వికారాబాద్ , జూలై 22 : వికారాబాద్ రైల్వే వంతెన నిర్మాణం కోసం కొంతకాలంగా ప్రయత్నాలు జరుగుతున్న విషయం తెలిసిందే. పనులు చేపట్టేందుకు ప్రభుత్వం సుముఖత తెలిపినా.. స్థానికులతో కాస్త్త ఇబ్బందులు తలెత్తడంతో జాప్యం జరుగుతూ వస్తున్నది.
ఇటీవల కలెక్టర్ నారాయణరెడ్డి స్థానికులతో మాట్లాడి ఒప్పించడంతో వంతెన నిర్మాణానికి లైన్ క్లియర్ అయ్యింది. దీంతో రైల్వే వంతెన నిర్మాణానికి అవసరమైన రూ.96 కోట్ల నిధులను రాష్ట్ర ప్రభుత్వం శనివారం మంజూరు చేసింది. ఈ మేరకు విడుదల చేసిన జీవో కాపీని సీఎం కేసీఆర్ చేవెళ్ల ఎంపీ రంజిత్రెడ్డి, వికారాబాద్ ఎమ్మెల్యే ఆనంద్కు అందించారు. ఈ వంతెన అందుబాటులోకి వస్తే వికారాబాద్ ప్రజల కష్టాలు తీరనుండగా.. సర్వత్రా హర్షం వ్యక్తమవుతున్నది.