ఎన్నికలప్పుడు వచ్చి కల్లబొల్లి మాటలు చెప్పే కాంగ్రెస్ పార్టీని కొడంగల్ నియోజకవర్గ ప్రజలు నమ్మొద్దని, మళ్లీ అధికారంలోకి వచ్చేది బీఆర్ఎస్ ప్రభుత్వమేనని రాష్ట్ర సమాచార, పౌర సంబంధాలు, గనుల శాఖల మంత్రి పట్నం మహేందర్ రెడ్డి అన్నారు. శుక్రవారం కోస్గి పట్టణంలోని ఓ ఫంక్షన్ హాల్లో జరిగిన పార్టీ కార్యకర్తల సమావేశంలో మంత్రి పాల్గొని మాట్లాడారు. ప్రతిపక్షాలు ఎన్ని ఎత్తుగడలు, పన్నాగాలు చేసినప్పటికీ నమ్మి మోసపోవద్దని ప్రజలకు సూచించారు. ఆరు గ్యారెంటీలను మొదట పొరుగున ఉన్న కర్ణాటకలో ఎందుకు అమలు చేయడంలేదని కాంగ్రెస్ను ప్రశ్నించారు. కొడంగల్లో రెండోసారి ఎమ్మెల్యే నరేందర్రెడ్డి విజయం ఖాయమన్నారు. అనునిత్యం ప్రజల్లో ఉండే పట్నం నరేందర్రెడ్డి వంటి ఎమ్మెల్యే కావాలా.. ఎన్నికల సమయంలో మాయమాటలు చెప్పే కాంగ్రెస్ నాయకులు కావాలో ప్రజలు ఆలోచించుకోవాలన్నారు. ప్రతి కార్యకర్త సైనికుడిలా పని చేయాలని, గడపగడపకూ వెళ్లి ప్రభుత్వ పథకాలను వివరించాలని పిలుపునిచ్చారు.
– కొడంగల్, అక్టోబర్ 20
కొడంగల్, అక్టోబర్ 20 : తెలంగాణ రాష్ట్రంలో హ్యాట్రిక్ సీఎంగా కేసీఆర్ రికార్డు సృష్టిస్తారని రాష్ర్త సమాచార, పౌర సంబంధాలు, గనుల శాఖల మంత్రి పట్నం మహేందర్ రెడ్డి అన్నారు. తెలంగాణ ఏర్పాటు తర్వాత ముఖ్యమంత్రి కేసీఆర్ పాలనలో తెలంగాణ ప్రజల బతుకుచిత్రం మారిందన్నారు. ఉద్యమ నేత కేసీఆర్ పగ్గాలు చే పట్టింది మొదలు ప్రగతి రథచక్రాలు పరుగులు పెడుతున్నాయని పేర్కొన్నారు. సంక్షేమ ఫలాలు ప్రజలకు చేరువయ్యాయని, సాగునీటికి ప్రాధా న్యం ఇవ్వడంతో దుర్భర పరిస్థితులు దూరమయ్యాయని తెలిపారు. సంక్షేమ పథకాల అమలు తో పేదల కష్టాలు తొలగిపోయాయని, సమైక్య పాలన నుంచి విముక్తి లభించాక స్వరాష్ట్ర ఆకాంక్షలను తెలంగాణ సమాజం ఆస్వాదిస్తున్నదనడంలో ఏ మాత్రం సందేహం లేదన్నారు.
ప్రతిపక్షాలు ఎన్ని ఎత్తుగడలు వేసి, పన్నాగాలు పన్నినా ప్రజలు బీఆర్ఎస్ పార్టీ వైపు ఉన్నారని.. మళ్లీ వచ్చేది బీఆర్ఎస్ ప్రభుత్వమేనని మంత్రి పట్నం మహేందర్ రెడ్డి అన్నారు. శుక్రవారం కోస్గి పట్టణంలో నిర్వహించిన పార్టీ కార్యకర్తల సమావేశంలో పాల్గొని మట్లాడారు. కాంగ్రెస్ పార్టీలో ఎవరికి వారు యమునాతీరే అన్నట్లుగా ఉన్నారని, వారిలో వారికే సమన్వయం లేదన్నారు. అలాంటప్పుడు ప్రజా సంక్షేమానికి ఎలా పాటుపడతారని ఆరోపించారు. కాంగ్రెస్ పార్టీలో నాయకులకు కేవలం పదవులపైనే వ్యామోహం ఉందని, ఎవరికి వారు సీఎంలుగా చెప్పుకుంటున్నారన్నారు. పది మంది అభ్యర్థులు సీఎం అవుతామని చెప్పుకొంటున్న కాంగ్రెస్ పార్టీని తెలంగాణ ప్రజలు నమ్మే పరిస్థితిలో లేరన్నారు. ఆరు గ్యారంటీల పథకాలను ముందుగా పొరుగు న ఉన్న కర్ణాటకలో అధికారంలో ఉన్న రాష్ట్రంలో ఎందుకు అమలు చేయడం లేదని ప్రశించారు.
