వికారాబాద్ మెడికల్ కళాశాల ప్రారంభోత్సవానికి ముస్తాబైంది. నేడు సీఎం కేసీఆర్ వర్చువల్ విధానంలో కాలేజీకి శ్రీకారం చుట్టనున్నారు. అనంతరం అనంతగిరిలోని మెడికల్ కాలేజీ లెక్చరర్ హాల్-2 భవనాన్ని రాష్ట్ర సమాచార పౌరసంబంధాలు, గనులు, భూగర్భవనరుల శాఖల మంత్రి పట్నం మహేందర్ రెడ్డి, జడ్పీ చైర్పర్సన్ సునీతారెడ్డి, చేవెళ్ల ఎంపీ రంజిత్రెడ్డి, కలెక్టర్ నారాయణ రెడ్డి, ఎమ్మెల్యేలు మెతుకు ఆనంద్, నరేందర్రెడ్డి, పైలట్ రోహిత్రెడ్డి, కాలె యాదయ్యతో కలిసి ప్రారంభించనున్నారు. ఈ మేరకు జిల్లా యంత్రాంగం అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. కాలేజీ ప్రారంభాన్ని పురస్కరించుకొని వికారాబాద్ పట్టణంలోని ఆలంపల్లి ఎక్స్ రోడ్డు నుంచి ఎన్టీఆర్ చౌరస్తా వరకు భారీ ర్యాలీ నిర్వహించనున్నారు. అనంతరం అనంతగిరిలోని ప్రభుత్వ మెడికల్ కాలేజీ ప్రారంభోత్సవంలో ప్రజాప్రతినిధులతోపాటు మెడికల్ కాలేజీ విద్యార్థులు, వారి తల్లిదండ్రులు పాల్గొననున్నారు. శుక్రవారం నుంచే తరగతులూ నిర్వహించనున్నారు. ఇక్కడ మొత్తం 100 సీట్లు ఉండగా.. ఇప్పటివరకు 96 మంది విద్యార్థులు రిపోర్టు చేశారు. కాలేజీతో జిల్లా ప్రజలకు సూపర్ స్పెషాలిటీ వైద్య సేవలు అందుబాటులోకి రానున్నాయి.
-వికారాబాద్, సెప్టెంబర్ 14 (నమస్తే తెలంగాణ)
వికారాబాద్, సెప్టెంబర్ 14 (నమస్తే తెలంగాణ) : రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ జిల్లాకో ప్రభుత్వ మెడికల్ కాలేజీని ఏర్పాటు చేయాలనే లక్ష్యంతో మంజూరు చేసిన జిల్లా ప్రభుత్వ మెడికల్ కాలేజీ ప్రారంభోత్సవం నేడు జరుగనుంది. ఈ కాలేజీని సీఎం కేసీఆర్ వర్చువల్గా ప్రారంభించనున్నారు. అనంతరం అనంతగిరిలోని మెడికల్ కాలేజీ లెక్చర్ హాల్-2 భవనాన్ని రాష్ట్ర సమాచార, గనులు, భూగర్భవనరుల శాఖ మంత్రి పట్నం మహేందర్రెడ్డి జడ్పీ చైర్పర్సన్ పట్నం సునీతారెడ్డి, చేవెళ్ల ఎంపీ రంజిత్రెడ్డి, కలెక్టర్ నారాయణరెడ్డి, జిల్లా ఎమ్మెల్యేలు మెతుకు ఆనంద్, పట్నం నరేందర్రెడ్డి, పైలట్ రోహిత్రెడ్డి, కాలె యాదయ్య తదితరులతో కలిసి ప్రారంభించనున్నారు. ప్రభుత్వ మెడికల్ కాలేజీ ప్రారంభోత్సవానికి సంబంధించి జిల్లా యంత్రాంగం అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. ప్రారంభోత్సవం సందర్భంగా జిల్లా కేంద్రంలో భారీ ర్యాలీ నిర్వహించేందుకు జిల్లా యంత్రాంగం ఏర్పాట్లు చేసింది.
