ఇబ్రహీంపట్నం, మార్చి 15 : రోజురోజుకూ పెరిగిపోతున్న సైబర్క్రైమ్ మోసాలపట్ల ప్రజలు, యువత, విద్యార్థినులు అప్రమత్తంగా ఉండాలని రాచకొండ సీపీ దేవేంద్రసింగ్ చౌహాన్ అన్నారు. బుధవారం రాచకొండ సెక్యూరిటీ కౌన్సిలింగ్, రాచకొండ పోలీసుల ఆధ్వర్యంలో సైబర్క్రైమ్ నేరాలపై విద్యార్థినులకు అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా సీపీ హాజరై మాట్లాడారు. వ్యక్తిగత సమాచారాన్ని ఆన్లైన్లో షేర్చేయటం వలన అనేక అనర్థాలు జరుగుతున్నాయన్నారు. కొంతమంది సైబర్నేరగాళ్లు ఆన్లైన్లో ఉన్న వ్యక్తిగత సమాచారాన్ని చోరీచేసి మోసాలకు పాల్పడుతున్నారని పేర్కొన్నారు. ఫేస్బుక్లో ఉన్న ఫొటోలను షేర్చేసి మార్ఫింగ్ చేసి బ్లాక్మెయిల్కు పాల్పడుతున్నారని, వ్యక్తిగత సమాచారం విషయంలో ప్రతి ఒక్కరూ జాగ్రత్తగా వ్యవహరించాలని సూచించారు.
సైబర్క్రైమ్ నేరాలపైన రాచకొండ కమిషనరేట్ పరిధిలోని అన్ని యూనివర్సిటీలు, ఇంజినీరింగ్ కళాశాలల్లో అవగాహన సదస్సులు నిర్వహిస్తామన్నారు. తెలిసీ, తెలియక సైబర్నేరగాళ్ల ఉచ్చులో పడుతున్నవారు ఎలాంటి ఆలస్యం చేయకుండా పోలీసులకు సమాచారం అందించాలన్నారు. ముఖ్యంగా టెక్నాలజీ ఉపయోగించి కొంతమంది నేరగాళ్లు లోన్లు ఇస్తామంటూ మోసాలకు పాల్పడుతున్నారని, అలాంటివారి ఫోన్లు లిఫ్ట్చేయవద్దని చెప్పారు. అలాగే, ఉచిత ఆఫర్స్ పేరిట ఫోన్లలో మోసాలకు పాల్పడుతున్నారని పేర్కొన్నారు. గుర్తుతెలియని వ్యక్తుల నుంచి వచ్చే ఫోన్కాల్స్ను స్వీకరించకపోవటమే మంచిదని సూచించారు. ఎవరైనా మోసాలకు పాల్పడినట్లయితే టోల్ఫ్రీ నంబర్ 1930ను సంప్రదించాలన్నారు.
మహిళల భద్రతకు పెద్దపీట..
రాచకొండ కమిషనరేట్ పరిధిలో మహిళల భద్రతకు అధిక ప్రాధాన్యత ఇస్తున్నట్లు సీపీ చౌహాన్ అన్నారు. మహిళల భద్రత కోసం షీటీమ్స్ ఎప్పుడూ అందుబాటులో ఉంటాయని అన్నారు. డీజీపీలు అనురాధ, శ్రీబాల, శ్రీనివాస్ మాట్లాడుతూ.. లోన్యాప్ ద్వారా అప్పుల ఎరచూపించి అపాయంలోకి నెట్టుతున్నారని తెలిపారు. కళాశాల వైస్చైర్మన్ గగన్దీప్సింగ్ కోహ్లీ మాట్లాడుతూ విద్యార్థులు ఫోన్లపై దృష్టి పెట్టకుండా చదువుపై దృష్టి సారించాలని అన్నారు. కార్యక్రమంలో ఇబ్రహీంపట్నం ఏసీపీ ఉమామహేశ్వర్రావు, సైబర్క్రైమ్ ఏసీపీ వెంకటేశం, రాచకొండ సెక్యూరిటీ కౌన్సిల్ సావిత్రి, గురునానక్ విద్యాసంస్థల ఎండీ హెచ్ఎస్ షైనీ, మోటివేషన్ స్పీకర్ అనిల్ రాచమల్లు పాల్గొన్నారు.
నేరాల అదుపునకు చర్యలు తీసుకోండి
నేరాల అదుపునకు పోలీసులు చర్యలు తీసుకోవాలని రాచకొండ సీపీ దేవేంద్రసింగ్ చౌహాన్ అన్నారు. బుధవారం ఆయన ఇబ్రహీంపట్నం, ఆదిబట్ల పోలీస్స్టేషన్ల పనితీరును ఆయన తనిఖీచేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పోలీసులు ప్రజలతో మమేకమై నేరాల అదుపుపై దృష్టి సారించాలన్నారు. ముఖ్యంగా పెరిగిపోతున్న సైబర్క్రైమ్పట్ల దృష్టి సారించాలన్నారు. అలాగే, ఇబ్రహీంపట్నం డివిజన్ పరిధిలో ప్రమాదాల నివారణపట్ల దృష్టి సారించాలన్నారు. ముఖ్యంగా పోలీస్స్టేషన్ల పరిధిలో సాగర్హ్రదారిపై ప్రమాదాలు జరుగకుండా తగు చర్యలు తీసుకోవాలని, అలాగే, మరిన్ని సీసీకెమెరాలు కూడా ఏర్పాటు చేయాలన్నారు. ఇంజినీరింగ్ కళాశాలల చుట్టూ సీసీకెమెరాలను ఏర్పాటుచేసి నేరాల అదుపునకు చర్యలు తీసుకోవాలన్నారు. అలాగే, కళాశాల విద్యార్థుల పట్ల ఎవరైనా అసభ్యకరంగా ప్రవర్తించినా, కళాశాలలో ర్యాగింగ్కుపాల్పడితే తగు చర్యలు తీసుకోవాలన్నారు. కార్యక్రమంలో మహేశ్వరం డీసీపీ సీహెచ్ శ్రీనివాస్, ఇబ్రహీంపట్నం ఏసీపీ ఉమామహేమశ్వర్రావులున్నారు.