రంగారెడ్డి జిల్లాలో ఉచిత చేప పిల్లల పంపిణీ షురూ అయ్యింది. సోమవారం మహేశ్వరం నియోజకవర్గంలోని జల్పల్లి చెరువులో రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితారెడ్డి చేప పిల్లలను వదిలి శ్రీకారం చుట్టారు. మత్స్యకారుల అభ్యున్నతే లక్ష్యంగా రాష్ట్ర సర్కార్ ఏటా వందశాతం సబ్సిడీతో చేపపిల్లలను పంపిణీ చేస్తున్నది. ఈ ఏడాది కూడా జిల్లాలోని 576 చెరువుల్లో కోటీ 16 లక్షల చేప పిల్లలను పెంచడమే లక్ష్యంగా జిల్లా మత్స్యశాఖ ముందుకెళ్తున్నది. గతేడాది కన్నా ఈసారి పది లక్షల చేప పిల్లలను అధికంగా పంపిణీ చేయనున్నారు. 82-100 మి.మీటర్లు, 35-40 మి.మీటర్ల పరిమాణం గల రెండు రకాల చేపపిల్లలను చెరువుల్లో వదలనున్నారు. అంతేకాకుండా మత్స్యకారులు చేపలు విక్రయించేందుకుగాను ఇప్పటికే 70 శాతం సబ్సిడీతో వాహనాలను కూడా అందజేసింది. కాగా, జిల్లావ్యాప్తంగా 103 మత్స్యకారుల సొసైటీలుండగా 6616 మంది సభ్యులు ఉన్నారు.
రంగారెడ్డి, సెప్టెంబర్ 5, (నమస్తే తెలంగాణ) : టీఆర్ఎస్ ప్రభుత్వం చేపడుతున్న కార్యక్రమాలతో కులవృత్తుల జీవితాల్లో వెలుగులు నిండాయి. గొల్లకుర్మలకు పూర్తి సబ్సిడీపై గొర్రెల పంపిణీ, మత్స్యకారులకు వంద శాతం సబ్సిడీ చేపల పంపిణీ కార్యక్రమాన్ని ప్రభుత్వం అమలుచేస్తున్నది. దీంతో మత్స్యకారుల కుటుంబాలు ఆర్థికంగా బలోపేతమయ్యాయి. చేపల పెంపకం కార్యక్రమంలో భాగంగా సోమవారం రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితాఇంద్రారెడ్డి మహేశ్వరం నియోజకవర్గంలోని జల్పల్లి చెరువులో చేప పిల్లలను వదిలి లాంఛనంగా ప్రారంభించారు. ఈ ఏడాది జిల్లాలో 1.16 కోట్ల చేప పిల్లలను పెంచడమే లక్ష్యంగా నిర్ణయించారు. చిన్న, పెద్ద పరిమాణంగల చేప పిల్లలను జిల్లాలోని చెరువుల్లో పెంచనున్నారు. పెద్ద చేపపిల్లలు (82-100 మి.మీ), చిన్న చేపపిల్లలను(35-40 మి.మీ) చెరువుల్లో వదలనున్నారు.
వంద శాతం సబ్సిడీతో..
ఈ ఏడాది జిల్లాలో 576 చెరువుల్లో చేపల పెంపకం జరుగనున్నది. 119 చెరువులు మైనర్ ఇరిగేషన్ ఆధ్వర్యంలో ఉండగా.. మిగతా 417 చెరువులు గ్రామపంచాయతీల ఆధ్వర్యంలో కొనసాగుతున్నాయి. చేపకు, చెరువుకు ఉన్న అనుబంధాన్ని తిరిగి నెలకొల్పే సదుద్దేశంతో చెరువుల్లో చేపలను పెంచేందుకు సీఎం కేసీఆర్ నిర్ణయించిన సంగతి తెలిసిందే. వందశాతం సబ్సిడీతో పంపిణీ చేసిన చేపలను మత్స్యకారుల సొసైటీల ఆధ్వర్యంలో పెంచుతున్నారు. గతంలో కొన్ని చెరువుల్లో నీరు ఉండకపోవడం, మరికొన్ని చెరువుల్లో నీరున్నప్పటికీ ప్రభుత్వ ప్రోత్సాహం లేకపోవడంతో నిరుత్సాహంతో కొట్టుమిట్టాడాల్సిన పరిస్థితి నెలకొని ఉండేది. చెరువుల్లో నీరు లేక కొందరు మత్స్యకారులు వలసలు పోగా, మరికొందరు ఇతర పనులు చేస్తుండేవారు. టీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత మిషన్ కాకతీయ కార్యక్రమంలో భాగంగా చెరువుల్లో పూడికతీత పనులు, పూర్తైన చెరువుల్లో చేపపిల్లలను పెంచే ప్రక్రియకు శ్రీకారం చుట్టారు.
