తాండూరు, మార్చి 9 : సీఎం కేసీఆర్ ప్రభుత్వం ఆధునిక పద్ధతుల్లో పంటలను సాగు చేసి రైతులు అధిక దిగుబడులను సాధించేందుకు ఎంతో కృషి చేస్తున్నది. అందులో భాగంగానే రాష్ట్రంలోని ప్రొఫెసర్ జయశంకర్ వ్యవసాయ యూనివర్సిటీ మొదటిసారిగా ఐదు ప్రధాన పంటలపై డ్రోన్ల సహకారంతో రెండేండ్లపాటు మందుల పిచికారీని ప్రయోగాత్మక ప్రవేశపెట్టింది. తాండూరు వ్యవసాయ పరిశోధన కేంద్రంలో కంది, వరంగల్ వ్యవసాయ పరిశోధన కేంద్రంలో పత్తి, పాలెం వ్యవసాయ పరిశోధన కేంద్రంలో వేరుశనగ, జగిత్యాల వ్యవసాయ పరిశోధన కేంద్రంలో సోయాబీన్, రాజేంద్రనగర్ వ్యవసాయ పరిశోధన కేంద్రంలో వరి పంటలపై డ్రోన్ల సహకారంతో ప్రయోగాత్మకంగా మందులను పిచికారీ చేసే కార్యక్రమాలకు శ్రీకారం చుట్టగా విజయవం తమయ్యాయి. మొదటి ఏడాది ఫలితం ఆశాజనకం గా ఉండడంతో రెండో ఏడాది మరింత శ్రద్ధతో పరిశోధనలు జరుపడంతో మంచి ఫలితాలు వచ్చినట్లు వ్యవసాయ శాస్త్రవేత్తలు తెలిపారు. వ్యవసాయంలో డ్రోన్ల వినియోగంపై రెండేండ్ల పాటు చేసిన పరిశోధనల్లో సత్ఫలితాలు రావడంతో ఈ ఏడాది రైతులకు సిఫార్సు చేసినట్లు సంబంధిత శాఖ అధికారులు, శాస్త్రవేత్తలు తెలిపారు.
మరో ఏడాదిపాటు తాండూరు వ్యవసాయ పరిశోధన కేంద్రంలో కుసుమ, పాలెం వ్యవసాయ పరిశోధన కేంద్రంలో వేరుశనగ ట్రయల్ నిర్వహించనున్నట్లు తెలిపారు. పంటలపై ఎంత ఎత్తులో.. ఎంత మోతాదులో మందులు పిచికారీ చేయా లి, పంటలపై విషప్రభావం ఏమైనా ఉంటుందా అనే వాటిపై శాస్త్రీయంగా పరిశీలనలు జరిపి విజ యం సాధించినట్లు శాస్త్రవేత్తలు తెలిపారు. ఎకరాకు 15 నిమిషాల్లో 16 లీటర్ల మందు డ్రోన్ ద్వారా పిచికారీ చేసే అవకాశం ఉందని, పవర్ స్ప్రే వల్ల ఎకరాకు 150 లీట ర్ల మందు పిచికారీ చేయాల్సి వస్తుండగా డ్రోన్తో 16 లీటర్లు మాత్రమే సరిపోతుందని శాస్త్రవేత్తలు వెల్లడించారు.
ఆగ్రోస్ రైతు సేవా కేంద్రాల ద్వారా రైతులకు సరఫరా
పంటలకు ఎరువులు, విత్తనాలు, మందుల పిచికారీకి రైతులకు డ్రోన్లను కిరాయికి ఇచ్చే ప్రక్రియకు రాష్ట్ర ప్రభు త్వం ఆగ్రోస్ ద్వారా శ్రీకారం చుట్టింది. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న రైతు సేవా కేంద్రాల ద్వారా డ్రోన్లను రైతులకు చేరువ చేయాలని, వచ్చే వానకాలం నుంచి అందుబాటులోకి తెచ్చేందుకు చర్యలు చేపట్టినట్లు తెలిసింది. ఇప్పటికే డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్తో ఆగ్రో ఒప్పం దం చేసుకున్నది. ఆగ్రోస్ రైతు సేవా కేంద్రాల ద్వారా విత్తనాలు, ఎరువులు, మందుల పిచికారీకి డ్రోన్ల సేవలను కూడా వారి ద్వారానే అందించాలని నిర్ణయం తీసుకోవడంతో రైతులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఏఆర్ఎస్కే ప్రతినిధులకు డ్రోన్ల నిర్వహణపై శిక్షణ ఇవ్వనున్నారు. రూ.10 లక్షల వరకు ఖర్చయ్యే ఒక్కో డ్రోన్ కొనుగోలుకు వీరికి బ్యాంకు రుణాలు ఇప్పించనుంది. దీంతో వీరు రైతులకు కిరాయికి డ్రోన్ సేవలు అందించనున్నారు.
డ్రోన్లతో అనేక ఉపయోగాలు
వ్యవసాయ పరిశోధన కేంద్రాల్లో రెండేండ్లపాటు డ్రోన్లతో నిర్వహించిన మందుల పిచికారీ ప్రయోగాత్మక పరిశోధనలు సక్సెస్ అయ్యాయి. మరో ఏడాదిపాటు తాండూరు వ్యవసాయ పరిశోధన కేంద్రంలో కుసుమ, పాలెం వ్యవసాయ పరిశోధన కేంద్రంలో వేరుశనగపై పరిశోధన చేయనున్నాం. డ్రోన్ల ద్వారా గం టకు రెండు ఎకరాల చొప్పున 8 గంటల్లో 16 ఎకరాలకు పురుగు మందు పిచికారీ చేయొచ్చు. సాధారణ విధానంతో పోలిస్తే డ్రోన్ల ద్వారా తక్కువ పురుగు మందు పడుతుంది. పంట మొత్తానికి సరైన విధంలో మందు పిచికారీ చేయొచ్చు. వర్షం, గాలి వీచే సమయంలో డ్రోన్లు వినియోగించరాదు. సరైన శిక్షణ ఉన్నవారే డ్రోన్లను ఉపయోగించాలి. వ్యవసాయంలో డ్రోన్ల వినియోగానికి ప్రభుత్వం అందిస్తున్న సహకారం చాలా బాగుంది.
-డా.సుధాకర్, వ్యవసాయ పరిశోధన కేంద్రం ప్రధాన శాస్త్రవేత్త, తాండూరు