బొంరాస్పేట, ఫిబ్రవరి 1 : గ్రామ పంచాయతీ సర్పంచ్ల పదవీకాలం గురువారంతో ముగిసింది. దీంతో ప్రభుత్వ ఆదేశాలతో ఆయా గ్రామ పంచాయతీల్లో ప్రత్యేకాధికారులను జిల్లా అధికార యంత్రాంగం నియమించింది. గడువు ముగిసిన పంచాయతీలకు ఎన్నికలు నిర్వహించడానికి రాష్ట్ర ఎన్నికల సంఘం ఆదేశించినా కొత్తగా ఏర్పడిన కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల నిర్వహణకు సుముఖంగా లేకపోవడంతో గ్రామాల్లో ప్రత్యేకాధికారుల పాలన అనివార్యమైంది. 2019 జనవరిలో అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వం గ్రామ పంచాయతీలకు ఎన్నికలు నిర్వహించింది.
గెలుపొందిన సర్పంచ్లు, వార్డు సభ్యులు ఫిబ్రవరి 1వ తేదీన పదవీ బాధ్యతలు స్వీకరించారు. 2018 పంచాయతీరాజ్ చట్టం ప్రకారం పంచాయతీల పాలకవర్గాల పదవీకాలం ముగిసేలోగా వాటికి ఎన్నికలు నిర్వహించాలి. ప్రస్తుతం ఎన్నికలు నిర్వహించే పరిస్థితులు లేకపోవడంతో ప్రత్యేకాధికారుల ద్వారా పంచాయతీల పాలన కొనసాగించేందుకు ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. అందుకనుగుణంగా శుక్రవారం నుంచి గ్రామ పంచాయతీల పాలనా పగ్గాలు ప్రత్యేకాధికారుల చేతుల్లోకి వెళ్తున్నాయి. సర్పంచ్ల స్థానంలో జిల్లా యంత్రాంగం నియమించిన ప్రత్యేకాధికారులే గ్రామాల్లో పాలనా వ్యవహారాలు నిర్వహించనున్నారు. వీరికి పంచాయతీ కార్యదర్శులు సహకరిస్తారు.
ఎన్నికల నిర్వహణతో సంబంధం లేని అధికారులకు బాధ్యతలు వచ్చే ఏప్రిల్ నెలలో లోక్సభకు ఎన్నికలు నిర్వహించనున్నారు. ఎన్నికల నిర్వహణలో వివిధ శాఖల అధికారులు పాల్గొనాల్సి ఉంటుంది. అందువల్ల ఎన్నికల నిర్వహణలో భాగస్వామ్యం లేని ప్రభుత్వ శాఖల అధికారులను గ్రామ పంచాయతీలకు ప్రత్యేకాధికారులుగా నియమించారు. జిల్లా అధికార యంత్రాంగం మొదట అందుబాటులో ఉన్న అధికారులతో ప్రత్యేకాధికారుల జాబితాను సిద్ధం చేయగా.. రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకాధికారుల నియామకం విషయంలో గురువారం ఉదయం జీవో నెంబర్ 5ను జారీ చేసింది.
దానికనుగుణంగా మార్పులు చేసి జిల్లాలోని 165 మంది గెజిటెడ్ అధికారులను 566 గ్రామ పంచాయతీలకు ప్రత్యేకాధికారులుగా నియమిస్తూ సాయంత్రం ఉత్తర్వులు జారీ చేశారు. ప్రత్యేకాధికారులుగా నియమితులైన వారిలో ఇరిగేషన్, ఆర్ అండ్ బీ ఈఈలు, ఎంపీడీవోలు, ఎంపీవోలు, తాసిల్దార్లు, మిషన్ భగీరథ ఏఈలు, ఆర్ అండ్ బీ ఏఈలు, సహాయ వ్యవసాయ సంచాలకులు, మండల వ్యవసాయాధికారులు ఉన్నారు.
165 మంది ప్రత్యేకాధికారుల
వికారాబాద్ జిల్లాలో 566 గ్రామ పంచాయతీలు ఉన్నాయి. ప్రభుత్వం జారీ చేసిన మార్గదర్శకాలకు అనుగుణంగా వీటికి 165 మందిని గ్రామ పంచాయతీలకు ప్రత్యేకాధికారులను నియమించారు. ప్రత్యేకాధికారుల జాబితాను ఆయా మండలాల ఎంపీడీవోలకు పంపించారు. ఆయా గ్రామ పంచాయతీలకు నియమితులైన ప్రత్యేకాధికారులు శుక్రవారం నుంచి పదవీ బాధ్యతలు స్వీకరించనున్నారు.