అక్రమాలకు తావు లేకుండా చేపల పెంపకం
జిల్లా కలెక్టర్ల ఆధ్వర్యంలో చెరువుల విస్తీర్ణాన్ని బట్టి చేపలను పెంచుతున్నారు. ఎలాంటి అక్రమాలకు తావు లేకుండా చేపల పెంపకం జరుగుతున్నది. గ్రామ కార్యదర్శి తదితరులతో కూడిన గ్రామస్థాయిలో కమిటీలను కూడా ప్రభుత్వం నియమించింది. జిల్లాలో 103 మత్స్యకారుల సొసైటీలుండగా.. వీటిలో 12 మహిళా మత్స్య పారిశ్రామిక సంఘాలున్నాయి. మత్స్య పారిశ్రామిక సహకార సంఘాల్లో 6616 మంది సభ్యులున్నారు. ప్రభుత్వం పూర్తి సబ్సిడీతో అందజేయడంతోపాటు చేపల విక్రయాల్లో మత్స్యకారులు నష్టపోకుండా కూడా చర్యలు చేపట్టింది. జిల్లాలో పెంచిన చేపలను ఇతర ప్రాంతాలకు తరలించకుండా హైదరాబాద్తోపాటు స్థానికంగా విక్రయించేందుకు అధికారులు ఏర్పాట్లు చేశారు. చేపలను విక్రయించేందుకు 70 శాతం సబ్సిడీతో వాహనాలను కూడా ప్రభుత్వం ఇప్పటికే మత్స్యకారులకు అందజేసింది.
మత్స్యకారుల జీవితాల్లో వెలుగులు
రాష్ట్ర ప్రభుత్వం బడుగు, బలహీన వర్గాలకు అత్యంత ప్రాధాన్యతనిస్తున్నది. గొల్ల, కుర్మలను ఆర్థికంగా బలోపేతం చేసేందుకు గొర్రెలను పంపిణీ చేసిన ప్రభుత్వం మత్స్యకారుల కుటుంబాలు ఆర్థికంగా నిలదొక్కుకునేందుకు చేపల పెంపకాన్ని ప్రోత్సహిస్తున్నది. గత ప్రభుత్వాలు పూర్తిగా విస్మరించిన మత్స్యకారులకు టీఆర్ఎస్ ప్రభుత్వం పూర్తి భరోసాను కల్పించింది. చేపల పెంపకాన్ని వదిలి ఏదో ఒక కూలీ పని చేస్తూ బతుకునీడుస్తున్న మత్స్యకారుల కుటుంబాల్లో సీఎం కేసీఆర్ తిరిగి వెలుగులు నింపారు. ఇందులో భాగంగా గత ఐదేండ్లుగా మత్స్యకారులకు వంద శాతం సబ్సిడీతో చేప పిల్లలను ప్రభుత్వం పంపిణీ చేస్తున్నది. రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టిన మిషన్ కాకతీయలో భాగంగా చెరువుల పూడికతీత పనులు సక్సెస్ కావడం, చెరువుల్లో నీరు నిండుతుండడంతో చేపల పెంపకానికి నిర్ణయించిన సంగతి తెలిసిందే. ఇప్పటికే నాలుగు దఫాల్లో చేపల పెంపకం పూర్తి కావడంతో సంబంధిత చేపలను విక్రయించిన మత్స్యకారుల జీవితాల్లో వెలుగులు నిండాయి. మత్స్యకారుల జీవితాల్లో నూతనోత్సాహం నింపిన సీఎం కేసీఆర్కు వారు కృతజ్ఞతలు తెలుపుతున్నారు.