గ్రామీణ క్రీడాకారులను ప్రోత్సహించే దిశగా ప్రభుత్వం చర్యలు తీసుకుంటున్నది. దీనిలో భాగంగా ఆటలు ఆడుకునేందుకు గ్రామాల్లో సకల సౌకర్యాలతో మైదానాలను ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. ఊరికో ‘తెలంగాణగ్రామ క్రీడా ప్రాంగణం’ పేరుతో ఆట స్థలాలను నిర్మించేందుకు ఆదేశాలు జారీ చేసింది. ఈ మేరకు వికారాబాద్ జిల్లా అధికారులు కసరత్తును ప్రారంభించారు. ఇప్పటికే 249 గ్రామాల్లో స్థలాలను సైతం గుర్తించగా.. రెవెన్యూ అధికారులు త్వరలోనే సర్వే పూర్తి చేసి జిల్లా గ్రామీణాభివృద్ధిశాఖకు అప్పగించనున్నారు. ఉపాధిహామీ పనిలో భాగంగా స్థలాన్ని చదును చేయించనున్నారు. మైదానం చుట్టూ రెండు వరుసల్లో మొక్కలతో బయో ఫెన్సింగ్ ఏర్పాటుకు నిర్ణయించారు. ఈ క్రీడా ప్రాంగణాలతో ఆటలాడేందుకు స్థలం సమస్య తీరనున్నది. కాగా, బుధవారం నగరంలోని ప్రగతి భవన్లో నిర్వహించిన సమావేశంలో సీఎం కేసీఆర్ సూచించిన విధంగా గ్రామ గ్రామాన క్రీడా కమిటీలను ఏర్పాటు చేయడంతోపాటు జూన్ 2న కొన్ని చోట్ల క్రీడా మైదానాలు ప్రారంభించేందుకు సన్నాహాలు చేస్తున్నారు.
పరిగి, మే 18 : చిన్నప్పుడు ఆటలే ప్రధానం.. ఆటల ద్వారా మానసిక ఉల్లాసం కలగడంతోపాటు శారీరక దృఢత్వానికి దోహదం చేస్తాయి. పిల్లల మధ్య స్నేహానుబంధాలు ఏర్పడుతాయి. అలాంటిది స్థలం లేక, సమయం వెచ్చించక పిల్లలు ఆటలకు దూరమవుతున్నారు. గ్రామాల నుంచి మొదలుకొని పట్టణాల వరకు ప్రస్తుతం ఉన్న పరిస్థితి నేపథ్యంలో ప్రభుత్వం ప్రతి గ్రామంలో ఒక ఆటస్థలం ఏర్పాటుకు నిర్ణయించింది. వీటికి ‘తెలంగాణ గ్రామ క్రీడా ప్రాంగణం’ అని ఆటస్థలాలకు పేరు పెట్టనున్నారు. వికారాబాద్ జిల్లా పరిధిలో 566 గ్రామపంచాయతీలు ఉండగా ప్రతి గ్రామపంచాయతీ కేంద్రంలో, గ్రామానికి సాధ్యమైనంత వరకు దగ్గరగా ఉండే స్థలాల్లో ఈ ఆట స్థలం ఏర్పాటుకు సన్నాహాలు జరుగుతున్నాయి. ఉపాధిహామీ పథకం ద్వారా ఈ స్థలం ఆటలకు అనువుగా తయారు చేసేందుకు ప్రభుత్వం నిర్ణయించింది. త్వరలోనే కొత్త క్రీడా పాలసీ తీసుకురానున్న ప్రభుత్వం గ్రామస్థాయి నుంచి క్రీడలు, క్రీడాకారులను ప్రోత్సహించేందుకు ఆట స్థలాల ఏర్పాటుకు ప్రణాళికా బద్దంగా ముందుకు సాగుతుంది.
ప్రగతి నిర్దేశం..
నగరంలోని ప్రగతి భవన్లో రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ అన్ని జిల్లాల కలెక్టర్లతో సమావేశం నిర్వహించారు. ఈ కాన్ఫరెన్స్లో రంగారెడ్డి కలెక్టర్ అమయ్కుమార్, వికారాబాద్ కలెక్టర్ నిఖిల పాల్గొనగా.. సీఎం కేసీఆర్ పలు అంశాలపై దిశానిర్దేశం చేశారు. పల్లె, పట్టణ ప్రగతి పనులను విజయవంతం చేయాలని సూచించారు. జూన్ 2న రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించాలన్నారు.
ఎకరం విస్తీర్ణంలో ఆట స్థలం
గ్రామాల్లో ఏర్పాటు చేయబోయే ఆటస్థలాలకు కనీసం ఎకరం స్థలం ఉండేలా చూడాలని ఉన్నతాధికారులు ఆదేశించారు. అలాగే గ్రామానికి దగ్గరలో ఉండేలా చూస్తున్నారు. గ్రామానికి దగ్గరలో ఎకరం కంటే అధికంగా ఉంటే మరింత మంచిదని, ఆ స్థలం సైతం లేకుండా కనీసం అర ఎకరమైనా ఆటస్థలానికి కేటాయించేందుకు నిర్ణయించారు. ఈ స్థలాల ఎంపిక పూర్తయిన తర్వాత వాటిలో రాళ్లు, ఇతర ముళ్లపొదలు ఉంటే వెంటనే తొలగించడం జరుగుతుంది. ఉపాధిహామీ పథకం ద్వారా ఈ చదును చేసే పనులు చేయించనున్నారు. చదును చేసి వివిధ రకాల క్రీడలు ఆడేందుకు వీలుగా మైదానం తయారు చేసి, అనంతరం స్థలం చుట్టూ కనీసం రెండు వరుసల్లో గుంతలు తవ్వించి వివిధ రకాల మొక్కలు నాటుతారు. ఇందులో చక్కటి నీడను ఇచ్చే పెద్ద మొక్కలు ఎంపిక చేసి నాటించడం చేపడుతారు. ఈ స్థలం చుట్టూ బయో ఫెన్సింగ్ ఏర్పాటు సైతం చేపడుతారు. తద్వారా పశువులు, మేకలు తదితరాలు మైదానం లోపలకు వెళ్లకుండా ఉండేందుకు ఈ ఫెన్సింగ్ దోహదం చేస్తుంది.
