వికారాబాద్, అక్టోబర్ 15 (నమస్తే తెలంగాణ) : బీఆర్ఎస్ పార్టీ ప్రచారం ఇక జోరందుకోనున్నది. హుస్నాబాద్ నుంచి రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ఎన్నికల శంఖారావాన్ని పూరించడంతో నేటి నుంచి ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించేందుకు జిల్లాలోని వికారాబాద్, తాండూ రు, పరిగి, కొడంగల్ నియోజకవర్గాల బీఆర్ఎస్ అభ్యర్థులు అంతా సిద్ధం చేసుకున్నారు. ఆదివారం కొడంగల్ నియోజకవర్గ అభ్యర్థిగా పట్నం నరేందర్రెడ్డికి బీ-ఫామ్ను సీఎం కేసీఆర్ అందజేయగా.. వికారాబాద్, పరిగి, తాండూరు నియోజకవర్గ అభ్యర్థులుగా ఆనంద్, మహేశ్రెడ్డి, రోహిత్రెడ్డిలకు నేడు బీ-ఫామ్లను అందజేయనున్నారు. ఇప్పటికే ఆయా నియోజకవర్గాల్లో అభివృద్ధి పనుల శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాల కార్యక్రమాలతో నియోజకవర్గమంతటా ఒక విడుత ప్రచారాన్ని పూర్తి చేసిన అభ్యర్థులు.. ప్రచారానికి ఇంకా 45 రోజులే గడువుండడంతో నేటి నుంచి క్షేత్రస్థాయిలో ప్రజల్లోకి వెళ్లి ప్రచారం చేయనున్నారు. అభ్యర్థులు బైక్ ర్యాలీలు, రోడ్ షోలు, సభలు, సమావేశాలు, ఇంటింటి ప్రచారాలతో జెట్ స్పీడ్లో దూసుకుపోనున్నారు. గులాబీ బాస్, సీఎం కేసీఆర్ కూడా అభ్యర్థులకు మద్దతుగా అన్ని నియోజకవర్గాల్లోనూ నవంబర్ మొదటి వారం లేదా రెండో వారంలో సభలు నిర్వహించి బీఆర్ఎస్ అభ్యర్థులకు మద్దతుగా ప్రచారం చేయనున్నారు. బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కూడా జిల్లాలోని వికారాబాద్, తాండూరు, పరిగి, కొడంగల్ నియోజకవర్గాల్లో రోడ్ షోలతో బీఆర్ఎస్ అభ్యర్థులకు మద్దతుగా ప్రచారంలో పాల్గొననున్నారు. ఏ నియోజకవర్గంలో ఎప్పుడు సభలు నిర్వహించనున్నారనే దానిపై కూడా బీఆర్ఎస్ పార్టీ అధిష్టానం త్వరలోనే షెడ్యూల్ను ప్రకటించనుంది. వికారాబాద్, కొడంగల్ నియోజకవర్గాల్లో నేటి నుంచి ఎమ్మెల్యేలు మెతుకు ఆనంద్, పట్నం నరేందర్రెడ్డి ప్రచారాన్ని ప్రారంభించనుండగా, రేపటి నుంచి పరిగి, తాండూరు నియోజకవర్గ ఎమ్మెల్యేలు కొప్పుల మహేశ్రెడ్డి, పైలట్ రోహిత్రెడ్డి ప్రచారాన్ని షురూ చేయనున్నారు.
వికారాబాద్ నియోజకవర్గానికి సంబంధించి ఎమ్మెల్యే ఆనంద్ ఎన్నికల ప్రచారాన్ని వికారాబాద్ మండలం పెండ్లమడుగు గ్రామం నుంచి ప్రారంభించనున్నారు. మొదటి రోజు ప్రచారంలో భాగంగా పెండ్లిమడుగుతోపాటు నారాయణపూర్, పుల్మద్ది, ఎర్రవల్లి, అత్వెల్లి గ్రామాల్లో నేడు ఇంటింటికీ ప్రచారం చేయనున్నారు. కొడంగల్ నియోజకవర్గానికి సంబంధించి సోమవారం బొంరాస్పేట్ మండలం మదన్పల్లి గ్రామంలోని ఆంజనేయస్వామి ఆలయంలో ఎమ్మెల్యే నరేందర్రెడ్డి ప్రత్యేక పూజలు చేసి.. మంత్రి మహేందర్రెడ్డితో కలిసి మరో నాలుగు గ్రామాల్లో ప్రచారం నిర్వహించనున్నారు. పరిగి నియోజకవర్గంలో రేపు కులకచర్ల మండలస్థాయి సమావేశంతో ప్రచారాన్ని ప్రారంభించనున్న మహేశ్రెడ్డి, ఈ నెల 18న గండీడ్, 19న పూడూరు, 22న పరిగి, 25న దోమ మండల స్థాయి సమావేశాలను నిర్వహించనున్నారు. తదనంతరం ఊరూరా ప్రచారం చేయనున్నారు. మరోవైపు తాండూరు నియోజకవర్గానికి సంబంధించి రేపు బషీరాబాద్ మండల ఆత్మీయ సమ్మేళనంతో తన ప్రచారాన్ని ఎమ్మెల్యే రోహిత్రెడ్డి ప్రారంభించనున్నారు.