చేవెళ్ల పార్లమెంట్ స్థానంలో గెలుపే లక్ష్యంగా బీఆర్ఎస్ పార్టీ ముందుకెళ్తున్నది. ఇందుకోసం వరుసగా నియోజకవర్గ స్థాయి సన్నాహక సమావేశాలు నిర్వహిస్తూ ప్రజల్లోకి దూసుకెళ్తున్నది. బీఆర్ఎస్ అభ్యర్థి కాసాని జ్ఞానేశ్వర్కు ప్రజల నుంచి అనూహ్య మద్దతు లభిస్తున్నది. బీసీలతోపాటు అన్ని వర్గాల ప్రజలు అతడిని గెలిపించుకునేందుకు సిద్ధమవుతున్నారు.
వికారాబాద్, మార్చి 31 (నమస్తే తెలంగాణ): పార్లమెంట్ ఎన్నికల ప్రచారం జోరందుకున్నది. చేవెళ్ల పార్లమెంట్ నుంచి బరిలో ఉండే అభ్యర్థులను బీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీలు ప్రకటించడంతో వారు ప్రచారంలో దూసుకుపోతున్నారు. చేవెళ్ల పార్లమెంట్ నియోజకవర్గం నుంచి మరోసారి గెలుపొంది హ్యాట్రిక్ విజయం సాధించేలా బీఆర్ఎస్ పార్టీ పక్కా వ్యూహంతో ముందుకెళ్తున్నది. ఇప్పటికే బీఆర్ఎస్ అధినేత కేసీఆర్తోపాటు బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ చేవెళ్ల పార్లమెంట్ నియోజకవర్గంలోని ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేలు, ముఖ్యనేతలతో సమావేశమై గెలుపుపై దిశానిర్దేశం చేశారు. అంతేకాకుండా ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో సుదీర్ఘ రాజకీయ అనుభవంతోపాటు మంచి పేరున్న కాసాని జ్ఞానేశ్వర్ను అభ్యర్థిగా నిలిపి బీఆర్ఎస్ పార్టీ గెలుపుపై ధీమాను వ్యక్తం చేస్తున్నది.
అంతేకాకుండా ప్రచారంలో ముందున్న బీఆర్ఎస్ పార్టీ.. నియోజక వర్గ స్థాయి సన్నాహక సమావేశాలను నిర్వహిస్తూ ప్రజల్లోకి విస్తృతంగా వెళ్తున్నది. ఇప్పటికే జిల్లాలోని పరిగి, తాండూరు నియోజకవర్గస్థాయి సన్నాహక సమావేశాలు పూర్తికాగా, ఈనెల 3న వికారాబాద్ నియోజకవర్గ స్థాయి సమావేశం జరుగనున్నది. కాసాని జ్ఞానేశ్వర్కు చేవెళ్ల పార్లమెంట్ నియోజకవర్గ ప్రజల నుంచి అనూహ్య స్పందన వస్తున్నది. బీసీలతోపాటు అన్ని వర్గాల ప్రజలు అతడిని గెలిపించుకునేందుకు సిద్ధమవుతున్నారు. కాసానిని గెలిపించాల్సిన బాధ్యతను ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో పట్టున్న మాజీ మంత్రి, మహేశ్వర్ ఎమ్మెల్యే పి. సబితాఇంద్రారెడ్డికి పార్టీ అధిష్ఠానం బాధ్యతలు అప్పగించింది. దీంతో ఆమె ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలోని అన్ని నియోజకవర్గాల్లో నిర్వహిస్తున్న సమావేశాల్లో పాల్గొంటూ పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేస్తూ విజయానికి కృషి చేస్తున్నారు.
