ప్రభుత్వం మహిళల అభ్యున్నతికి విశేషంగా కృషి చేస్తున్నది. ‘మహిళలు ఆర్థికంగా ఎదగాలి.. ఆర్థిక స్వావలంబన సాధించాలి..’ అన్న లక్ష్యంతో స్వయం సహాయక సంఘాల (ఎస్హెచ్జీ)ను ఏర్పాటు చేసి ప్రతిఏటా బ్యాంకు లింకేజీ ద్వారా రుణాలను అందజేస్తూ ఆర్థికంగా ఆదుకుంటున్నది. కాగా ఈ ఆర్థిక సంవత్సరంలో బ్యాంకర్లు ఎస్హెచ్జీలకు లక్ష్యానికి మంచి (100.08శాతం) బ్యాంకు లింకేజీ రుణాలను మంజూరు చేశారు.
వికారాబాద్, మార్చి 12 (నమస్తే తెలంగాణ): జిల్లాలోని మహిళా స్వయం సహాయక సంఘా(ఎస్హెచ్జీ)ల బలోపేతానికి గ్రామీణాభివృద్ధి శాఖ ఎంతో కృషి చేస్తున్నది. సంఘాల వారీగా కాకుండా వ్యక్తిగతంగా మహిళలను ఆర్థికంగా బలోపేతం చేసేందుకు వడ్డీలేని రుణాలతోపాటు స్వల్పకాలిక వడ్డీతో కూడిన రుణాలను మంజూరు చేస్తున్నారు. ఈ రుణాలతో మహిళా సంఘాల సభ్యులు గేదెలు, గొర్రెలు, మేకలను కొనుగోలు చేయడంతోపాటు వివిధ రకాల వ్యాపారాలు చేసుకుంటూ ఆర్థికంగా ఎదుగుతున్నారు. కాగా జిల్లాలో ఈ ఆర్థిక సంవత్సరంలో ఎస్హెచ్జీలకు నిర్దేశించిన లక్ష్యానికి మించి రుణాలను బ్యాంకర్లు మంజూరు చేశారు. ఈ ఆర్థిక సంవత్సరంలో రూ.462.29 కోట్ల వడ్డీలేని రుణాలను మంజూరు చేయాలని టార్గెట్గా పెట్టుకుని ఇప్పటివరకు రూ. 462.67 (100.08శాతం)కోట్ల మేర మంజూరు చేశారు. అదేవిధంగా గతేడాది రూ.450 కోట్ల రుణాలకుగాను రూ.499 కోట్ల రుణాలను బ్యాంకర్లు మంజూరు చేశారు. అయితే జిల్లాలో 657 గ్రామ సంఘాలు, 10, 375 స్వయం సహాయక సంఘాలుండగా అందులో 1.80 లక్షల మంది సభ్యులున్నారు. అంతేకాకుండా రుణాలను సక్రమంగా చెల్లిస్తున్న ఎస్హెచ్జీలకు జిల్లా గ్రామీణాభివృద్ధి శాఖ అధికారులు అధిక ప్రాధాన్యమిస్తున్నారు. ఒక్కో స్వయం సహాయక సంఘానికి రూ.5 లక్షల నుంచి రూ.10 లక్షల వరకు రుణాలిస్తూ వాటి అభ్యున్నతికి కృషి చేస్తున్నారు. సంఘాల పనితీరును బట్టి పలు సంఘాలకు ఈ ఆర్థిక సంవత్సరంలో రూ.20 లక్షల వరకూ రుణాలను మంజూరు చేస్తున్నారు.
రూ.462.67 కోట్ల రుణాలు మంజూరు..
