ఆదిబట్ల, మార్చి 25 : ఎంపీ ఎన్నికల్లో భువనగిరి గడ్డపై బీఆర్ఎస్ జెండా ఎగురవేస్తామని, క్యామ మల్లేశ్ గెలుపునకు కృషి చేస్తామని బీఆర్ఎస్ కొంగరకలాన్ నాయకులు అన్నారు. సోమవారం బీఆర్ఎస్ భువనగిరి పార్లమెంట్ ఎంపీ అభ్యర్థి క్యామ మల్లేశ్ను వారు కలిసి కృతజ్ఞతలు తెలిపారు. నాయకులు బాబులు, నారాయణ, రవీందర్, మ హేందర్, కృపాకర్, ప్రవీణ్ మాట్లాడుతూ.. కేసీఆర్ బీసీ బడుగు బలహీన వర్గాలకు భువనగిరి పార్లమెంట్ స్థానం కేటాయించారని పేర్కొన్నారు. ఇప్పటికైనా కలిసికట్టుగా పని చేసి మల్లేశ్ గెలుపు కోసం కృషి చేస్తామని తెలిపారు. నాటి నుంచి నేటి వరకు పార్టీని నమ్ముకున్న వ్యక్తి క్యామ అని అన్నారు. బీఆర్ఎస్ గెలుపును ఎవ్వరూ ఆపలేరని స్పష్టం చేశారు.
భువనగిరి పార్లమెంట్ పరిధిలోని బీఆర్ఎస్ ముఖ్య నేతలతో త్వరలోనే సమావేశం ఏర్పాటు చేయనున్నట్లు క్యామ మల్లేశ్ తెలిపారు. ముందుగా పార్టీ ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేలు, మాజీ మంత్రులు, పార్టీ ముఖ్య నాయకులతో సమావేశం ఏర్పాటు చేస్తామన్నారు. ఆ తర్వాత అసెంబ్లీ నియోజకవర్గాలవారీగా ముఖ్య నాయకులు, కార్యకర్తల సమావేశాలు కూడా ఏర్పాటు చేస్తామన్నారు. త్వరలోనే అన్ని నియోజకవర్గాల్లో పర్యటించి సమావేశాలు నిర్వహించి కార్యకర్తలను కార్యోన్ముఖులను చేస్తామని ఆయన పేర్కొన్నారు.