ప్రజారోగ్యానికి తెలంగాణ ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యతనిస్తున్నది. పల్లె జనానికి సుస్తీ చేస్తే మండల కేంద్రాలు, పట్టణాలకు వెళ్లాల్సిన పనిలేకుండా చెంతనే వైద్యం అందేలా ఆరోగ్య ఉప కేంద్రాలను ఏర్పాటు చేసింది. ఇప్పటి వరకు ఏఎన్ఎంల ఆధ్వర్యంలో కొనసాగిన ఆరోగ్య ఉప కేంద్రాలను పల్లె దవాఖానలుగా మార్చి ఎంబీబీఎస్ వైద్యులను నియమించింది. ఇందులో భాగంగా వికారాబాద్ జిల్లాకు 114 పల్లె దవాఖానలు మంజూరయ్యాయి. ఇందులో 104 పల్లె దవాఖానలకు ఎంబీబీఎస్ వైద్యుల భర్తీ ప్రక్రియ పూర్తి కాగా, 77 దవాఖానల్లో ఇప్పటికే నిత్యం సమగ్ర వైద్య సేవలందుతున్నాయి. ఎంపికైన వైద్యులకు శిక్షణ కొనసాగుతుండగా, ఫిబ్రవరిలో మరో 27 దవాఖానలు అందుబాటులోకి రానున్నాయి. మిగిలిన 10 పల్లె దవాఖానలకు సంబంధించి బ్యాక్లాగ్ పోస్టుల ద్వారా వైద్యుల భర్తీ ప్రక్రియ కొనసాగుతున్నది. పల్లె దవాఖానల్లో మలేరియా, డెంగీ, విషజ్వరాలకు చికిత్స అందిస్తుండగా, గుండె జబ్బులు, క్యాన్సర్, బీపీ, షుగర్, కిడ్నీ సంబంధిత వ్యాధులను ముందే గుర్తించి తగు జాగ్రత్తలు తీసుకునేలా సూచనలతోపాటు అవసరమైన మందులనూ అందిస్తున్నారు. పల్లెల్లోనే మెరుగైన వైద్య సేవలు అందుతుండడంతో పల్లె ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
వికారాబాద్, జనవరి 22 (నమస్తే తెలంగాణ) : గ్రామీణ ప్రాంత ప్రజలకు మెరుగైన, నాణ్యమైన వైద్య సేవలు చేరువయ్యాయి. బస్తీ దవాఖానల మాదిరిగానే జిల్లాలో పల్లె దవాఖానలను ఏర్పాటు చేస్తూ నిర్ణయించింది. ప్రభుత్వ నిర్ణయంతో జిల్లాకు 114 దవాఖానలు మంజూరయ్యాయి. ఇప్పటివరకు 77 దవాఖానలు అందుబాటులోకి రావడంతోపాటు గ్రామీణ ప్రజలకు వైద్య సేవలనందిస్తున్నారు. ఇప్పటికే ఉప కేంద్రాలుగా కొనసాగుతున్న ఆసుపత్రులను పల్లె దవాఖానలుగా మారుస్తూ ప్రభుత్వం నిర్ణయించిన సంగతి తెలిసిందే. ఉపకేంద్రాల్లో కేవలం టీకాలు, తల్లీబిడ్డలకు సంబంధించిన కార్యక్రమాలు నిర్వహిస్తుండేవారు. ఏఎన్ఎంల ఆధ్వర్యంలో కొనసాగిన ఆరోగ్య ఉప కేంద్రాలు ప్రస్తుతం ఎంబీబీఎస్ వైద్యుల ఆధ్వర్యంలో పల్లె దవాఖానలుగా మారాయి. గతేడాది నుంచి జిల్లాలోని గ్రామీణ ప్రాంత ప్రజలకు అందుబాటులోకి వచ్చాయి. మలేరియా, డెంగ్యూ, విషజ్వరాలు తదితర వ్యాధులతో బాధపడుతున్న వారికి వైద్య సేవలను అందిస్తున్నారు. అవసరమైన వారిని జిల్లా దవాఖానలకు పంపుతూ నిరంతరం పర్యవేక్షిస్తున్నారు. గుండె జబ్బులు, క్యాన్సర్, బీపీ, షుగర్, కిడ్నీ సంబంధిత వ్యాధులను ముందే గుర్తించి తగు జాగ్రత్తలు తీసుకునేలా సూచనలతోపాటు అవసరమైన మందులను కూడా అందిస్తున్నారు. ఆదివారం మినహా మిగతా అన్ని రోజుల్లో వైద్య సేవలందుతున్నాయి. పల్లె దవాఖానలతో గ్రామీణ ప్రజల ఆరోగ్య జీవన ప్రమాణాలు కూడా మెరుగుపడే అవకాశాలున్నారు.
జిల్లాకు 114 పల్లె దవాఖానలను మంజూరు చేసింది. 104 దవాఖానలకు సంబంధించి వైద్యుల నియామక ప్రక్రియ పూర్తికాగా.. 77 దవాఖానల్లో వైద్య సేవలు అందుబాటులోకి వచ్చాయి. మరో 10 దవాఖానలకు సంబంధించి బ్యాక్లాగ్ పోస్టుల ద్వారా భర్తీ చేసేందుకు ప్రక్రియను కొనసాగిస్తున్నారు. మరో 27 దవాఖానలను ఫిబ్రవరిలో అందుబాటులోకి తీసుకువచ్చేందుకు జిల్లా వైద్యారోగ్య శాఖ చర్యలు చేపట్టింది. అందుకనుగుణంగా ఇప్పటికే ఎంపికైన వైద్యులకు శిక్షణనిచ్చే కార్యక్రమం కొనసాగుతున్నది. పల్లె దవాఖానలతో వైద్య సేవలు అందించే కేంద్రాలు అభివృద్ధిలోకి రావడంతోపాటు వైద్యారోగ్యం విషయంలో జిల్లా ప్రగతి పథంలో నిలువనుంది. మండల కేంద్రాల్లోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలకు ప్రజలు వెళ్లాల్సిన అవసరం లేకుండా క్షేత్రస్థాయిలో గ్రామీణ ప్రాంతంలోనే నాణ్యమైన వైద్యాన్ని అందిస్తున్నారు.
జిల్లాలో 77 పల్లె దవాఖానలు క్షేత్రస్థాయిలో అందుబాటులోకి వచ్చాయి. గతేడాది నుంచి గ్రామీణ ప్రాంత ప్రజలకు నాణ్యమైన వైద్య సేవలనందిస్తున్నారు. జిల్లాలో అందుబాటులోకి వచ్చిన అన్ని దవాఖానల్లోనూ ఓపీ సేవలనందిస్తున్నారు. సీజనల్ వ్యాధులతోపాటు దీర్ఘకాలిక వ్యాధులను కూడా ముందే గుర్తించేందుకు పల్లె దవాఖానలు ఉపయోగపడుతున్నాయి. ప్రతీ పల్లె దవాఖానకు అర్హులైన ఎంబీబీఎస్ వైద్యులను నియమిస్తున్నాం. ఈ దవాఖానలతో గ్రామీణ ప్రాంత ప్రజలకు మెరుగైన, నాణ్యమైన వైద్యం అందుబాటులోకి వచ్చింది.
– పాల్వన్కుమార్, జిల్లా వైద్యారోగ్య శాఖ అధికారి