మేడ్చల్, ఆగస్టు 11: నార్త్ హైదరాబాద్లో శరవేగంగా అభివృద్ధి చెందుతోన్న మేడ్చల్లో భూమలకు ఎంత డిమాండ్ ఉందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అలాంటిది దాదాపు రూ.100 కోట్ల విలువచేసే ప్రభుత్వ భూమిలో నుంచి ఓ ప్రైవేట్ వెంచర్ యజమాని ఏకంగా రోడ్డు మార్గం వేయించుకోవడం.. అధికారులు నిమ్మకు నీరెత్తకుండా చూస్తూ ఉండటం తీవ్ర విమర్శలకు తావిస్తోంది. మేడ్చల్-కిష్టాపూర్ ప్రధాన రహదారి పక్కనే 145 సర్వే నంబర్లో 2.29 గుంటల ప్రభుత్వ భూమి ఉంది. ఇక్కడ బహిరంగ మార్కెట్లో గజం కనీసం రూ.80 వేల నుంచి రూ.లక్ష వరకు పలుకుతోంది. అంటే సంబంధిత ప్రభుత్వ భూమి విలువ దాదాపు రూ.100 కోట్ల పై మాటే. ఇంతటి విలువైన భూమికి సంబంధించి ప్రభుత్వ అధికారులు ఎలాంటి రక్షణ చర్యలు చేపట్టలేదు. దీన్ని ఆసరాగా చేసుకున్న ఓ రియల్టర్లు.. గతంలో సంబంధిత ప్రభుత్వ స్థలం నుంచి తమ వెంచర్లోకి వెళ్లేందుకు సీసీ రోడ్డును ఏర్పాటు చేసుకున్నాడు. ఈవిషయమై కలెక్టర్కు ఫిర్యాదు వెళ్లడంతో సీసీ రోడ్డును తవ్వేశారు. అయితే అదే సమయంలో పకడ్బందీగా కంచె వేయకపోవడంతో సదరు వెంచర్ యజమాని మళ్లీ కూల్చిన రోడ్డు నే చదునుచేసి వినియోగించుకుంటున్నాడు.
సర్వే నంబర్ 145లోని 2.29 గుంటల ప్రభుత్వ భూమి పక్కన ఉన్న సర్వే నంబర్లు 139, 143, 144లలోని 2.39 ఎకరాల భూమి లో రియల్టర్లు 2006లో 42 ప్లాట్లతో లేఔట్ చేశారు. ఈ లేఔట్లో 25 ఫీట్ల అంతర్గత రోడ్లు ఉన్నాయి కానీ ప్రధాన రహదారి నుంచి వెంచర్లోకి వెళ్లేందుకు అప్రోచ్ రోడ్డు లేదు. వెంచర్కు, ప్రధాన రహదారికి మధ్యన 145 సర్వే నంబర్లో ప్రభుత్వ భూమి ఉంది. ఇదిలా ఉంటే 2023లో ఈ పంచాయతీ వెంచర్కు ఆవల ఉన్న 138, 140, 141 సర్వే నంబర్లలో 33 ప్లాట్లతో హెచ్ఎండీఏ వెంచర్ను ఏర్పాటు చేశారు. వెంచర్కు ఎక్కడి నుంచి రోడ్డు ఉందో చూడకుండా ఆ వెంచర్కు ఉన్న అంతర్గత రోడ్డును లింకు చేసుకుంటూ పంచాయతీ అధికారులు అనుమతులిచ్చారు. ఈ రెండు వెంచర్లలో ప్లాట్లు అమ్ముడుపోయాయి. భవన నిర్మాణాలు కూడా జరిగాయి. అయితే ప్రభుత్వం ఒకవేళ ప్రధాన రహదారి పక్కన రోడ్డు స్వాధీనం చేసుకొని, కంచె ఏర్పాటు చేస్తే.. కొనుగోలుదారుల పరిస్థితి ప్రశ్నార్థకంగా మారే అవకాశం ఉంది. అయితే 145 సర్వే నంబరులోని ప్రభుత్వ భూమి మేడ్చల్-కిష్టాపూర్ ప్రధాన రహదారికి రెండు వైపులా ఉన్నట్టు తెలుస్తోంది.
145 సర్వే నంబర్లోని 14 గుంటల భూమి ని గతంలో అగ్నిమాపక కేంద్రానికి, 500 గజాల స్థలాన్ని విద్యుత్ శాఖకు కేటాయించారు. ఆ రెండు శాఖలు కేటాయించిన భూమిని స్వాధీనం చేసుకున్నాయి. గతంలో రెవెన్యూ అధికారులు ప్రభుత్వ భూమి అంటూ హెచ్చరిక బోర్డులను సైతం ఏర్పాటు చేసింది. అయితే ఆబోర్డులు ఇప్పుడు కనిపించడం లేదు. రియల్టర్లే మాయం చేసి ఉంటారన్న అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఈ భూమిని సామాజిక ప్రయోజనాలకు వినియోగించాలని అభిప్రాయం వ్యక్తం అవుతున్నది. మేడ్చల్లో అద్దె భవనంలో కొనసాగుతున్న ఈఎస్ఐ డిస్పెన్సరీని ఇటీవల గౌడవెల్లికి తరలించారు. ఇది కార్మికులకు తీవ్ర ఇబ్బందిగా మారింది. ఈఎస్ఐకి కిష్టాపూర్లో అనువుగా లేనిచోట స్థలాన్ని కేటాయించడంతో అక్కడ భవనాన్ని నిర్మించడానికి ఆ శాఖ అధికారులు సుముఖత వ్యక్తం చేయనట్టు తెల్సింది.ఈఎస్ఐకి ఇక్కడ స్థలాన్ని కేటాయిస్తే అందరికి అనువుగా ఉంటుందని పలువురు అభిప్రాయపడుతున్నారు.
145 సర్వే నంబర్లోని ప్రభుత్వ భూమి రక్షణకు తగిన చర్యలు తీసుకోవాలి. విలువైన భూమిని సామాజిక ప్రయోజనాలకు కేటాయించకపోతే కబ్జాకు గురయ్యే అవకాశం ఉంది. మేడ్చల్లో అగ్నిమాపక కేంద్రం, ఈఎస్ఐ డిస్పెన్సరీ ఏర్పాటు అవసరం ఉంది. విద్యార్థుల హాస్టళ్లు అరకొర వసతులు ఉన్న అద్దె భవనాల్లో కొనసాతున్నాయి. సంబంధిత స్థలంలో ప్రభుత్వం విద్యార్థులకు పక్కా హాస్టళ్లు కట్టించి ఇవ్వాలి. ప్రభుత్వం, అధికారులు, ప్రజాప్రతినిధులు ఈ దిశగా తగిన చొరవ తీసుకోవాలి.
-నరేశ్, సీపీఎం మండల కార్యదర్శి, మేడ్చల్