ధారూరు, మార్చి 4 : ప్రజల మేలు కోరి పనిచేస్తున్న ఏకైక పార్టీ బీఆర్ఎస్ అని విద్యాశాఖ మంత్రి సబితాఇంద్రారెడ్డి అన్నారు. శనివారం ధారూరులో బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు, వికారాబాద్ ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్ ఆధ్వర్యంలో బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలతో ఆత్మీయ సమ్మేళన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మంత్రి ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడుతూ.. సీఎం కేసీఆర్ సూచనలతో ప్రతి మండలంలో బీఆర్ఎస్ ఆత్మీయ సమ్మేళనం నిర్వహిస్తున్నామన్నారు. బీఆర్ఎస్ పార్టీ అధికారం చేపట్టిన నాటి నుంచి సబ్బండ వర్గాల సంక్షేమానికి ఎన్నో పథకాలు అమలు చేస్తున్నదని పేర్కొన్నారు. ఎన్నడూ లేని విధంగా పేదలు, రైతుల సంక్షేమం కోసం సరికొత్త పథకాలను అమలు చేస్తుండటంతో దేశం మొత్తం తెలంగాణ వైపు చూస్తున్నదన్నారు. సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలే కాకుండా ప్రతి పేదోడు ఆర్థికంగా ఎదుగాలనే విధంగా సీఎం కేసీఆర్ పథకాలను అమలు చేస్తున్నారని మంత్రి స్పష్టం చేశారు.
దుష్ప్రచారాన్ని తిప్పికొట్టాలి
ప్రతి కార్యకర్త విపక్షాలు చేస్తున్న దుష్ప్రచారాన్ని తిప్పికొట్టి, దేశంలో ఇతర రాష్ర్టాలు, ఇతర ప్రభుత్వాల కంటే, తెలంగాణ రాష్ట్రంలో మెరుగైన సంక్షేమ పథకాల అమలు, పరిపాలనా సౌలభ్యం అందిస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ అని, తెలంగాణ అభివృద్ధిని ప్రజలకు వివరించాలన్నారు. గ్రామస్థాయి, వార్డు స్థాయిల్లో బాధ్యతలు తీసుకున్న కార్యకర్తలు బాధ్యతాయుతంగా పనిచేయాలన్నారు. గ్రామాల్లో కో ఆర్డినేషన్ కమిటీలు ఏర్పాటు చేయాలని సూచించారు. రాష్ట్రంలో మరోమారు అధికారం బీఆర్ఎస్ పార్టీదేనని, సీఎం కేసీఆర్ నాయకత్వంలో దేశ రాజకీయాల్లో కీలకం కాబోతున్నామని.. ప్రతిఒక్కరూ సైనికుడిలా ముందుకెళ్లాలని మంత్రి దిశానిర్దేశం చేశారు.
అంతకు ముందు కుక్కింద సర్పంచ్, ధారూరు సర్పంచుల సంఘం మండలాధ్యక్షుడు వీరేశం ఇటీవల మరణించడంతో ఆయనకు నివాళులర్పిస్తూ మౌనం పాటించారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ మండలాధ్యక్షుడు రాజునాయక్, ప్రధాన కార్యదర్శులు అంజయ్య, రాజుగుప్తా, జడ్పీటీసీ సుజాత, రైతు బంధు సమితి మండలాధ్యక్షుడు వెంకటయ్య, మండల వ్యవసాయ కమిటీ చైర్మన్ సంతోష్కుమార్, బీఆర్ఎస్ మండల మాజీ అధ్యక్షుడు వేణుగోపాల్రెడ్డి, మండల యువజన విభాగం అధ్యక్షుడు జైపాల్రెడ్డి, సర్పంచులు, ఎంపీటీసీలు పాల్గొన్నారు.
బాధితులకు అండగా సీఎం సహాయ నిధి
చేవెళ్ల రూరల్ : బాధితులకు అండగా సీఎం సహాయనిధి ఎల్లవేళలా దోహదపడుతున్నదని మంత్రి అన్నారు. ఆలూరుకు చెందిన జగదీశ్వర్చౌహాన్ కట్టెల మిషన్ వద్ద కులవృత్తి పనిచేస్తుండగా ప్రమాదవశాత్తు చేయి కట్అయింది. దీంతో రూ.లక్షా25వేల ఎల్వోసీని మంత్రి సబితారెడ్డి శనివారం బాధిత కుటుంబసభ్యులకు అందజేశారు.