జిల్లాలో 249 గ్రామాల్లో స్థలాల గుర్తింపు..
వికారాబాద్ జిల్లా పరిధిలో 566 గ్రామపంచాయతీలు ఉండగా ఇప్పటివరకు జిల్లాలో 249 గ్రామాల్లో ఆటస్థలాల ఏర్పాటుకు ప్రభుత్వ భూములు గుర్తించారు. ఈ మేరకు ఆయా గ్రామాల వారిగా, సర్వే నంబర్లు, అందుబాటులోని స్థలం తదితర వివరాలను ఇప్పటికే జిల్లా గ్రామీణాభివృద్ధి శాఖ అధికారులకు కలెక్టర్ ద్వారా పంపించారు. ఆయా మండలాల వారీగా రెవెన్యూ అధికారులు ఈ స్థలాలు గుర్తించి, సర్వేయర్లతో పూర్తిస్థాయిలో సర్వే చేయించి గ్రామీణాభివృద్ధి శాఖ అధికారులకు అప్పగించనున్నారు. వచ్చే వారం, పది రోజుల వ్యవధిలో ఈ స్థలాల సర్వే పూర్తి చేసి గ్రామీణాభివృద్ధి శాఖ అధికారులకు అప్పగించనున్నట్లు తెలిసింది.
ఆటలకు కేంద్రాలుగా స్థలాలు..
గ్రామాలలోని చాలావరకు పాఠశాలల ఆవరణలో స్థలం లేక, ఉన్నచోట సైతం సరైన విధంగా లేకపోవడం, ఇతర కారణాలతో పిల్లలు ఆటకు దూరమవుతున్నారు. తద్వారా శారీరక శ్రమ లేక, కేవలం చదువుపైనే దృష్టి పెడుతున్నారు. ఆటలు ఆడకపోవడంతో మానసికంగా సైతం ఇబ్బందులకు గురవుతున్నారు. ఈ నేపథ్యంలో ప్రతి గ్రామంలో ఆటలకు ప్రత్యేకంగా స్థలం కేటాయించి, ఆటలు ఆడేందుకు వీలుగా స్థలం చదును చేయడం, చుట్టూ పచ్చటి చెట్లు పెంపకం ద్వారా చక్కటి ఆహ్లాదకరమైన వాతావరణంలో పిల్లలు ఆటలు ఆడేందుకు ఈ స్థలాలు ఆటల కేంద్రాలుగా నిలవబోతున్నాయి. మరోవైపు కొత్త క్రీడా పాలసీ వచ్చిన తర్వాత ఆటలకు సర్కారు మరింత ప్రోత్సాహం అందించే అవకాశం ఉన్నది. గతంలో అంతర్జాతీయ స్థాయిలో పతకాలు సాధించిన వారికి అందజేసే ప్రోత్సాహకాలు అనేక రేట్లు పెంచిన ఘనత సీఎం కేసీఆర్కు దక్కుతుంది. గ్రామస్థాయి నుంచి క్రీడలను ప్రోత్సహించేందుకు సర్కారు చేస్తున్న కృషి అభినందనీయమని పేర్కొంటున్నారు. గ్రామీణ క్రీడా కమిటీలను ఏర్పాటు చే యనున్నారు. గ్రామాల్లో క్రీడలను నిర్వహించేందుకు ఈ కమిటీలు పనిచేయనున్నాయి. జూన్ 2 ఎంపిక చేసిన కొన్ని చోట్ల క్రీడా మైదానాలను ప్రారంభించేందుకు సన్నాహాలు చేస్తున్నారు.
స్థలాలు గుర్తించాం
ప్రతి గ్రామానికి ఒక క్రీడా ప్రాంగణం ఏర్పాటుకు ప్రభుత్వం నిర్ణయించింది. తెలంగాణ గ్రామ క్రీడా ప్రాంగణం పేరిట ప్రతి గ్రామంలో కనీసం ఒక ఎకరం స్థలంలో ఈ ప్రాంగణం ఏర్పాటు చేయనున్నారు. జిల్లాలో ఇప్పటివరకు 249 గ్రామాల్లో స్థలాలు గుర్తించాం. మిగతా గ్రామాల్లోనూ స్థలాలు గుర్తించి తమ శాఖకు అప్పగించిన తర్వాత వాటిని చదును చేయించి ఆటలకు అనువుగా మార్చుతాం. ప్రాంగణం ఆవరణలో చక్కటి వాతావరణం కోసం చుట్టూ మొక్కలు పెంపకం చేపడుతాం.
-కృష్ణన్, డీఆర్డీవో, వికారాబాద్ జిల్లా