రంగారెడ్డి, ఆగస్టు 22 (నమస్తే తెలంగాణ) : సిట్టింగ్లకే సీట్లివ్వడంతో రంగారెడ్డి జిల్లాలో బీఆర్ఎస్ శ్రేణుల జోరు కొనసాగుతున్నది. టికెట్ కేటాయించిన సందర్భంగా ఎమ్మెల్యేలు ఆయా నియోజకవర్గాలకు వెళ్తుండడంతో బీఆర్ఎస్ శ్రేణులు, ప్రజలు ఘన స్వాగతం పలుకుతున్నారు. ఎమ్మెల్యేలు ప్రజలతో మమేకమవుతూ బిజీబిజీగా గడుపుతుండగా, రోజుకో చోట వివిధ పార్టీలకు చెందినవారు బీఆర్ఎస్లోకి భారీగా చేరుతున్నారు. ముందుగానే బీఆర్ఎస్ అభ్యర్థుల జాబితా విడుదలతో బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు షాక్కు గురయ్యాయి. అధికార పక్షం అభ్యర్థులను ఎంపిక చేయడంలో ప్రతిపక్షాలు బేజారవుతున్నాయి. ఎవరికోసం పని చేయాలో తెల్వక విపక్షాల క్యాడరంతా అయోమయమవుతున్నది. టికెట్ దక్కనోళ్లను గుంజుకోవాలన్న విపక్షాల ఆశలు అడియాశలయ్యాయి. బీజేపీ ఊకదంపుడు ఉపన్యాసాలు, కాంగ్రెస్లో గ్రూపు రాజకీయాలతో ఆ పార్టీల క్యాడర్లో గందరగోళం నెలకొంటున్నది. దీనికితోడు సీఎం కేసీఆర్ కొత్త సంక్షేమ పథకాలు ప్రకటిస్తుండడంతో విపక్షాలు ఉక్కిరిబిక్కిరవుతున్నాయి. సీఎం కేసీఆర్ వ్యూహాత్మక ఎత్తుగడతో ప్రతిపక్షాలు విలవిల్లాడుతున్నాయి.
అభ్యర్థుల ప్రకటనతో జిల్లాలోని బీఆర్ఎస్ పార్టీ శ్రేణుల్లో జోష్ నెలకొన్నది. పార్టీ సిట్టింగ్ ఎమ్మెల్యేలకే మళ్లీ అవకాశం దక్కడంతో వారంతా ప్రజాక్షేత్రంలో మరింత బిజీ అయ్యారు. రోజుకో చోట పార్టీలో కి భారీగా చేరికలు జరుగుతున్నాయి. కాగా.. బీజేపీ, కాంగ్రెస్ పార్టీల్లో మాత్రం ఎన్నికల జోష్ మచ్చుకైనా కనబడడం లేదు. అభ్యర్థుల ప్రకటన విషయంలో ఆ రెండు పార్టీలు ఇంకా జాప్యం చేస్తుండడంతో ఇరు పార్టీల్లోని క్యాడర్లో తీవ్ర అసంతృప్తి వ్యక్తమవుతున్నది. మరోపక్క ప్రభుత్వ పథకాలకు సంబంధించి సీఎం కేసీఆర్ రోజుకో ప్రకటన చేస్తుండడం కూడా ప్రతిపక్షాలను ఉక్కిరిబిక్కిరి చేస్తున్నది. టికెట్ దక్కని అసంతృప్తులను చేర్చుకోవా లని విపక్ష పార్టీలు భావించాయి. అయితే అటువంటి పరిస్థితులు ఎక్కడా లేకపోవడంతో వారి దింపుడు కళ్లెం ఆశలు సైతం అడియాశలయ్యాయి.
ప్రతిపక్ష పార్టీల్లో కరువైన జోష్..
బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థుల ప్రకటన విడుదలై.. సిట్టింగ్లకే మరోసారి అవకాశం దక్కడంతో పోటీలో ఎవరూ ఉంటారో తేలిపోయింది. బీఆర్ఎస్ పార్టీ నేతలకు గాయం వేయాలనుకున్న కాంగ్రెస్, బీజేపీ పార్టీల నాయకులు ప్రయత్నాలు బెడిసికొట్టాయి. దీంతో ఆ రెండు పార్టీల పరిస్థితి అగమ్యగో చరం గా మారింది. ఇప్పటికే జిల్లాలో బీఆర్ఎస్ పార్టీలో చేరికల జోరు ముమ్మరంగా సాగుతున్నది. అభ్యర్థుల ప్రకటన కూడా వెలువడడంతో రానున్న రోజుల్లో వివిధ పార్టీల నుంచి చేరికలు మరింతగా పెరుగనున్నాయి. జిల్లాలో బీజేపికి చాలా చోట్ల క్యాడరే లేదు. ఎన్నికల్లో పోటీ చేసేందుకు సమర్థవంతులైన అభ్యర్థులు కూడా కరువయ్యారు. ఇక కాంగ్రెస్ పార్టీలో గ్రూపు రాజకీయా లు ఎన్నికల సమీపిస్తున్న కొద్దీ మరింతగా పెరుగుతున్నాయి. క్యాడర్ సైతం ఎవరికి వారే అన్నట్లుగా వ్యవహరిస్తున్నది. ఈ పరిస్థితుల్లో ఆ రెండు పార్టీలు నేటికీ అభ్యర్థులను ప్రకటించే సాహసాన్ని కూడా చేయలేకపోతున్నాయి. ఆయా పార్టీల తీరు క్యాడర్ను సైతం అయోమయానికి గురి చేస్తున్నది. అధికారంలోకి వస్తే ఏం చేస్తామో! చెప్పకుండా కేవలం తిట్ల దండకానికి దిగడం వల్ల మరింత చేటు తప్ప ఎటువంటి లా భం ఉండబోదన్న అభిప్రాయాన్ని విపక్ష పార్టీలకు చెందిన కొందరు నేతలే బాహాటంగా వ్యక్తం చేస్తున్నారు.
కేసీఆర్ వ్యూహాలకు ప్రతిపక్షాలు చిత్తు..
తొమ్మిదేండ్ల కాలంలో సీఎం కేసీఆర్ సబ్బండ వర్ణాల సంక్షేమానికి అనేక అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను ప్రవేశపెట్టి అమలు చేస్తున్నారు. జిల్లా ప్రగతిపథంలో ముందుకు దూసుకెళ్తున్నది. ఏదో రూపంలో ప్రతి గడపకూ సంక్షేమ ఫలాలు అందడంతో ప్రజలూ సంతోషంగా ఉంది. ఇదే క్రమంలో సీఎం కేసీఆర్ ఇటీవలి కాలంలో కొత్త పథకాలకు సంబంధించి పలు కీలక ప్రకటనలు చేశారు. సొంత జాగ ఉన్నవారికి గృహలక్ష్మి పథకం కింద రూ.3 లక్షలు అందించనున్నట్లు ప్రకటించి దరఖాస్తులు సైతం స్వీకరించారు. బీసీ, మైనార్టీలకు రూ.లక్ష సాయం ప్రకటించి ఇప్పటికే జిల్లాలో 584 మంది మై నార్టీలకు తొలి విడుతలో సాయాన్ని అందించారు. ఆర్టీసీ ఉద్యోగులను ప్ర భుత్వంలో విలీనం చేయడంతో జిల్లాలో రెండువేల మందికి పైగా ఉద్యోగు లకు సీఎం కేసీఆర్ ఆపద్భాంధవుడిలా నిలిచారు. ఈ ఏడాది వానకాలం సీజన్కు ముందే రైతుబంధు పథకం కింద పెట్టుబడి సాయాన్ని అందించిన ప్రభుత్వం రైతులకు ఇచ్చిన హామీ మేరకు జిల్లాలో రూ.275.76 కోట్ల రుణాలను మాఫీ చేసింది. దివ్యాంగుల పింఛన్ను రూ.4,016కు పెం చడం, రేషన్ డీలర్ల కమీషన్ను పెంచడం ఆయా వర్గాల్లో సంతోషాన్ని నిం పింది. గురుకులాల్లో డైట్ చార్జీలను 26 శాతం పెంచి విద్యార్థులకు మేలు చేకూర్చారు. పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి ఇటీవలె పర్యా వరణ అనుమతులు రాగా..త్వరలోనే సాకారం కానుండడంతో రైతాంగం నుంచి తెలంగాణ ప్రభుత్వానికి పూర్తి మద్దతు లభిస్తున్నది. జిల్లాలో శివారు ప్రాంతాలకు సైతం మెట్రోరైలు సౌకర్యాన్ని కల్పించేందుకు రూ.16,650 కోట్ల అంచనాతో 67 కి.మీ.మేర మెట్రో విస్తరణకు ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం బీఆర్ఎస్ పార్టీకి కలిసిరానున్నది. వ్యూహాత్మక ఎత్తుగడలతో సీఎం కేసీఆర్ చేస్తున్న ప్రకటనలతో ప్రతిపక్ష పార్టీలు విలవిల్లాడుతున్నాయి.