కల్వకుర్తి, మే 8 : గ్యారెంటీల పేరుతో మోసం చేసిన కాంగ్రెస్ను, పేదల కడుపులు కొట్టి పెద్దల కడుపు నింపుతున్న బీజేపీలను ఎంపీ ఎన్నికల్లో తరిమికొట్టాలని బీఆర్ఎస్ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. పేగులు మెడలో వేసుకుంటా.. కత్తెరను జేబులో పెట్టుకుని తిరుగుతా.. అంటూ రోత మాటలు, వెకిలి చేష్టలతో తెలంగాణ పరువు తీస్తున్న ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి ఎన్నటికీ పరిపాలన దక్షుడు కాలేడని ఎద్దేవా చేశారు. పరిపాలన అంటే పాన్డబ్బా నడపడం కాదని హితవు పలికారు. కల్వకుర్తిలోని హైదరాబాద్ చౌరస్తాలో మాజీ ఎమ్మెల్యే జైపాల్యాదవ్ అధ్యక్షతన జరిగిన రోడ్షోలో పార్లమెంట్ ఎన్నికల ఇన్చార్జి చాడ కిషన్రెడ్డి, ఫుడ్ కార్పొరేషన్ చైర్మన్ గోలి శ్రీనివాస్రెడ్డి, మిషన్ భగీరథ కార్పొరేషన్ మాజీ వైస్ చైర్మన్ ఉప్పల వెంకటేశ్, ఎంపీ అభ్యర్థి ఆర్ఎస్ ప్రవీణ్కుమార్తో కలిసి ఆయన రోడ్షో నిర్వహించారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ ముందుచూపుతో ఆలోచిస్తూ ప్రజల సంక్షేమాన్ని కాంక్షిస్తూ, ఇచ్చిన హామీలను అమలు చేస్తూ, అభివృద్ధిలో రాష్ర్టాన్ని ముందుకు తీసుకెళ్లడమే పరిపాలన దక్షత అని, ఇది కేసీఆర్కు పుష్కలంగా ఉందన్నారు.
ప్రజలను నమ్మించి మోసం చేసి అధికారంలోకి వచ్చిన రేవంత్రెడ్డికి ఓట్లు అడిగే నైతిక హక్కులేదని మండిపడ్డారు. ఆరు గ్యారెంటీల్లో ఐదు గ్యారెంటీలు అమలు చేశామని హోర్డింగ్లతో ప్రచారం చేసుకుంటున్న సీఎం రేవంత్రెడ్డిని ప్రజలు నిలదీయాలి. అబద్ధ్దపు హామీలు ఇచ్చి గద్దెనెక్కిన కాంగ్రెస్ నాయకులు ఏ మోహం పెట్టుకుని గ్రామాల్లోకి ఓట్లు అడగటానికి వస్తున్నారని ప్రశ్నించారు. ఎన్నికల వరకు ఓడ మల్లన్న అంటూ ఎన్నో హామీలు ఇచ్చిన కాంగ్రెస్ పార్టీ ఎన్నికలయ్యాక హామీలను విస్మరించి ప్రజలను బోడమల్లన్నలంటూ రాష్ర్టాన్ని లూఠీ చేస్తున్నారన్నారు. పరిపాలనకు వచ్చే సరికి లంకె బిందెలు లేవు.. ఖాళీ బిందెలు మాత్రమే ఉన్నాయని అంటున్న రేవంత్రెడ్డికి కొండారెడ్డిపల్లిలోని పాత జ్ఞాపకాలు గుర్తుకు వస్తున్నాయేమో అంటూ సెటైర్లు వేశారు. మార్పు చేస్తానని అధికారంలోకి వచ్చిన రేవంత్ ప్రభుత్వం కాంగ్రెస్ మార్క్ దోపిడీకి తెరలేపిందని విమర్శించారు. కేసీఆర్ గురుకులాలను స్థాపిస్తే గురుకులాల కార్యదర్శిగా ఆర్ఎస్ ప్రవీణ్కుమార్ విద్యాలయాలను సమర్థవంతంగా నిర్వహించి ఎంతో మంది విద్యార్థులను ప్రయోజకులను చేశారనే విషయాలను కేటీఆర్ గుర్తు చేశారు. నాగర్కర్నూల్తో పాటు రాష్ట్రంలో అన్ని పార్లమెంట్ స్థానాలలో బీఆర్ఎస్ అభ్యర్థులను గెలిపిస్తే కాంగ్రెస్ పార్టీ మెడలు వంచి ఇచ్చిన హామీలను అమలు చేయించేలా చేస్తామన్నారు.
