కొత్తూరు, ఫిబ్రవరి 4 : వ్యవసాయం దండుగ అనే స్థాయి నుంచి పండుగ అనే స్థాయికి తెచ్చింది బీఆర్ఎస్ ప్రభుత్వం. రైతులకు కావాల్సిన అన్ని వసతులు కల్పిస్తుండడంతో సాగు పనులు సాఫీగా సాగుతున్నాయి. 24 గంటల ఉచిత కరెంట్, రైతు బంధు పథకంతో పెట్టుబడి సాయం సమయానికి అందిస్తూ తెలంగాణ ప్రభుత్వం అన్నదాతలకు కొండంత అండగా నిలుస్తున్నది. ఏటేటా రంగారెడ్డి జిల్లాలో సాగు విస్తీర్ణం పెరుగుతూ వస్తున్నది. అందుకు తగ్గట్టుగానే రాష్ట్ర సర్కార్ నాణ్యమైన విత్తనాలు, ఎరువులను సబ్సిడీతో అందజేస్తున్నది. ప్రస్తుతం దేశంలోనే తెలంగాణ వ్యవసాయ రంగంలో అగ్రగామిగా నిలువడం గమనార్హం.
కొత్తూరు మండలంలో 810 ఎకరాల్లో వరి సాగు
కొత్తూరు మండలంలో మొత్తం 810 ఎరకాల వరకు వరి సాగయ్యే అవకాశం ఉన్నది. ఇప్పటి వరకు 400 ఎకరాల సాగు వివరాలను అధికారులు ఆన్లైన్లో నమోదు చేశారు. ఈ నెల 15వ తేదీ వరకు మరో 410 ఎకరాల్లో వరి నాట్లు పడనున్నాయి. ఉదయం లేచింది మొదలు అన్నదాతలు, వ్యవసాయ కూలీలు పనుల్లో నిమగ్నమవుతున్నారు. మండలంలో ఇప్పటికే వివిధ రకాల పంటలు సాగు కాగా, అధికంగా వరి సాగు అవుతున్నది.
నారు దశలోనే సస్యరక్షణ చర్యలు తీసుకోవాలి
వరి దశలోనే తెగుళ్లు సోకకుండా సస్యరక్షణ చర్యలు తీసుకోవాలి. నారు కొనలు కట్ చేసి నాట్లు వేసుకుంటే పంట రోగాలబారిన పడే అవకాశం తక్కువగా ఉంటుంది. రెక్కల పురుగులు నారు పైభాగంలో గుడ్లు పెడుతాయి. అలా తుంచడం వల్ల కాండం తొలుచు పురుగుల బారినుంచి పంటను కాపాడుకోవచ్చు. అంతేకాకుండా ధాన్యం తాలు వచ్చే అవకాశం ఉండదు.
– గోపాల్, ఏవో, కొత్తూరు