జిల్లా కేంద్రంలోని ఆలంపల్లి ఎక్స్ రోడ్ నుంచి ఎన్టీఆర్ చౌరస్తా వరకు మెడికల్ కాలేజీ విద్యార్థులు, మెకికల్ కాలేజీ సిబ్బంది, ఏఎన్ఎంలు, ఆశావర్కర్లు, విద్యార్థులు, మెప్మా సిబ్బందితో ఉదయం 9 గంటలకు భారీ ర్యాలీ నిర్వహించనున్నారు. అనంతరం అనంతగిరిలోని ప్రభుత్వ మెడికల్ కాలేజీ ప్రారంభోత్సవంలో ప్రజాప్రతినిధులతోపాటు మెడికల్ కాలేజీ విద్యార్థులు, వారి తల్లిదండ్రులు పాల్గొననున్నారు. మెడికల్ కాలేజీ ప్రారంభోత్సవం అనంతరం విద్యార్థులు, వారి తల్లిదండ్రులతో మంత్రి మహేందర్రెడ్డితోపాటు ఇతర ప్రజాప్రతినిధులు మాట్లాడనున్నారు. ప్రభుత్వ మెడికల్ కాలేజీకి అనుబంధంగా 380 పడకల ప్రభుత్వ జనరల్ ఆసుపత్రి కూడా అందుబాటులోకి రానుండడంతో జిల్లాలోని పేద ప్రజలకు సూపర్ స్పెషాలిటీ వైద్య సేవలు అందనున్నాయి.
2023-24 విద్యా సంవత్సరానికి ప్రభుత్వ మెడికల్ కాలేజీ తరగతుల నిర్వహణకు అవసరమైన అన్ని ఏర్పాట్లను మెడికల్ కాలేజీ యాజమాన్యం పూర్తి చేసింది. కాలేజీ శాశ్వత భవన నిర్మాణం రెండేండ్లలో అందుబాటులోకి వచ్చే అవకాశాలున్న దృష్ట్యా అనంతగిరిలోని టీబీ శానిటోరియం భవనాల్లో తాత్కాలికంగా తరగతులను నిర్వహించేందుకు అంతా సిద్ధం చేశారు. నేటి నుంచే మెడికల్ కాలేజీ తరగతులు ప్రారంభంకానున్నాయి. తరగతుల నిర్వహణకు రెండు లెక్చర్ హాళ్లను సిద్ధం చేశారు. మొదటి సంవత్సరంలో నిర్వహించే అనాటమీ, ఫిజియోలజీ, బయోకెమిస్ట్రీ సబ్జెక్టులకు సంబంధించి భవనాలతోపాటు ల్యాబ్ గదులను కూడా సిద్ధం చేయడంతోపాటు అనాటమీ, ఫిజియోలజీ, బయోకెమిస్ట్రీలకు సంబంధించి ల్యాబ్ పరికరాలను అందుబాటులో ఉంచారు. సెంట్రల్ లైబ్రరీ, విద్యార్థులు, విద్యార్థినులకు ప్రత్యేకంగా వసతి గృహాలు తదితర ఏర్పాట్లన్నీ పూర్తి చేశారు. శాశ్వత వసతి గృహాల పనులు జరుగుతున్న దృష్ట్యా ప్రస్తుతం అనంతపద్మనాభస్వామి కాలేజీ పీజీ బ్లాక్లో విద్యార్థినుల వసతి గృహన్ని, జి
ల్లా కేంద్రంలోని సిద్దార్థ కాలేజీ సమీపంలో బాలుర వసతి గృహాన్ని ఏర్పాటు చేశారు. విద్యార్థులను వసతి గృహం నుంచి మెడికల్ కాలేజీకి, మెడికల్ కాలేజీ నుంచి వసతి గృహానికి తీసుకెళ్లేందుకు ప్రత్యేకంగా ఆర్టీసీ బస్సును ఏర్పాటు చేశారు.
