కోల్ సిటీ, ఆగస్టు 12 : కేసీఆర్ సారే మళ్లీ తెలంగాణకు ముఖ్యమంత్రి కావాలి.. అందరి బతుకులు మారాలి అంటూ కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లా వాంకిడి మండల కేంద్రం నుంచి జాడి తిరుపతి, దుర్గం శంకర్ అనే అభిమానులు ఎర్రవెల్లి వరకు చేపట్టిన పాదయాత్ర బుధవారం గోదావరిఖనికి చేరుకుంది. మది నిండా కేసీఆర్ అభిమానం, గులాబీ జెండాలతో గోదావరిఖనికి రాగానే రామగుండం మాజీ ఎమ్మెల్యే కోరుకంటి చందర్ సూచనల మేరకు బీఆర్ఎస్ మున్సిపల్ ఫ్లోర్ లీడర్, కార్పొరేటర్లు, పార్టీ నాయకులు ఎదురెళ్లి స్వాగతం పలికారు.
రాష్ట్ర మహిళా నాయకురాలు మూల విజయారెడ్డి బొట్టు పెట్టి పాదయాత్ర విజయవంతం కావాలనీ, ప్రజల్లో చైతన్యం పెంచాలని ఆకాంక్షించారు. తెలంగాణ రాష్ట్రంకు పట్టిన గ్రహణం వీడాలనీ, ప్రజలకు పూర్వ రోజులు రావాలని, కేసీఆర్ సీఎంగా ఉన్నప్పుడు వాంకిడిలో 350 ఇళ్లకు పట్టాలు ఇచ్చారనీ, ఆ అభిమానంతోనే సాహసమైనా తమ ప్రాణాలు లెక్క చేయక ఎర్రవెల్లి వరకు పాదయాత్రగా వెళ్తున్నామనీ, అడుగడుగునా, ఊరూరా ప్రజలు స్వచ్ఛందంగా స్వాగతిస్తున్నారని పాదయాత్ర చేపట్టిన తిరుపతి, శంకర్ తెలిపారు. అనంతరం వారికి అల్పహారం ఏర్పాట్లు చేసి మళ్లీ పాదయాత్రగా సాగనంపారు.
కార్యక్రమంలో కార్పొరేటర్ మేకల సమ్మయ్య, మూల విజయారెడ్డి, నాయకులు అచ్చ వేణు, ఋషేంద్రం, దొమ్మెటి వాసు, కొలుగూరి సాయికుమార్, కనకరాజు, ప్రతాప్, ఐలయ్య, హరికృష్ణ, కళ్యాణ్, ఆశిష్, మహేందర్ తదితరులు పాల్గొన్నారు.