కులకచర్ల, ఫిబ్రవరి 25: విధుల్లో నిర్లక్ష్యం చేస్తే కఠిన చర్యలు తప్పవని వికారాబాద్ కలెక్టర్ నారాయణరెడ్డి అధికారులను హెచ్చరించారు. శనివారం ఆయన మండలంలోని పీరంపల్లి గ్రామంలో ట్రైనీ ఐఏఎస్ సంచిత్ గంగ్వార్తో కలిసి పర్యటించారు. పల్లెప్రగతి క్రింద చేపట్టిన పల్లెప్రకృతివనం, వైకుంఠధామం, హరితహారం నర్సరీ, డంపింగ్ యార్డులను పరిశీలించారు. అందేవిధంగా ప్రాథమిక పాఠశాలలోని వంట గదిలోకి వెళ్లి మధ్యాహ్న భోజనం నాణ్యతను స్వయంగా పరిశీలించారు. భోజనం సరిగ్గా లేదని ఉపాధ్యాయురాలిపై ఆగ్రహించి ఆమె కు మెమో జారీ చేశారు. భోజనం విషయంలో నిర్లక్ష్యం చేస్తే చర్యలు తప్పవని ఎంఈవోను హెచ్చరించారు.
అంగన్వాడీ టీచర్ పిల్లలు, బాలింతలకు భోజనం, గుడ్లు, బాలామృతం సరిగ్గా ఇవ్వడంలేదని గ్రామస్తుల ఫిర్యాదు మేరకు ఆయన ఆ కేంద్రంలోకి వెళ్లి రికార్డులను పరిశీలించి.. విధుల నిర్వహణలో అంగన్వాడీ టీచర్ వెంకటమ్మ నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నదని గుర్తించి ఆమెను సస్పెండ్ చేశారు. అనంతరం ఆయన పల్లెప్రగతి పనులను పరిశీలించారు. అన్ని గ్రామాలను ఎప్పటికప్పుడు శుభ్రంగా ఉంచుకోవాలని.. తడి, పొడి చెత్తను వేరు చేసి డంపింగ్ యార్డులకు తరలించి అక్కడ సేంద్రియ ఎరువును తయారు చేయాలని ఎంపీడీవోకు సూచించారు.
నర్సరీల్లోని మొక్కలు ఏపుగా పెరిగేలా చూడాలని.. రానున్న హరితహారానికి సిద్ధం చేయాలన్నారు. పీరంపల్లిలో చేపట్టిన పల్లెప్రగతి పనులను పది రోజుల్లో పూర్తి చేసి వాడుకలోకి తీసుకురాకపోతే మండలంలోని అధికారులపై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. మహిళా గర్భం దాల్చినప్పటి నుంచి శిశువుకు జన్మనిచ్చేంత వరకు ఆశ వర్కర్లు, ఏఎన్ఎంలు వారికి వైద్య సేవలందించడంతోపాటు బాగోగులు తెలుసుకోవాలని.. డెలివరీ అయిన ఆరు నెలల వరకు వారికి గుడ్లు, బాలామృతం అందించాలని సూచించారు.
విద్యార్థులతో బాధ్యతాయుతంగా ఉండాలి
ఉపాధ్యాయులు విద్యార్థులకు అర్థమయ్యేలా బోధించాలని.. వారి పట్ల బాధ్యతాయుతంగా ఉం డాలని సూచించారు. విద్యార్థులకు అన్ని విషయా ల్లో అవగాహన ఉండేలా తీర్చిదిద్దాలన్నారు. కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ రాధికాసోమలింగం, ఎంపీడీవో నాగవేణి, డీఈ ఉమేశ్కుమార్, ఎం పీవో కరీం, ఏపీవో వెంకటేశ్, ఏపీఎం శోభ, గ్రామస్తులు, అధికారులు పాల్గొన్నారు.
బాలింతలకు ఫోన్ చేసి మాట్లాడి..
ఇటీవల డెలివరీ అయిన తల్లులకు కలెక్టర్ నారాయణరెడ్డి స్వయంగా ఫోన్ చేసి వారి బాగోగులను అడిగి తెలుసుకున్నారు. అంగన్వాడీ కేం ద్రాల నుంచి గుడ్లు, బాలామృతం అందుతున్నా యా..? లేదా అని ఆరా తీశారు. ఆరోగ్యంపై జాగ్రత్తలు తీసుకుంటూ క్షేమంగా ఉండాలని వారికి సూచించారు.