ప్రజా సమస్యల పరిష్కారమే లక్ష్యంగా బీఆర్ఎస్ ప్రజాప్రతినిధులు ప్రజల్లోకి వెళ్తున్నారు. ప్రత్యేక కార్యక్రమాల పేరిట నియోజకవర్గవ్యాప్తంగా పర్యటిస్తున్నారు. నిత్యం ఊరూరా పాదయాత్ర చేస్తూ ప్రజా సమస్యలపై ఆరా తీస్తున్నారు. అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల అమలు తీరును పర్యవేక్షిస్తున్నారు. ఆయా విభాగాల అధికారులను వెంటబెట్టుకొని గ్రామాల్లో తిరుగుతూ సమస్యలకు సత్వరమే పరిష్కారం చూపుతున్నారు. వికారాబాద్ ఎమ్మెల్యే మెతుకు ఆనంద్ ఇప్పటివరకు 128 గ్రామాల్లో పర్యటించగా, తాండూరు ఎమ్మెల్యే రోహిత్రెడ్డి బషీరాబాద్, యాలాల, తాండూరు, పెద్దేముల్ మండలాల్లోని అన్ని గ్రామాల్లో పాదయాత్రను పూర్తి చేశారు. అదేవిధంగా పరిగి ఎమ్మెల్యే కొప్పుల మహేశ్ రెడ్డి వారం రోజుల క్రితమే పర్యటన ప్రారంభించగా.. రోజుకు ఐదారు గ్రామాల చొప్పున పూర్తి చేస్తున్నారు. ఇక కొడంగల్ ఎమ్మెల్యే నరేందర్రెడ్డి, చేవెళ్ల ఎమ్మెల్యే కాలె యాదయ్యలు ఇప్పటికే పలు మండలాల్లో పాదయాత్రను పూర్తి చేసి సమస్యలను పరిష్కరించారు. ప్రజల వద్దకే ప్రజాప్రతినిధులు, అధికారులు వచ్చి సమస్యలను తెలుసుకొని మరీ పరిష్కరించడంపై సర్వత్రా హర్షం వ్యక్తమవుతున్నది.
-వికారాబాద్, ఏప్రిల్ 17 (నమస్తే తెలంగాణ)
వికారాబాద్, ఏప్రిల్ 17 (నమస్తే తెలంగాణ): ప్రజలు తమ సమస్యలను విన్నవించుకునేందుకు ప్రజాప్రతినిధులు, అధికారుల వద్దకు వెళ్లాల్సిన అవసరం లేదు.. ప్రజల వద్దకొచ్చే సమస్యలకు పరిష్కారం చూపేలా సరికొత్త కార్యక్రమాలకు బీఆర్ఎస్ ప్రజాప్రతినిధులు శ్రీకారం చుట్టారు. ప్రతి సోమవారం కలెక్టరేట్లో ప్రజావాణి పేరిట కలెక్టర్ ఆధ్వర్యంలో ప్రజా సమస్యలకు సంబంధించి వినతులను స్వీకరించి దశల వారీగా పరిష్కరిస్తున్నారు. అయితే ప్రజాప్రతినిధులు, అధికారులు ఒకేచోట ఉన్నట్లయితే అక్కడిక్కడే పరిష్కారమయ్యే సమస్యలు చాలా ఉంటాయి. ఇదే ఉద్దేశంతో సీఎం కేసీఆర్ ఆదేశాలతో జిల్లాకు చెందిన ఎమ్మెల్యేలు క్షేత్రస్థాయిలో సమస్యలను పరిష్కరించడమే లక్ష్యంగా పల్లెబాట పట్టారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఒక్కొక్కరు ఒక్కో కార్యక్రమం పేరిట ప్రజల్లోకి వెళ్తూ, సమస్యలను పరిష్కరిస్తున్నారు. క్షేత్రస్థాయి పర్యటనల్లో ప్రజాప్రతినిధుల దృష్టికొచ్చే పలు రకాల సమస్యలను అధికారులు అక్కడిక్కడే పరిష్కరిస్తున్నారు. అయితే ప్రధానంగా మిషన్ భగీరథ, నేలకొరిగిన విద్యుత్తు స్తంభాలు, వేలా డే వైర్లు, డ్రైనేజీ, రోడ్లు, రైతుబంధు, ఆసరా పింఛన్లు, రెవెన్యూ సమస్యలను ప్రజాప్రతినిధుల దృష్టికి ప్రజలు