గత 60 ఏండ్లుగా కాంగ్రెస్ ఇతరత్రా పార్టీలు చేయలేని అభివృద్ధిని 9 ఏండ్లల్లో సీఎం కేసీఆర్ చేసి చూపించారని మంత్రి మహేందర్ రెడ్డి తెలిపారు. కొడంగల్ నియోజకవర్గంలో ఐదేండ్లలో ఎమ్మెల్యే పట్నం నరేందర్రెడ్డి ఆధ్వర్యంలో ఎం తో అభివృద్ధిని సాధించిందన్నారు. అనునిత్యం ప్రజల్లో ఉండే పట్నం నరేందర్ రెడ్డి లాంటి ఎమ్మెల్యే కావాలా ఎన్నికల సమయంలో మాయమాటలు చెప్పి హైదరాబాదుకు పరిమితమయ్యే కాంగ్రెస్ నాయకులు కావాలో ప్రజలు ఆలోచించుకోవాలన్నారు. ప్రజలు అభివృద్ధి వైపు చూస్తున్నారన్నారు. కొడంగల్ ప్రాంతాన్ని, రాష్ర్టాన్ని అన్ని రంగాల్లో అభివృద్ది పరిచిన బీఆర్ఎస్ పార్టీ కి మాత్రమే ఓటు అడిగే హక్కు ఉందన్నారు. అభివృద్ది, సంక్షేమం పార్టీ గెలుపునకు శ్రీరామరక్షగా నిలుస్తున్నదని, కొడంగల్లో రెండోసారి ఎమ్మెల్యేగా పట్నం నరేందర్ రెడ్డి ఘనవిజయం సాధించి గులాబీ జెండాను ఎగురవేస్తారని తెలిపారు.
కార్యకర్తలు సైనికుల్లా పని చేయాలని.. ఇంటింటికీ బీఆర్ఎస్ పథకాలను అమలు చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలపై ప్రచారం చేయాలని కోరారు. పార్టీకోసం కార్యకర్తలు కష్టపడి పనిచేసి పట్నం నరేందర్ రెడ్డిని భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు. అంతకు ముందు ఈజీఏస్ డైరక్టర్ ప్రతాప్ రెడ్డి ఇంటి దగ్గర మంత్రి ని శాలువాలతో సన్మానించారు. కార్యక్రమంలో స్టేట్ ఈజీఏస్ డైరక్టర్ ప్రతాప్ రెడ్డి, జడ్పీటీసీ ప్రకాష్రెడ్డి, ఎంపీపీ మధుకర్ రావు, వైస్ ఎంపీపీ సాయిలు, మున్సిపల్ చైర్పర్సన్ మ్యాకల శిరీష, రైతు సమన్వయ సమితి మండల అధ్యక్షుడు హన్మంతు రెడ్డి, రైతు సమన్వయ సమితి పట్టణ అధ్యక్షుడు జగదీశ్వర్ రెడ్డి, కోస్గి మున్సిపాలిటీ అధ్యక్షుడు మ్యాకల రాజేశ్ , కౌన్సిలర్లు మాస్టర్ శ్రీనివాస్, బందెప్ప, జనార్దన్ రెడ్డి, బీఆర్ఎస్ నాయకులు వెంకట్నర్సింహులు, రాజేందర్ రెడ్డి, రస్నం బాల్రాజ్, ఉస్సేనప్ప, అమృతమ్మ, రాములు, విజయ్కుమార్, ఆనంతయ్య తదితరలు పాల్గొన్నారు.