షాబాద్ : ముఖ్యమంత్రి కేసీఆర్ పల్లెల రూపురేఖలు మార్చేందుకు ప్రతి నెలా నిధులు ఇస్తూ కృషి చేస్తున్నారని విద్యాశాఖ మంత్రి సబితాఇంద్రారెడ్డి అన్నారు. పల్లెప్రగతి గ్రామాల గతినే మార్చివేసిందని, తెలంగాణలోని గ్రామాలు నేడు స్వచ్ఛతతోపాటు అన్ని రకాల సదుపాయాలతో విరాజిల్లుతున్నాయని చెప్పారు. రంగారెడ్డిజిల్లా మహేశ్వరం మండల ప్రజాప్రతినిధులతో మంత్రి తన కార్యాలయంలో గురువారం సమీక్ష నిర్వహించారు. గ్రామాల్లో నెలకొన్న సమస్యలు, పల్లెప్రగతిలో భాగంగా నడుస్తున్న పనులపై సమీక్షించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. అధికారులు ప్రతి సోమవారం కార్యాలయంలో అందుబాటులో ఉండాలని ఆదేశించారు. ఆకస్మిక తనిఖీలు చేపడుతానని చెప్పారు.
మిషన్ భగీరథ కార్యక్రమంలో భాగంగా ఇంటింటికీ నల్లాలు దాదాపు పూర్తయ్యాయని, మిగిలిన పనులను వెంటనే పూర్తిచేయాలన్నారు. గుడి, బడి, దవాఖాన, హాస్టళ్లు, అంగన్వాడీ కేంద్రాలు తదితర వాటికి నల్లా కనెక్షన్లు ఇచ్చేలా స్థానిక ప్రజాప్రతినిధులు చొరవ చూపాలని మంత్రి సూచించారు. సమావేశంలో జడ్పీ చైర్పర్సన్ అనితారెడ్డి, ఎంపీపీ రఘుమారెడ్డి, వైస్ ఎంపీపీ సునీత, తహసీల్దార్ జ్యోతి, ఎంపీడీవో నర్సింలు ఉన్నారు.