ఈ ఆర్థిక సంవత్సరంలో రూ.462.29 కోట్ల వడ్డీలేని రుణాలను మంజూరు చేయాలని టార్గెట్గా పెట్టుకున్న అధికారులు ఇప్పటివరకు రూ.462.67(100. 08 శాతం)కోట్ల మేర మంజూరు చేశారు. అత్యధికంగా బంట్వారం మండలంలో లక్ష్యానికి మించి 131.76 శాతం మేర మంజూరు చేయగా, నవాబుపేటలో 29.57కోట్లు(119%), కోట్పల్లిలో 118%, మోమిన్పేటలో రూ. 35.69కోట్లు (113%), తాండూరులో రూ.29.13కోట్లు(110%), యాలాలలో రూ. 27. 81కోట్లు(115%), పూడూరులో 76.09%, కొడంగల్లో 100%, మర్పల్లిలో 106%, చౌడాపూర్లో 65.12%, కులకచర్లలో రూ.37.02 కోట్లు( 107%), బషీరాబాద్లో రూ.29.52కోట్లు(101%), దోమలో రూ.29.85 కోట్లు (105 %), పెద్దేముల్లో 97.45%, పరిగిలో రూ.25.01కోట్లు(100%), ధారూరు లో 100.36%, వికారాబాద్లో 67.31%, బొంరాస్పేటలో 26.19 కోట్లు (100.98%), దౌల్తాబాద్ మండలంలో 66.20% మేర బ్యాంకు లింకేజీ రుణాలను మంజూరు చేశారు. అదేవిధంగా ఈ ఆర్థిక సంవత్సరం ముగిసేందుకు మ రో 15 రోజులు గడువున్న దృష్ట్యా జిల్లాలోని అన్ని మండలాల్లోనూ 105 శాతానికిపైగా రుణాలను మంజూరు చేయాలని అధికారులు లక్ష్యంగా పెట్టుకున్నారు. కాగా, 8,794 ఎస్హెచ్జీలకు రూ.462.67 కోట్ల రుణాలు మంజూరయ్యాయి.
పని చేయని సంఘాలపై ప్రత్యేక దృష్టి..
మరోవైపు జిల్లాలో ఎన్పీఏ(పనిచేయని సంఘాలు)లపై అధికారులు ప్రత్యేక దృష్టి సారించారు. రుణాలు తిరిగి చెల్లించడంలో మొండికేసిన సంఘాలకు బ్యాంకు లింకేజీ రుణాలను నిలిపివేశారు. అదేవిధంగా విలేజ్ ఎంటర్ప్రైజెస్ కార్యక్రమంలో భాగంగా జిల్లాలోని గ్రామీణ మహిళలు వ్యాపారాలు ఏర్పాటు చేసుకొని ఆర్థికంగా ఎదుగుతున్నారు. ప్రతి గ్రామంలోని స్వయం సహాయక సంఘాల్లోని ఆసక్తిగల ముగ్గురు చొప్పున మహిళలను ఎంపిక చేసి, వారికి స్వయం ఉపాధి కల్పనలో కొత్త, కొత్త వ్యాపారాలను ప్రారంభించేందుకు అవసరమైన నైపుణ్యాన్ని, ఆర్థిక వనరులను విలేజ్ ఎంటర్ప్రైజెస్ కార్యక్రమం కింద అధికారులు కల్పిస్తున్నారు. దీంతో జిల్లాలో ఇప్పటివరకు మూడు వేల మంది మహిళలు వ్యాపారులుగా మారారు. వారు వివిధ వ్యాపారులు చేసుకునేందుకు బ్యాంకు లింకేజీ, స్త్రీనిధి, గ్రామసంఘం నిధుల ద్వారా సుమారు రూ.30 కోట్ల రుణాలు అందజేశారు. విలేజ్ ఎంటర్ప్రైజెస్లోఎంపికైన మహిళా స్వయం సహాయక సంఘాల సభ్యులకు వ్యాపారం చేసుకునేందుకు ఒక్కో సభ్యురాలికి రూ.లక్ష నుంచి రూ.4 లక్షల వరకు రుణాలను మంజూరు చేస్తున్నారు.