పాలమూరు-రంగారెడ్డిని సాధ్యమైనంత తొందరగా పూర్తి చేసి.. జిల్లాలోనాలుగు లక్షల ఎకరాల్లో నీరు పారించే బాధ్యత తనదేనని సీఎం కేసీఆర్ హామీ ఇచ్చారు. మంగళవారం వికారాబాద్లో టీఆర్ఎస్ పార్టీ కార్యాలయం, సమీకృత కలెక్టరేట్ భవనాన్ని ప్రారంభించడంతోపాటు మెడికల్ కాలేజీ నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. అనంతరం జరిగిన బహిరంగ సభలో జన సందోహాన్ని ఉద్దేశించి ఆయన ప్రసంగించారు. వికారాబాద్కు ఘన చరిత్ర ఉందని, ఇక్కడి గాలిలోనే ఔషధ గుణాలున్నాయన్నారు. తెలంగాణ కల సాకారమైనందునే ప్రత్యేక జిల్లాగా ఏర్పాటు చేసుకున్నామని, డిగ్రీ కాలేజీలను అందుబాటులోకి తెచ్చుకున్నామన్నారు. అద్భుతమైన కలెక్టరేట్ను నిర్మించుకున్నామన్నారు.
తెలంగాణ వస్తే భూముల ధరలు తగ్గుతాయని దుష్ప్రచారం చేశారని, కానీ, ఇప్పుడు వికారాబాద్, రంగారెడ్డి జిల్లాల్లో భూములకు అత్యధిక ధరలున్నాయని గుర్తు చేశారు. తాండూరును ఆనుకొని ఉన్న కర్ణాటక రాష్ట్రంలో బీజేపీ అధికారంలో ఉందని, జిల్లా ప్రజాప్రతినిధులు ఇక్కడి వారిని ఆ రాష్ర్టానికి తీసుకెళ్లి అక్కడి దుస్థితిని చూపించాలని సీఎం సూచించారు. పక్క రాష్ర్టాల్లో ని సరిహద్దు ప్రాంతాల ప్రజలు తమను తెలంగాణలో కలుపాలని డిమాండ్ చేస్తున్నారన్నారు. బీజేపీ వైఖరితోనే రంగారెడ్డి-పాలమూరు ప్రాజెక్టు ఆలస్యమవుతున్నదన్న ఆయన ఎవరెన్నీ అడ్డంకులు సృష్టించినా వికారాబాద్ భూములకు కృష్ణా జలాలు అందించి తీరుతామని స్పష్టం చేశారు. సంక్షేమ పథకాలు ఆగిపోవద్దన్నా, మరింత ఎక్కువగా అభివృద్ధి చేసుకోవాలన్నా ప్రతిపక్షాలకు బుద్ధి చెప్పాలన్నారు. చెప్పుడు మాటలు వింటే మోసపోయి గోస పడుతామన్నారు. వికారాబాద్ ప్రజలు విజ్ఞతతో ఆలోచించాలని సీఎం కేసీఆర్ సూచించారు.
సీఎం కేసీఆర్కు స్వాగతం పలుకుతున్న మంత్రి సబితారెడ్డి, జడ్పీ చైర్పర్సన్ సునీతారెడ్డి, ఎమ్మెల్యే మెతుకు ఆనంద్
పరిగి, ఆగస్టు 16 : పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతలతో వికారాబాద్ జిల్లాకు సాగు నీరు తీసుకొచ్చే బాధ్యత తనదేనని సీఎం కేసీఆర్ స్పష్టం చేశారు. మంగళవారం వికారాబాద్లో రూ.60.70 కోట్లతో నిర్మాణం చేపట్టిన జిల్లా సమీకృత కలెక్టరేట్ భవనాన్ని సీఎం కేసీఆర్ ప్రారంభించి జిల్లాకు సంబంధించిన పలు అంశాలను తన ప్రసంగంలో ప్రస్తావించారు. ప్రధానంగా కృష్ణా నీటిలో తెలంగాణ రాష్ట్ర వాటా తేల్చకుండా కేంద్రం తాత్సారం చేస్తున్నదన్నారు. నీటి వాటా తేల్చాలని బీజేపీ నాయకులు కేంద్రాన్ని ప్రశ్నించాలన్నారు. ఇప్పటికే వంద దరఖాస్తులు ఇచ్చినా ఫలితం లేదని తెలిపారు. కృష్ణా నీరు తీసుకొచ్చి వికారాబాద్, తాండూరు, పరిగి, కొడంగల్, చేవెళ్ల నియోజకవర్గాల్లోని 4 లక్షల ఎకరాలకు సాగునీరు అందించే బాధ్యత తనదని సీఎం తేల్చి చెప్పారు. తెలంగాణ రాకుంటే వికారాబాద్ జిల్లా అయ్యేదా అని ప్రశ్నించారు. జన్మలో అనుకోనిది వికారాబాద్ జిల్లా అయిందంటే తెలంగాణ సాధించడంతోనే అన్నారు. ఉద్యమ సమయం నుంచి ఉమ్మడి రంగారెడ్డిలోని ప్రభుత్వ కార్యాలయాలు వికారాబాద్లో ఏర్పాటు చేయాలని డిమాండ్ ఉండగా దేవుడి దయ వల్ల తెలంగాణ వచ్చిన తర్వాత జిల్లానే చేస్తామని ఇచ్చిన హామీని నెరవేర్చానని సీఎం గుర్తు చేశారు. వికారాబాద్ జిల్లాకు చాలా ప్రాశస్త్యం ఉందని, అనంతగిరి అడవుల్లో ఔషధ మొక్కలు ఉన్నాయని, అనంతగిరిలో టీబీ శానిటోరియం ఉందని, వికారాబాద్ కా హవా లాకో మరీజోంకా దవా అనే నానుడిని మరోసారి సీఎం కేసీఆర్ గుర్తు చేశారు. జిల్లాగా ఏర్పాటు చేయడం వల్లనే రాష్ట్రంలోని ప్రతి జిల్లాలో ఏర్పాటు చేయ తలపెట్టిన మెడికల్ కళాశాలను వికారాబాద్లో ఏర్పాటు చేసుకుంటున్నామని తెలిపారు. జిల్లా ఏర్పాటుతోనే రూ.60 కోట్లతో సమీకృత కలెక్టరేట్ నిర్మాణం చేపట్టుకోగలిగామన్నారు. 50 ఏండ్ల పరిపాలనలో రాని రెండు డిగ్రీ కళాశాలలు జిల్లాలో ఏర్పాటు చేసుకున్నట్లు వివరించారు.
