మొయినాబాద్ : నూతన సంవత్సరం పురష్కరించుకుని చిలుకూరి బాలజీ ఆలయానికి వేలాదిగా భక్తులు తరలివచ్చారు. నూతన సంవత్సరం రోజున స్వామి వారిని దర్శించుకుంటే మంచి జరుగుతుందనే నమ్మకంతో ఆలయానికి రాష్ట్ర వ్యాప్తంగా తరలివచ్చారు. భక్తులు అధిక సంఖ్యలో రావడంతో స్వామి వారిని దర్శించుకోవడానికి ఎలాంటి ఇబ్బందులు కలుగకుండ ఏర్పాట్లు చేశారు. ఆలయంలో భక్తుల సందడి నెలకొనడంతో గోవింద నామస్మరణ మారుమోగింది.
గంటకు 20వేల మంది…
నూతన సంవత్సరం అధిక సంఖ్యలో భక్తులు వస్తారని ఆలయ అర్చకులు, నిర్వాహకులు, సిబ్బంది అప్రమత్తంగా ఉండి కరోనా నిబంధనలకు అనుగుణంగా స్వామి వారిని దర్శించుకునే విధంగా ఏర్పాట్లు చేశారు. భక్తులు స్వామి వారిని గంటకు 20వేల మంది దర్శించుకున్నారు. భక్తులు ఆలయ గర్బగుడిలోనికి వచ్చాక స్వామి వారిని దర్శించుకోవడానికి మహిళలకు, పురుషులకు వేరువేరుగా క్యూలైన్లు ఏర్పాటు చేశారు. గర్బగుడిలో నాలుగు లైన్లు ఏర్పాటు చేయడంతో భక్తులు తొందరగా స్వామివారిని దర్శించుకున్నారు. ఉదయం 5గంటలకే ఆలయం తెరిచి ఉంచారు. భక్తులు తాకిడి ఉదయం 9గంటల నుంచి మధ్యాహ్నం 2గంటల వరకు అధికంగా వచ్చారు. వేంకటేశ్వరస్వామిని దర్శించుకున్న అనంతరం ఆలయ ప్రాంగణంలో ఉన్న సుందరేశ్వరస్వామిని దర్శించుకున్నారు.
మెటల్ డిటెక్టర్ ఏర్పాటు..
ఆలయానికి అధిక సంఖ్యలో భక్తులు వస్తారని భావించిన సైబరాబాద్ పోలీసులు గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు. ఆలయంలోని భక్తులు వెళ్లేదారిలో మెటల్ డిటెక్టర్లు ఏర్పాటు చేసి ప్రతి భక్తున్ని తనిఖీ చేసి ఆలయంలోనికి పంపారు. పోలీసులు భారీగా చేరుకుని బందోబస్తు నిర్వహించారు. ట్రాఫిక్ ఇబ్బందులు తలెత్తకుండ అన్ని ఏర్పాట్లు చేశారు.