పరిగి, జనవరి 7 : వ్యవసాయాన్ని పండుగ చేయాలనే సత్సంకల్పంతో బీఆర్ఎస్ ప్రభుత్వం అమల్లోకి తీసుకొచ్చిన రైతుబంధు పథకం కింద పెట్టుబడి సాయం అందజేయడంలో ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం అరకొరగానే రైతుల ఖాతాల్లో డబ్బులు జమ చేసింది. గతంలో ప్రతిరోజూ సాయమందగానే వేలాది మంది రైతుల ఫోన్లు టింగు టింగు మంటూ మోగేవి. తాము అధికారంలోకి వచ్చిన వెంటనే ఏడాదికి ఎకరానికి రూ.15వేలు జమ చేస్తామని ఎన్నికల ముందు ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి ప్రకటించారు. రాష్ట్రంలో కొత్త ప్రభుత్వం అధికారంలోకి వచ్చి నెల రోజులైనా సాయం పెంచుడు మాట దేవుడెరుగు గత ప్రభుత్వం ఇచ్చిన విధంగానే ఈ సీజన్కు పెట్టుబడి సాయం అందిస్తామని ప్రభుత్వం ప్రకటించింది.
అదైనా అదునుకు అందుతుందా అంటే ఇప్పటికీ అరకొరగానే జమవుతున్నాయి. పెట్టుబడి సాయం రైతుల ఖాతాల్లో జమ చేస్తున్నట్లు ప్రకటించినా ఇప్పటి వరకు సుమారు ఎకరం భూమి ఉన్న వారికే పెట్టుబడి సాయం జమైనట్లు సమాచారం. వికారాబాద్ జిల్లాలోని 19 మండలాల పరిధిలో ఈ సీజన్కు 2,95,796 మంది రైతులకు పెట్టుబడి సాయంగా రూ.3227670038 మంజూరు చేయబడ్డాయి. ఇందులో 227884 మంది రైతులకు సంబంధించి రూ.1817203296 ల బిల్స్ ట్రెజరీలకు పంపినట్లు పేర్కొంటుండగా, ఇప్పటి వరకు జిల్లాలోని 85,221 మంది రైతుల ఖాతాల్లో రూ.268277979 జమ చేయబడ్డాయి. తద్వారా వికారాబాద్ జిల్లావ్యాప్తంగా తక్కువ మంది రైతులకే పెట్టుబడి సాయం అందడంతో తమకు సాయం ఎపుడు అందుతుందోనని రైతాంగం ఎదురుచూస్తున్నది.
గత ప్రభుత్వ హయాంలో వెనువెంటనే రైతుబంధు సాయం అందేది. ప్రభుత్వం రైతుబంధు కింద పెట్టుబడి సాయం విడుదల చేస్తున్నట్లు ప్రకటించిన రోజు నుంచి ప్రతిరోజూ వేలాది మంది రైతుల ఖాతాల్లో పెట్టుబడి సాయం డబ్బులు జమ చేయబడేవి. కనీసం 5 నుంచి 6 ఎకరాల్లోపు రైతులకు వారం రోజుల్లోనే రైతుబంధు సాయం అందేదని, ఇప్పుడు ఆ పరిస్థితి లేదని రైతులు వాపోతున్నారు.
పెట్టుబడి కోసం వడ్డీ వ్యాపారుల వద్ద చేయి చాచకుండా రైతులు స్వతహాగా సొంత డబ్బులు వెచ్చించి విత్తనాలు, ఎరువులు కొనుగోలు చేయడానికి రైతుబంధు డబ్బులు ఉపయోగపడ్డాయి. అలాంటిది గత నెల 9వ తేదీన రైతుబంధు డబ్బులు వేస్తామన్న కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పటి వరకు వేయకపోవడంపై విమర్శలు వినిపిస్తున్నాయి. రైతులు పెట్టుబడి కోసం ఎదురు చూడకుండా వెనువెంటనే డబ్బులు అందజేయాలని పలువురు కోరుతున్నారు. పూర్తిస్థాయిలో రైతులకు రైతుబంధు అందడానికి ఇంకా ఎన్ని రోజులు వేచి చూడాలోనని అన్నదాతలు ఆందోళన చెందుతున్నారు.
అయినాపూర్ గ్రామంలో నాకు మూడు ఎకరాల భూమి ఉన్నది. వరి పంట సాగు చేస్తూ జీవనం సాగిస్తున్నా. ఈ యాసంగికి పెట్టుబడి సాయమందక అప్పులు తెచ్చే పరిస్థితి వచ్చింది. గెలువగానే రైతుబంధు వేస్తామన్న కాంగ్రెస్ పార్టీ.. అధికారంలోకి వచ్చి నెల రోజులైనా పెట్టుబడి సాయం అందకపోవడంతో ఆందోళనగా ఉన్నది. రైతుల విషయంలో నిర్లక్ష్యం చేయడం ప్రభుత్వానికి సరికాదు. బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు సమయానికి డబ్బులు పడేవి. డబ్బులు జమ చేయకుంటే వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్కు బుద్ధి చెప్పాలి.
– నల్ల మైబు, అయినాపూర్ గ్రామం, దోమ మండలం