తెలంగాణ సర్కార్ పల్లెల్లోనూ మెరుగైన వైద్యసేవలను అందుబాటులోకి తెచ్చింది. అందుకోసం హైదరాబాద్లో మాదిరిగా.. జిల్లాల్లోనూ పల్లె, బస్తీ దవాఖానలను ఏర్పాటు చేసింది. వికారాబాద్ జిల్లాలో ఇప్పటివరకు 112 పల్లె, నాలుగు బస్తీ దవాఖానలను ఏర్పాటు చేసింది. నిత్యం ఉదయం 9 నుంచి సాయంత్రం 4 గంటల వరకు సేవలందిస్తుండగా.. ఎంతోమంది పేదలకు మేలు జరుగుతున్నది.
ఒక్కో పల్లె దవాఖానలో 45 నుంచి 50 మంది, మున్సిపాలిటీల్లోని బస్తీ దవాఖానల్లో వందకు పైగా మంది వైద్య సేవలను పొందుతున్నారు. ఈ లెక్కన జిల్లాలో రోజుకు వేల మంది పేదలకు మెరుగైన వైద్యం అందుతున్నది. ఆయా దవాఖానల్లో 158 రకాల మెడిసిన్లు అందుబాటులో ఉంచుతున్నారు. గ్రామీణులు మండల కేంద్రాల్లోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలకు వెళ్లాల్సిన అవసరం లేకుండా చెంతనే వైద్య సేవలను అందుతుండడంతో వారికి వ్యయప్రయాసలు తప్పాయి.
-వికారాబాద్, సెప్టెంబర్ 25 (నమస్తే తెలంగాణ)
ఆర్ఎంపీల దగ్గరికి వెళ్లే బాధ తప్పింది..
మా ఊరిలో బస్తీ దవాఖాన ఉంది. అందులో డాక్టరమ్మ అందుబాటులో ఉంటున్నారు. ఇదివరకు ఏ రోగం వచ్చినా ఆర్ఎంపీల వద్దకు వెళ్లి ఏదో మందులు, మాత్రలు తీసుకునేవాళ్లం. ఇప్పుడు ఆ బాధ తప్పింది. ప్రస్తుతం సర్కారు వైద్యులు అందుబాటులో ఉండటంతో నాణ్యమైన వైద్య సేవలు అందుతున్నాయి. డాక్టర్లు ఉచితంగా మందులు, మాత్రలు, సూదులు ఇచ్చి వ్యాధులను నయం చేస్తున్నారు.
– భీమమ్మ, మద్గుల్చిట్టంపల్లి, వికారాబాద్
వికారాబాద్, సెప్టెంబర్ 25 (నమస్తే తెలంగాణ) : గ్రామీణ ప్రాంత ప్రజలకు మెరుగైన, నాణ్యమైన వైద్య సేవలు చేరువయ్యాయి. పల్లె, బస్తీ దవాఖానల ఏర్పాటుతో గ్రామీణ ప్రజానీకానికి ఉచితంగా వైద్య సేవలందుతున్నాయి. గతేడాదిగా జిల్లావ్యాప్తంగా 112 పల్లె దవాఖానలు, వికారాబాద్, తాండూరు, పరిగి, కొడంగల్ బస్తీ దవాఖానలకు వైద్యం నిమిత్తం పేద ప్రజలు క్యూ కడుతున్నారు. గతేడాదిగా అందుబాటులోకి వచ్చిన పల్లె దవాఖానలు, బస్తీ దవాఖానలతో జిల్లావ్యాప్తంగా లక్షకుపైగా పేద ప్రజలకు వైద్య సదుపాయాలు అందించారు.
గతంలో ప్రైవేట్ ఆసుపత్రులు, ఆర్ఎంపీలను నమ్ముకున్న గ్రామీణ, మున్సిపాలిటీల్లో ప్రభుత్వం వైద్యరంగాన్ని బలోపేతం చేయడంతో పల్లె, బస్తీ దవాఖానల వైపు దృష్టి సారిస్తున్నారు. ‘నేను రాను సర్కార్ దవాఖానకు’ అనే పరిస్థితి నుంచి సర్కార్ దవాఖానలోనే చూపించుకోవాలనే స్థాయికి ప్రభుత్వాసుపత్రులను బలోపేతం చేయడం, వైద్య సదుపాయాలు, మౌలిక వసతులను సర్కారు మెరుగుపర్చింది. గత ఏడాది కాలంగా ఒక్కో పల్లె దవాఖానలో రోజుకు 45-50 మందికి, బస్తీ దవాఖానల్లో 100 మందికి వైద్య సదుపాయాలు అందిస్తున్నారు.
