నకిరేకల్, ఆగస్టు 11: ‘కేసీఆర్ హయాంలో శ్రీశైలంలోకి వరద ప్రారంభం కాగానే వెంటనే విద్యుత్ ఉత్పత్తి చేసేవారు. శ్రీశైలంలో 875 అడుగులకుపైగా నీళ్లున్నా విద్యుత్ ఉత్పత్తి ఎందుకు చేయడం లేదు? కరెంటు ఉత్పత్తి చేస్తూ ఆ నీటిని సాగర్కు తరలించే అవకాశం ఉన్నా ఈ ప్రభుత్వానికి పట్టింపు లేదు? సాగర్ ఆయకట్టును ఎండబెట్టేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం కుట్రలు చేస్తోంది’ అని మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య ఆరోపించారు. నకిరేకల్ నియోజకవర్గ కేంద్రంలోని సువర్ణగార్డెన్ ఫంక్షన్ హాల్లో మంగళవారం నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. కేసీఆర్ హయాంలో శ్రీశైలంలోకి వరద ప్రారంభం కాగానే విద్యుత్ ఉత్పత్తి ప్రారంభించేవాళ్లని, సాగర్లోనూ శ్రీశైలం గేట్లు తెరిచేలోపే 20 నుంచి 30 అడుగుల నీటిమట్టం పెరిగేదని, విద్యుత్ ఉత్పత్తితో తరలించిన నీటితో కనీసం వానకాలం పంటకైనా నీళ్లు అందేవని అన్నారు. రేవంత్ సర్కార్కు కనీసం నీళ్లు తరలించాలనే కనీస అవగాహన లేకపోవడం దారుణమన్నారు.
శ్రీశైలం నుంచి పోతిరెడ్డిపాడుతో పాటు ఇతర కాల్వల ద్వారా ఏపీ నీళ్లు తరలించుకుపోతోందన్నారు. ఎన్నికల మ్యానిఫెస్టోలో ఇచ్చిన హామీలు అమలు చేస్తామని దేవుళ్లపై ఒట్లు వేసి మాట మార్చిన దుర్మార్గపు చరిత్ర సీఎం రేవంత్రెడ్డిదే అన్నారు. అందుకే తెలంగాణపై వరుణ దేవుడు కరుణించడం లేదని, పాపపు పాలన చూసి వరుణ దేవుడే భయపడుతున్నాడని అన్నారు. రేవంత్రెడ్డి వరుణ యాగం చేస్తే వానలు పడతాయా? ఆయన ఎలాంటి పాపాత్ముడో ఇక్కడి ప్రజలకే కాదు.. పైనున్న దేవుళ్లకి కూడా తెలిసిపోయిందన్నారు. ప్రజల్లో వ్యతిరేకత వస్తుందని గ్రహించి వరుణ యాగం పేరుతో కొత్త డ్రామాలు చేస్తున్నాడని విమర్శించారు. డ్రామాలకు దేవుళ్లను వాడుకుంటున్న చరిత్ర రేవంత్రెడ్డిదన్నారు. ఏపీ సీఎం చందబ్రాబు ఏజెంటుగా సీఎం రేవంత్రెడ్డి తెలంగాణ ప్రజల ప్రయోజనాలకన్నా ఏపీ ప్రయోజనాలకే ఎక్కువగా మొగ్గు చూపుతున్నాడని విమర్శించారు. అందుకు ప్రస్తుతం శ్రీశైలం ప్రాజెక్టుపై రేవంత్ వైఖరే నిదర్శనమన్నారు. సాగర్ నిండాలని, వర్షాలు పడాలని వరుణ యాగం చేసే ప్రభుత్వానికి శ్రీశైలంలో ఉన్న నీటిని వాడుకోవడంలో తెలివి లేదన్నారు.
ఉన్న నీళ్లని ఏపీకి వదిలేసి వరుణయాగం పేరుతో రాష్ట్ర ప్రజలను మోసం చేస్తున్నారన్నారు. ప్రభుత్వం ఇప్పటికైనా మేలుకొని వానకాలం పంటకు సాగర్ ఆయకట్టులో నీళ్లు ఇవ్వడానికి అవకాశం ఉందని, వెంటనే సీఎం రేవంత్రెడ్డి, మంత్రి ఉత్తమ్కుమార్రెడ్డి సాగర్ నీటిపై దృష్టి సారించాలన్నారు. లేనిపక్షంలో సాగర్ ఎడమకాల్వ ఆయకట్టుతో పాటు ఏఎంఆర్పీ ఆయకట్టు రైతులతో కలిసి రేవంత్రెడ్డి సర్కారుపై పోరాటాం చేస్తామని హెచ్చరించారు. సమావేశంలో నకిరేకల్, కేతెపల్లి బీఆర్ఎస్ మండల అధ్యక్షులు ప్రగడపు నవీన్రావు, మారం వెంకట్రెడ్డి, మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ కొప్పుల ప్రదీప్రెడ్డి, మున్సిపల్ మాజీ చైర్మన్ రాచకొండ శ్రీనివాస్, బీఆర్ఎస్ మండల యూత్ అధ్యక్షుడు పేర్ల కృష్ణకాంత్, ఉపాధ్యక్షుడు గుండగోని జంగయ్య, సర్పంచ్లు గొర్ల వీరయ్య, బంటు రవి, సైదిరెడ్డి, మాజీ కౌన్సిలర్ పల్లె విజయ్, సీనియర్ నాయకులు పెండెం సదానందం, రావిరాల మల్లయ్య, యానాల లింగారెడ్డి, గుర్రం గణేశ్, ఇమడపాక వెంకన్న తదితరులు పాల్గొన్నారు.