మూసాపేట (దేవరకద్ర), సెప్టెంబర్ 20: ‘రైతులు ఎన్నోసార్లు పంటలు నష్టపోయారు. ఈసారి కూడా నష్టపోయినా పర్వాలేదు. కానీ జూరాల ప్రాజెక్టు నీళ్లను మాత్రం రైతులు పంటలకు వాడుకోవద్దు. ఒకవేళ పంటలకు వాడుకుంటే ఉమ్మడి పాలమూరు జిల్లాకు తాగునీటి కష్టాలొస్తాయి’ అని రాష్ట్ర పశుసంవర్ధక శాఖ మంత్రి వాకిటి శ్రీహరి చెప్పారు.మహబూబ్నగర్ జిల్లా దేవరకద్ర నియోజకవర్గంలో ఆదివారం వివిధ అభివృద్ధి కార్యక్రమాల్లో మరో మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డితో కలిసి ఆయన పాల్గొన్నారు.
ఆయా సభల్లో మంత్రి వాకిటి శ్రీహరి మాట్లాడుతూ ఇప్పటినుంచి జూన్ వరకు తాగునీటికి కటకట తప్పదని, చాలా ఇబ్బందులొస్తాయని పేర్కొన్నారు. ఇవన్నీ ఆలోచించి రైతులను ఒప్పిస్తున్నామని, కానీ పంటలు ఎండుతున్నాయని రాత్రికి రాత్రి వచ్చి కొందరు రైతులను రెచ్చగొట్టి జూరాల కాలువ గేట్లు తెరిచి నీటిని విడుదల చేస్తున్నట్టు చెప్పారు. ఈ విధంగా చేస్తే రేపు తాగునీటికి మనం ఎక్కడికి పోవాలని, మనతోపాటు పశు, పక్షాదులు కూడా ఇతర ప్రాంతాలకు వెళ్లాల్సి వస్తుందని హెచ్చరించారు.
జూరాల ప్రాజెక్టు ఉమ్మడి పాలమూరు జిల్లాకు గుండెకాయలాంటదని, పాలమూరు, నారాయణపేట, వనపర్తి, గద్వాల జిల్లాలకు ఈ డ్యామ్ నుంచే తాగునీటిని సరఫరా చేయాల్సి ఉంటుందని చెప్పారు. ఈ ఏడు ఎండలు మరింత పెరుగుతాయని శాస్త్రవేత్తలు చెప్తున్నారని, ఎండలు తగ్గించి ప్రజలకు మేలు చేయాలని తాము దేవుళ్లను కోరుతున్నామని మంత్రి తెలిపారు. కానీ కొందరొచ్చి రైతులను రెచ్చగొడుతున్నారని, రైతులను కాపాడుకొనే బాధ్యత కాంగ్రెస్ పార్టీదేనని చెప్పారు. రైతులకు చేతులెత్తి మొక్కుతున్నా.. దుర్మార్గుల చేతుల్లో కీలుబొమ్మ కావొద్దు, దేశానికి అన్నం పెట్టిన రైతులు ఆలోచించుకోవాలని, ఈ ఒక్కపంట నష్టపోయినా అధైర్యపడొద్దు.. అని మంత్రి చెప్పారు.