ఈ ఎన్నికల్లో చోటేభాయ్ కాంగ్రెస్, బడేభాయ్ బీజేపీలతో బీఆర్ఎస్ పోటీపడుతున్నదన్నారు. బీఆర్ఎస్కు అండగా నిలువాల్సిన అవసరం ప్రజలకు ఉన్నదన్నారు. కృష్ణా జలాల్లో అన్యాయం జరుగుతున్నా కాంగ్రెస్ నోరు మెదపడం లేదన్నారు. పాలమూరు- రంగారెడ్డి ప్రాజెక్టుకు జాతీయ హోదా ఇవ్వాలని ఎన్నిసార్లు మొర పెట్టుకున్నా కేంద్ర సర్కార్ పట్టించుకోలేదని, ఇప్పుడు మాత్రం ఓట్లు కావాలని అడుగుతున్నారని దుయ్యబట్టారు. కేసీఆర్ రాష్ట్రంలో సాగునీటి విప్లవం తీసుకువచ్చారన్నారు. అందులో భాగంగానే ప్రాజెక్టులు, రిజర్వాయర్లు నిర్మించిన సంగతిని గుర్తు చేశారు. కేవలం రాముడి గుడి నిర్మించామని.. ఓట్లు తమకే వేయాలని అంటున్న బీజేపీ, రాష్ట్రంలో కేసీఆర్ యాదాద్రి లక్ష్మీనర్సింహస్వామి దేవాలయం నిర్మించారని, ఆధునిక దేవాలయాలైన సాగునీటి ప్రాజెక్టులను నిర్మించారని దీనికేమి సమాధానం చెబుతారని ప్రశ్నించారు. క్రూడాయిల్ ధర తగ్గినా ప్రజలపై 34 శాతం పన్నులు వేసిన బీజేపీ ప్రజలకు మేలు చేయకుండా అదానీ, అంబానీలకు సంపద దోచిపెడుతున్నదన్నారు. ఇదివరకు ఒక సారి మోసపోయారు, మరోసారి మోస పోవద్దని పిలుపునిచ్చారు. సమర్థవంతుడైన ఆర్ఎస్ ప్రవీణ్కుమార్కు ఓటు వేసి పార్లమెంట్కు పంపిస్తే పేదల గొంతుకగా పార్లమెంట్లో ఉంటాడని చెప్పారు.
సమస్యల పరిష్కారానికి పోరాడుతా : అభ్యర్థి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్
బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి ఆర్ఎస్ ప్రవీణ్కుమార్ మాట్లాడుతూ ముందుగా బంజారా భాషలో గిరిజనులకు అభివాదం చేశారు. పార్లమెంట్కు పంపిస్తే దశాబ్దాలుగా పెండిండ్లో ఉన్న నాగర్కర్నూల్ జిల్లా సమస్యల పరిష్కారానికి పోరాడుతానని హామీ ఇచ్చారు. కేసీఆర్ వల్లనే రైతుబంధు, మిషన్ భగీరథ వంటి గొప్ప సంక్షేమ పథకాలు అమలయ్యాయని చెప్పారు. గురుకులాలను గొప్పగా తీర్చిదిద్దిన ఆదర్శవంతుడు కేసీఆర్ అని అన్నారు. రేవంత్రెడ్డి పాలనలో ప్రజలకు కన్నీళ్లు మిగిలాయని ఆవేదన వ్యక్తం చేశారు. కాంగ్రెస్, బీజేపీలు ఇచ్చే మోసపూరిత హామీలను నమ్మవద్దని పిలుపునిచ్చారు. బీజేపీ అధికారంలోకి వస్తే రాజ్యాంగం రద్దవుతుందని, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ రిజర్వేషన్లు రద్దు అవుతాయని, రాజ్యాంగాన్ని కాపాడుకోవాల్సిన అవసరం మనందరిపై ఉందన్నారు. మే 13న జరుగబోయే పార్లమెంట్ ఎన్నికల్లో కారుగుర్తుకు ఓటు వేసి భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు. రోడ్షోలో మున్సిపల్ చైర్మన్ ఎడ్మ సత్యం, జడ్పీటీసీ సభ్యులు విజితారెడ్డి, దశరథనాయక్, వైస్ఎంపీపీ గోవర్థన్, విజయ్గౌడ్, గణేశ్ తదితరులు పాల్గొన్నారు.