తీసుకెళ్తున్నారు. సంబంధిత సమస్యల పరిష్కారానికి అధికారులను ఎమ్మెల్యే లు ఆదేశిస్తుండటంతో అక్కడిక్కడే సమస్యలు పరిష్కారమవుతున్నాయి. అంతేకాకుండా బీఆర్ఎస్ ప్రజాప్రతినిధులు చేపట్టిన పల్లెబాట కార్యక్రమాలతో అన్ని శాఖల అధికారుల్లోనూ సమన్వయం పెరిగింది. బీఆర్ఎస్ ప్రభుత్వం అమలు చేస్తున్న రైతుబంధు, ఆసరా, రైతుబీమా, కల్యాణలక్ష్మి, షాదీముబార క్, మిషన్ భగీరథ తదితర సంక్షేమ పథకాల ఫలాలు ప్రతి ఒక్కరికీ అందుతున్నాయో లేదో ఎమ్మెల్యేలు ప్రత్యక్షంగా ఆరా తీసి.. ప్రజలను అడిగి తెలుసుకుంటున్నారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు చేపట్టిన కార్యక్రమాలతో ప్రజల సమస్యలు అక్కడికక్కడే పరిష్కారం అవుతుండటంపై జిల్లావాసుల హర్షం వ్యక్తం చేస్తున్నారు.
నవాబుపేటలో శుభోదయంతో ..
చేవెళ్ల ఎమ్మెల్యే కాలె యాదయ్య శుభోదయం కార్యక్రమాన్ని చేపట్టి ప్రజలకు చేరువయ్యారు. ప్రతిరోజూ ఉదయం 6 నుం చి మధ్యాహ్నం వరకు గ్రామాల్లో పర్యటిస్తూ ప్రజా సమస్యలను పరిష్కరిస్తున్నారు. మిషన్ భగీరథ పైప్లైన్ లీకేజీ, విద్యు త్తు వైర్లు వేలాడటం, డ్రైనేజీ, రోడ్లు తదితర సమస్యలు తన దృష్టికి రాగానే వెంటనే అధికారులను ఆదేశించి పరిష్కారం చూపుతున్నారు. ఇప్పటికే నవాబుపేట మండలంలో ఈ కార్యక్రమం పూర్తికాగా త్వరలోనే మిగిలిన మండలాల్లో ఈ కార్యక్రమాన్ని ప్రారంభించనున్నారు.
మీతో నేనుతో ప్రజల్లోకి ఎమ్మెల్యే ఆనంద్
వికారాబాద్ నియోజకవర్గంలో ప్రజా సమస్యల పరిష్కారానికి ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్ మీతో నేను కార్యక్రమంతో ప్రజల్లోకి వెళ్తున్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా ఉదయం 6.30 గంటల నుంచే గ్రామాల్లో పర్యటిస్తూ గ్రామ, మండల స్థాయి సమస్యలకు అక్కడికక్కడే పరిష్కారం చూపుతున్నారు. ఇప్పటివరకు వికారాబాద్, ధారూర్, మర్పల్లి, మోమిన్పేట, బం ట్వారం, కోట్పల్లి మండలాల్లో మొత్తం 131 గ్రామాలుండగా.. అందులో 128 గ్రామాల్లో మీతో నేను కార్యక్రమంలో ఎమ్మెల్యే ఆనంద్ పాల్గొని స్థానికంగా ప్రజా సమస్యలకు పరిష్కారం చూపారు. వికారాబాద్ మున్సిపాలిటీలోనూ మూడు వార్డులు మినహా మిగతా వార్డుల్లో ఈ కార్యక్రమాన్ని పూర్తి చేశారు. ఈ కార్యక్రమంలో భాగంగా ఎమ్మెల్యేతోపాటు మండల, గ్రామ స్థాయి అధికారులు కూడా పాల్గొని సమస్యలను బట్టి ఆయా స్థాయిలో పరిష్కరిస్తున్నారు. జిల్లా స్థాయి సమస్యలైతే సంబంధిత శాఖల అధికారుల దృష్టికి ఎమ్మెల్యే ఆనంద్ తీసుకెళ్తున్నారు. ప్రధానం గా తాగునీరు, విద్యు త్తు, ఆసరా పింఛన్లు తదితర సమస్యలకు వెంటనే పరిష్కారం చూపుతున్నారు.