అత్యధికంగా జిల్లాలోని తాండూరు బస్తీ దవాఖానలో 150-200 మందికి వైద్య సేవలు అందిస్తుండడం గమనార్హం. ఈ దవాఖానల్లో ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 4 గంటలకు వైద్య సేవలందిస్తున్నారు. శనివారం సెలవుదినం కాగా, ఆదివారం వైద్యులు, సిబ్బంది అందుబాటులో ఉంటున్నారు. మరోవైపు గ్రామీణ ప్రాంతంలో మెరుగైన వైద్యాన్ని అందించడమే లక్ష్యంగా ఏర్పాటు చేసిన పల్లె, బస్తీ దవాఖానల్లో 158 రకాల మెడిసిన్లను ప్రభుత్వం అందుబాటులో ఉంచడం గమనార్హం.
పల్లె, బస్తీ దవాఖానలతో నాణ్యమైన వైద్యం
పల్లె, బస్తీ దవాఖానలు అందుబాటులోకి రావడంతో పేద ప్రజలందరికీ నాణ్యమైన వైద్యం అందుతున్నది. గతంలో ఉపకేంద్రాల్లో కేవలం టీకాలు, తల్లి, బిడ్డలకు సంబంధించిన కార్యక్రమాలు నిర్వహిస్తుండేవారు. ఏఎన్ఎంల ఆధ్వర్యంలో కొనసాగిన ఉపకేంద్రాలు ప్రస్తుతం ఎంబీబీఎస్ వైద్యుల ఆధ్వర్యంలో పల్లె దవాఖానలుగా మారాయి. ప్రాథమిక ఆరోగ్య కేంద్రం మాదిరిగా అన్ని రకాల ప్రాథమిక వైద్య సేవలు, మలేరియా, డెంగ్యూ, విషజ్వరాలు తదితర వ్యాధులతో బాధపడుతున్నవారికి కూడా వైద్య సేవలను అందిస్తున్నారు.
అవసరమైన వారిని జిల్లా ఆసుపత్రులకు పంపుతూ నిరంతరం పర్యవేక్షిస్తున్నారు. గ్రామీణ ప్రాంత ప్రజలకు సంబంధించి గుండె జబ్బులు, క్యాన్సర్, బీపీ, షుగర్, కిడ్నీ సంబంధిత వ్యాధులను ముందే గుర్తించి తగు జాగ్రత్తలు తీసుకునేలా సూచనలతోపాటు అవసరమైన మందులను కూడా అందిస్తున్నారు. గ్రామీణ ప్రాంత ప్రజలు మండల కేంద్రాల్లోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలకు వెళ్లాల్సిన అవసరం లేకుండా గ్రామీణ ప్రజల ముంగిటకే ఆరోగ్య సేవలను అందించేందుకు పల్లె దవాఖానలను ప్రభుత్వం తీసుకువచ్చింది. పల్లె దవాఖానల ద్వారా గ్రామీణ ప్రజల ఆరోగ్య జీవన ప్రమాణాలు కూడా మెరుగుపడుతున్నట్లు జిల్లా వైద్యారోగ్య శాఖ అధికారులు చెబుతున్నారు.
అందుబాటులో ఓపీ సేవలు
జిల్లాలోని 112 పల్లె, 4 బస్తీ దవాఖానల్లో గతేడాది నుంచి గ్రామీణ ప్రాంత ప్రజలకు నాణ్యమైన వైద్య సేవలను అందిస్తున్నారు. ఈ దవాఖానల్లోనూ ఓపీ సేవలనందిస్తున్నారు. సీజనల్ వ్యాధులతోపాటు దీర్ఘకాలిక వ్యాధులను కూడా ముందే గుర్తించేందుకు పల్లె దవాఖానలు ఉపయోగపడుతున్నాయి. ప్రతి పల్లె దవాఖానకు అర్హులైన ఎంబీబీఎస్ వైద్యులతో వైద్య సదుపాయాలు అందిస్తున్నారు. ప్రధానంగా పల్లె దవాఖానలతో గ్రామీణ ప్రాంత ప్రజలకు మెరుగైన, నాణ్యమైన వైద్యం అందుబాటులోకి వచ్చింది.
– జిల్లా వైద్యారోగ్య శాఖ అధికారి డా.పల్వన్కుమార్
మెరుగైన సేవలు అందుతున్నాయి
ఏ చిన్న రోగం, జ్వరం వచ్చినా వికారాబాద్కు వెళ్లి చికిత్స చేయించుకోవాల్సి వచ్చేది. ఇటీవల తెలంగాణ ప్రభుత్వం మద్గుల్చిట్టంపల్లిలో బస్తీ దవాఖానను ఏర్పాటు చేసింది. దీంతో రోగులకు అవసరమైన బీపీ, షుగర్, రక్త పరీక్షలు తదితర వంటి వాటిని ఉచితంగా చేస్తున్నారు. ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు అందుబాటులో ఉంటుంది. బస్తీ దవాఖానకు ఒక డాక్టర్, వైద్య సిబ్బంది ఉన్నారు. అవసరమైన మందులు పంపిణీ చేస్తున్నారు. సర్కారు వైద్యం మారుమూల గ్రామాల ప్రజల వద్దకే రావడం సంతోషంగా ఉంది.
– అనిల్కుమార్, మద్గుల్చిట్టంపల్లి, వికారాబాద్