కొడంగల్, నవంబర్ 8 : ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ 6 గ్యారెంటీలు హామీ ఇవ్వడం విడ్డూరంగా ఉందని రాష్ట్ర సమాచార, పౌరసంబంధాలు, గనులు, భూగర్భ వనరుల శాఖ మంత్రి డా.పట్నం మహేందర్రెడ్డి ఎద్దేవా చేశారు. బుధవారం ఎన్నికల ప్రచారంలో భాగంగా మండలంలోని చిట్లపల్లి గ్రామంలో ఎమ్మెల్యే పట్నం నరేందర్రెడ్డితో కలిసి ముమ్మరంగా పర్యటించారు. ఈ సందర్భంగా గ్రామ కూడలిలో ప్రజలను ఉద్దేశించి మాట్లాడుతూ కాంగ్రెస్ ఉనికిని చాటుకునేందుకు 6 గ్యారెంటీలను ఎన్నికల ప్రచారంలో వాడుకొంటుందని ఆరోపించారు. ప్రజా సంక్షేమంపై కాంగ్రెస్ పార్టీకి కానీ, నాయకులకు కానీ చిత్తశుద్ధి లేదన్నారు.
ఈ ఎన్నికల్లో 6 గ్యారెంటీలు తెరపైకి ఎందుకు తెచ్చారని, గత పాలనలో గుర్తుకు రాలేదా అని ప్రశ్నించారు. సీఎం కేసీఆర్ ప్రజా సంక్షేమ పథకాలను చూసిన తరువాతే కాంగ్రెస్ కండ్లు తెరిచిందని, కేసీఆర్ పథకాలను కాపీ కొడుతూ వేలం పాట మాదిరిగా గ్యారెంటీలను తీసుకొచ్చినట్లు పేర్కొన్నారు. బీఆర్ఎస్ ఇంత ఇస్తే.. మేము అంతకంటే రెట్టింపు ఇస్తామని కాంగ్రెస్ పార్టీ వేలం పాట పాడుతుందని, కాంగ్రెస్ మాటలను నమ్మడానికి ప్రజలు సిద్ధంగా లేరన్నారు. రేవంత్రెడ్డి గత 2018 ఎన్నికల్లో కొడంగల్లో ప్రాజెక్టు, ఫ్యాక్టరీ, రైలు మార్గం అంటూ ప్రచారం చేయడం జరిగిందన్నారు.
రేవంత్రెడ్డికి ఏ ఒక్కటీ సాధ్యం చేసే సత్తాలేదని ప్రజలు గుర్తించి తిరస్కరించడం జరిగిందన్నారు. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో కోట్లు పెట్టి పీసీసీ పదవిని కొనుక్కొని, కాంగ్రెస్ టికెట్ల వ్యాపారం చేస్తున్నట్లు ఆరోపించారు. బీఆర్ఎస్ పార్టీతోనే తెలంగాణ భవిష్యత్ ఆధారపడి ఉందని, కారు గుర్తుకు ఓటు వేసి గెలిపించాలన్నారు. అనంతరం మంత్రి సమక్షంలో గ్రామంలోని మహిళలు, పెద్దలు, యువకులు బీఆర్ఎస్ పార్టీలో చేరారు. కార్యక్రమంలో మాజీ ఎంపీపీ చిట్లపల్లి మధుసూదన్రెడ్డి, ఖాజా అహ్మద్పల్లి సర్పంచ్ అంజప్పతో పాటు బీఆర్ఎస్ నాయకులు మధుసూదన్రావుయాదవ్, కాశప్ప, రమేష్బాబు పాల్గొన్నారు.