‘పల్లె పల్లెకూ పైలెట్’..
తాండూరు నియోజకవర్గంలోని ప్రజా సమస్యలను అక్కడిక్కడే పరిష్కరించడమే లక్ష్యంగా ఎమ్మెల్యే పైలెట్ రోహిత్రెడ్డి పల్లె పల్లెకూ పైలెట్ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ఈ కార్యక్రమాన్ని బషీరాబాద్ మండలం నుంచి ఆయన ప్రారంభించారు. ఇప్పటికే బషీరాబాద్, యాలాల, తాండూరు, పెద్దేముల్ మండలాల్లో ఈ కార్యక్రమం పూర్తికాగా దాదాపుగా గ్రామ, మండల స్థాయి సమస్యలకు ఎమ్మెల్యే పరిష్కారం చూపారు. ఈ కార్యక్రమాన్ని ప్రతిరోజూ 7 గ్రామాల్లో నిర్వహిస్తున్నారు. అంతేకాకుండా నియోజకర్గ అభివృద్ధికి సీఎం కేసీఆర్ భారీగా నిధులు మంజూరు చేసిన దృష్ట్యా పల్లెపల్లెకూ పైలెట్ కార్యక్రమంలో భాగంగా వెళ్లిన గ్రామాల్లో ప్రజలు అడిగిన అభివృద్ధి పనులకు ఎమ్మెల్యే వెంటనే నిధులను కేటాయిస్తున్నారు. ఒక్కో గ్రామ అభివృద్ధికి రూ.50 లక్షల చొప్పున నిధులను కేటాయిస్తున్నారు.
పరిగిలో మహేశ్రెడ్డి పల్లెబాట
పరిగి నియోజకవర్గంలో సమస్యలను పరిష్కరించడంతోపాటు ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు ఎమ్మెల్యే కొప్పుల మహేశ్రెడ్డి పల్లెబాట కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. వారం రోజుల క్రితం పరిగి మండలం నుంచి ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ప్రతిరోజూ 5 నుంచి 6 గ్రామాల్లో పర్యటిస్తూ ప్రజా సమస్యలు వింటూ స్థానికంగా పరిష్కారమయ్యే సమస్యలుంటే వాటిని అక్కడిక్కడే పరిష్కరిస్తున్నారు. అదేవిధంగా ఆయా గ్రామాల్లో అవసరమయ్యే రోడ్లు, డ్రైనేజీ తదితర అభివృద్ధి పనులకు ఎమ్మెల్యే నిధులను మంజూరు చేస్తున్నారు.
కొడంగల్లో మన ఊరు..మన ఎమ్మెల్యే
కొడంగల్ ఎమ్మెల్యే పట్నం నరేందర్రెడ్డి మన ఊరు..మన ఎమ్మెల్యే కార్యక్రమంతో ప్రజల్లోకి వెళ్తున్నారు. కొడంగల్ మున్సిపాలిటీలో ప్రజల వద్దకు వెళ్తూ సమస్యలను పరిష్కరిస్తున్నారు. మిషన్ భగీరథ, సీసీ రోడ్లు, డ్రైనేజీ, ఆసరా పింఛన్లు తదితర సమస్యలకు ఎమ్మెల్యే నరేందర్రెడ్డి పరిష్కారాన్ని చూపుతున్నారు. గ్రామాల్లో ఇంటింటికీ వెళ్తూ వారి సమస్యలను స్వయంగా తెలుసుకుంటూ పరిష్కరించాల్సిందిగా అధికారులకు సూచిస్తున్నారు. ఇప్పటివరకు దాదాపుగా గ్రామ, మండల స్థాయి అన్ని సమస్యలు పరిష్కారానికి నోచుకున్నాయి.
– కొడంగల్ మున్సిపల్ పరిధిలో ప్రజా సమస్యలను తెలుసుకొంటున్న ఎమ్మెల్యే నరేందర్రెడ్డి(ఫైల్)