ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలోని పలు గ్రామాల్లో బుధవారం బోనాల ఉత్సవాలు అంగరంగ వైభవంగా జరిగాయి. మహిళలు బోనాలతో ఊరేగింపు నిర్వహించగా శివసత్తుల పూనకాలు, పోతరాజుల విన్యాసాలు చూపరులను మంత్రముగ్ధులను చేశాయి. ఆలయాల వద్దకు చేరుకుని నైవేద్యాన్ని సమర్పించి ప్రత్యేక పూజలు చేశారు. ఆయా చోట్ల జరిగిన ఉత్సవాల్లో పలువురు ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.
– న్యూస్ నెట్వర్క్, నమస్తే తెలంగాణ
నందిగామ, జూలై 12 : నందిగామ మండలం అంతిరెడ్డిగూడ, పిట్టలగూడ, నర్సప్పగూడ గ్రామాల్లో బుధవారం మైసమ్మ, పోచమ్మ బోనాల పండుగను గ్రామస్తులు ఘనంగా నిర్వహించారు. డప్పుల దరువు, పోతరాజుల విన్యాసాలు, శివసత్తుల శిగాలతో మహిళలు భక్తి శ్రద్ధలతో బోనాలను ఎత్తుకుని అమ్మవార్లకు సమర్పించి మొక్కలు చెల్లించుకున్నారు.
మొయినాబాద్ : మండల పరిధిలోని సురంగల్, పెద్దమంగళారం, నక్కలపల్లి, శ్రీరాంనగర్, అమ్డాపూర్, బాకారం, అప్పారెడ్డిగూడ, గ్రామాల్లో బోనాల ఉత్సవాలను బుధవారం నిర్వహించారు. బోనాల ఉత్సవాలను అంగరంగవైభవంగా నిర్వహించారు. మొయినాబాద్, పెద్దమంగళారం గ్రామాల్లో ఎంపీ రంజిత్రెడ్డి, ఎమ్మెల్యే యాదయ్య పాల్గొని అమ్మవారికి మొక్కులు చెల్లించుకున్నారు.