ఈ విద్యాసంవత్సరం జిల్లా ప్రభుత్వ మెడికల్ కాలేజీలో 100 సీట్లు కేటాయించగా, ఇప్పటివరకు 96 మంది విద్యార్థులు రిపోర్ట్ చేసినట్లు మెడికల్ కాలేజీ అధికారులు వెల్లడించారు. వీరిలో 85 మంది విద్యార్థులు లోకల్ కోటాలో ప్రవేశాలు పొందగా, మరో 11 మంది ఆల్ ఇండియా కోటాలో చేరారు. మరోవైపు మెడికల్ కాలేజీకి అవసరమైన మౌలిక సదుపాయాలను, బోధనా సిబ్బందిని ప్రభుత్వం ఇప్పటికే నియమించింది. వివిధ విభాగాలకుగాను 39 మంది అసిస్టెంట్ ప్రొఫెసర్లను ప్రభుత్వం నియమించింది. అనాటమీ-1, ఫిజియోలజీ-1, బయోకెమిస్ట్రీ-2, పాతాలజీ-2, మైక్రోబయోలజీ-1, ఫోరెన్సిక్ మెడిసిన్-1, కమ్యూనిటీ మెడిసిన్-1, జనరల్ మెడిసిన్-5, పిడియాట్రిక్స్-3, డీవీఎల్-1, సైకియాట్రిక్-1, జనరల్ సర్జరీ-5, ఆర్థోపెడిక్-2, ఈఎన్టీ-1, ఓబీజీ-6, అనస్తీషియా-4, రేడియో డయాగ్నోసిస్-2, హాస్పిటల్ అడ్మిన్-1 పోస్ట్లను కేటాయించింది.
జిల్లా ప్రభుత్వ మెడికల్ కాలేజీకి అనుబంధంగా నిర్మిస్తున్న 380 ప్రభుత్వ జనరల్ ఆసుపత్రితోపాటు 20 పడకల ఐసీయూ కలిపి మొత్తం 400 పడకల ఆసుపత్రి అందుబాటులోకి వచ్చినట్లయితే జిల్లా ప్రజలకు సూపర్ స్పెషాలిటీ వైద్య సేవలు అందుబాటులోకి రానున్నాయి. దాదాపు 26 రకాల వైద్య సేవలు గ్రామీణ ప్రాంతంతో కూడుకొని ఉన్న జిల్లా ప్రజలకు అందుబాటులోకి రానున్నాయి. జిల్లాలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలన్నీ కమ్యూనిటీ హెల్త్ సెంటర్లుగా మారనున్నాయి. జిల్లా మెడికల్ కాలేజీకి అనుబంధ ఆసుపత్రి పూర్తయితే అత్యాధునిక వైద్య చికిత్సలు కూడా ప్రజలకు అందుబాటులోకి రానున్నాయి. ప్రభుత్వ మెడికల్ కాలేజీ విద్యార్థులు ఒక్కో విద్యార్థి ఐదు కుటుంబాలను దత్తత తీసుకొని సంబంధిత కుటుంబాల హెల్త్ రిపోర్ట్ను తయారు చేసి ఎప్పటికప్పుడు వారి ఆరోగ్య పరిస్థితులను తెలుసుకుంటూ తగు సూచనలు, వైద్యాన్ని అందించనున్నారు.
మరోవైపు జిల్లా ప్రభుత్వ మెడికల్ కాలేజీకి అనుబంధ ఆసుపత్రిని మరో రెండు నెలల్లో అందుబాటులోకి తీసుకువచ్చేందుకు నిర్మాణ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. ప్రభుత్వ మెడికల్ కాలేజీకి అనుబంధంగా 380 పడకలతో ప్రభుత్వ జనరల్ ఆసుపత్రి, 20 పడకల ఐసీయూను అందుబాటులోకి తీసుకువచ్చేందుకు రూ.30 కోట్లతో మూడంతస్తుల భవన నిర్మాణ పనులు వేగంగా జరుగుతున్నాయి. మొదటి సంవత్సరంలో మెడికల్ విద్యార్థులకు కేవలం థియరీ తరగతులు మాత్రమే ఉండనుండగా, రెండో సంవత్సరం నుంచి ఆసుపత్రిలో ప్రాక్టీస్ చేయాల్సి ఉంటుంది. ఆలోగా జనరల్ ఆసుపత్రి అందుబాటులోకి రానున్నది.