వికారాబాద్, ఫిబ్రవరి 1 : పార్లమెంట్ ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పావులు కదుపుతున్నారు. లోక్ సభ ఎన్నికలకు గులాబీ సైన్యాన్ని సన్నద్ధం చేసేందుకు అసెంబ్లీ నియోజకవర్గ స్థాయి కార్యకర్తలతో ఆయన విస్తృత స్థాయి సమావేశాలు నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా శుక్రవారం వికారాబాద్ జిల్లా కేంద్రంలో నిర్వహించనున్న విస్తృత స్థాయి సమావేశానికి కేటీఆర్ ముఖ్యఅతిథిగా హాజరై పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేయనున్నారు.
ఉదయం 9:30గంటలకు జరిగే ఈ సమావేశంలో నియోజకవర్గ బీఆర్ఎస్ ప్రజా ప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు పాల్గొనున్నారు. పార్లమెంట్ ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహం, పార్టీ పటిష్టతకు తీసుకోవాల్సిన చర్యలపై పార్టీ శ్రేణులకు పలు సూచనలు చేయనున్నారు. అసెంబ్లీ ఎన్నికల ఓటమికి గల కారణాలను అన్వేషిస్తూనే.. అ పొరపాట్లు లోక్ సభ ఎన్నికల్లో పునరావృతం కాకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలను వివరించనున్నారు.