వికారాబాద్ సమీకృత కలెక్టరేట్ భవన ప్రారంభోత్సవంలో సీఎం కేసీఆర్తో కలిసి పాల్గొన్న మంత్రులు వేముల ప్రశాంత్రెడ్డి, సబితారెడ్డి తదితరులు
ఉద్యమ సమయంలో తెలంగాణ వస్తే భూముల ధరలు పడిపోతాయని దుష్ప్రచారం చేశారని, అప్పట్లో ఆంధ్రాలో ఒక ఎకరా భూమి అమ్మితే తెలంగాణ ప్రాంతంలో నాలుగైదు ఎకరాలు కొనేవారని, తెలంగాణ ఏర్పాటు తర్వాత వికారాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాల్లోని భూముల ధరలు అత్యధికంగా పెరిగాయని స్పష్టం చేశారు. ప్రస్తుతం తెలంగాణలో ఒక్క ఎకరం భూమి అమ్మితే ఇతర రాష్ర్టాల్లో నాలుగైదు ఎకరాలు కొనుగోలు చేసే పరిస్థితి ఏర్పడిందని, ఇప్పుడు మూడు ఎకరాల భూమి ఉన్న రైతు కోటీశ్వరుడని పేర్కొన్నారు. తమ ప్రాంతాన్ని తెలంగాణలో కలపాలని, లేదంటే తెలంగాణలో జరుగుతున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలు అమలు చేయాలని కర్ణాటకలోని రాయచూర్ ప్రాంత ప్రజలు డిమాండ్ చేస్తున్నారని, కర్ణాటకకు సరిహద్దులో ఉన్న తాండూరు ప్రాంతం వారికి బాగా తెలుసన్నారు. ప్రతి నియోజకవర్గం నుంచి 500 మంది మహిళలు, 500 మంది పురుషులను కర్ణాటకకు తీసుకెళ్లి అక్కడ పింఛన్ ఎంత ఇస్తున్నారు, కరెంటు ఎలా అందుతున్నది, తాగునీటి సరఫరా వ్యవస్థ ఎలా ఉన్నది, వ్యవసాయానికి తోడ్పాటు ఎలా ఉన్నది చూపించుకురావాలని జిల్లా ఎమ్మెల్యేలు, జడ్పీ చైర్పర్సన్, ఎమ్మెల్సీకి సూచించారు. బోరు మోటర్లకు మీటర్లు పెట్టాలా వద్దా… అని ప్రజలను సీఎం కేసీఆర్ అడుగగా వద్దు, వద్దని ప్రజలు పేర్కొన్నారు. వ్యవసాయానికి ఉచిత కరెంటు ఉండాలా తీసివేయాలా… అని అడుగగా కొనసాగించాలని ప్రజలు ముక్త కంఠంతో కోరారు. వికారాబాద్ చాలా చైతన్యవంతమైన జిల్లా అని, దుష్టశక్తులకు బుద్ధి చెప్పాలని సూచించారు.
కొత్త కలెక్టరేట్లోని తన చాంబర్లో ఆసీనురాలైన కలెక్టర్ నిఖిలను అభినందిస్తున్న సీఎం కేసీఆర్, చిత్రంలో మంత్రి సబితారెడ్డి, సీఎస్ సోమేశ్కుమార్, ఎంపీ రంజిత్రెడ్డి, తాండూరు ఎమ్మెల్యే రోహిత్రెడ్డి
వికారాబాద్లోని బహిరంగ సభ సక్సెస్ కావడంతో టీఆర్ఎస్ శ్రేణుల్లో ఉత్సాహం నింపింది. వికారాబాద్, పరిగి, తాండూరు, కొడంగల్తోపాటు నవాబుపేట మండలాల నుంచి జన సమీకరణ చేపట్టారు. సభా ప్రాంగణం జనంతో నిండిపోయింది. నేలమీద, చెట్లు, భవనాలపై సైతం జనం కూర్చొని సీఎం ప్రసంగం విన్నారు. వివిధ రూట్లలో నిర్ణయించిన స్థలాల్లో వాహనాలను పార్కింగ్ చేశారు. అధికారికంగా మొదటిసారి జిల్లాకు వచ్చిన సీఎం కేసీఆర్ పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల ద్వారా సాగునీరు తీసుకువస్తానని ఇచ్చిన హామీ ఈ ప్రాంత ప్రజలలో, టీఆర్ఎస్ శ్రేణులలో మరింత భరోసా కలిగించింది.