బీఆర్ఎస్ పార్టీని మోసం చేసి కాంగ్రెస్లో చేరి.. ఆ పార్టీ అభ్యర్థిగా బరిలో నిలిచిన రంజిత్రెడ్డి అయోమయంలో పడ్డారు. ఆయన కాంగ్రెస్లో చేరడంతో పలువురు నాయకులు విమర్శిస్తున్నారు. ఇటీవల మహేశ్వరం నియోజకవర్గంలో జరిగిన సమావేశంలో సాక్షాత్తు సీఎం రేవంత్రెడ్డి ఎదుటే పరోక్షంగా రంజిత్రెడ్డిపై ఆ పార్టీ నేత కేఎల్ఆర్ విమర్శలు చేశారు. అంతేకాకుండా బీఆర్ఎస్ పార్టీ నుంచి పెద్ద ఎత్తున తన వెంట క్యాడర్ వస్తుందని భావించినా.. కాంగ్రెస్ పార్టీలోకి రంజిత్రెడ్డి అనుచరులను చేర్చుకోవద్దని బహాటంగానే సీఎంకు చెప్పినట్లు ప్రచారం జరుగుతున్నది.
ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా మాట్లాడి, వ్యతిరేకంగా కార్యకలాపాలు చేసిన రంజిత్రెడ్డికి ఈ పార్లమెంట్ ఎన్నికల్లో జిల్లాకు చెందిన కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు, కార్యకర్తలు, నాయకులు సపోర్టుగా పనిచేస్తారా..? అన్న దానిపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. పైకి గెలిపించుకుంటామంటూ చెబుతున్నా ఎమ్మెల్యే ఎన్నికల్లో తమకు వ్యతిరేకంగా పనిచేసిన రంజిత్రెడ్డిని ఎలాగైనా ఓడించాలనే కసితో కాంగ్రెస్ నేతలు, శ్రేణులు ఉన్నట్లు ప్రచారం జరుగుతున్నది.
అంతేకాకుండా చేవెళ్ల లోక్సభ టికెట్ ఆశించి భంగపడిన పట్నం మహేందర్రెడ్డి కుటుంబం కూడా రంజిత్రెడ్డికి ఈ ఎన్నికల్లో సహకరిస్తుందా..? అనే అనుమానమూ వెంటాడుతున్నది. వీటన్నింటిని పరిశీలిస్తే కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న రంజిత్రెడ్డిని సొంత పార్టీ నేతలే ఓడించడం ఖాయమనే ప్రచారమూ ఉన్నది..!
ఎన్నికల ప్రచారంలో ప్రజలను నమ్మించేందుకు బీజేపీ అభ్యర్థి కొండా విశ్వేశ్వర్రెడ్డి పడరాని పాట్లు పడుతున్నారు. ఆశీర్వాద యాత్ర పేరుతో ప్రస్తుతం పరిగి నియోజకవర్గంలో ఊరూరా తిరుగుతూ ప్రచారం చేస్తున్నారు. అయితే ఆయన ఎంపీగా ఉన్న సమయంలో తమ బాధలను చెప్పుకొనేందుకు వెళ్లిన జనాలను కలవకుండా, వారి సమస్యలను వినకుండా వెనక్కి పంపించిన కొండా విశ్వేశ్వర్రెడ్డి ప్రచారంలో ప్రజల మద్దతు కూడగట్టేందుకు ఒక్క అవకాశం ఇవ్వాలంటూ బతిమిలాడుకుంటున్నారు. అయినా ప్రజల నుంచి స్పందన రాకపోవడం గమనార్హం.
గతంలో బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేయగా చేవెళ్ల ప్రజలు విశ్వేశ్వర్రెడ్డిని గెలిపించారు. గెలిచిన తర్వాత చేవెళ్ల నియోజకవర్గ అభ్యున్నతికి ఏ ఒక్క ప్రాజెక్టునూ తీసుకురాలేదు. అంతేకాకుండా గెలిచిన తర్వాత తమ సమస్యలను చెప్పుకొనేందుకు వెళ్లిన ప్రజలకు అపాయింట్మెంట్ ఉందా..? అంటూ కోపమై వెనక్కి పంపిన ఆయన మాకు వద్దే..వద్దంటూ ఊరూరా జోరుగా ప్రచారం జరుగుతున్నది. ఆయన్ను నమ్మి మరోసారి మోసపోలేమని.. ఎంపీగా గెలిపించబోమని ప్రజలు స్పష్టం చేస్తున్నారు.