉన్న షేక్ సల్మాన్, ఆరే వెంకటగోపాల్ రెడ్డిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ప్రాథమిక దర్యాప్తులో వెల్లడైన వివరాల ప్రకారం, నిందితులు కొంతకాలంగా నకిలీ పత్తి విత్తనాలను అసలలైన అధిక దిగుబడి విత్తనాలుగా నమ్మించి అమాయక రైతులకు విక్రయిస్తూ అక్రమంగా లాభాలు పొందినట్లు తెలిసింది. పెద్ద మొత్తంలో నకిలీ పత్తి విత్తనాలను వివిధ ప్రాంతాలకు రవాణా చేసి, రైతులకు విక్రయించినట్లు దర్యాప్తులో ఆధారాలు లభించాయి. విత్తనాలతో పాటు కారును సీజ్చేసి నిందితులను అరెస్ట్ చేసి కోర్టులో హాజరు పరిచినట్లు తెలిపారు.