US attacks : ఇరాన్, అమెరికా యుద్ధం తీవ్రంగా కొనసాగుతోంది. ఇరాన్పై అమెరికా దాడి చేస్తుంటే.. గల్ఫ్ దేశాల్లోని అమెరికా సైనిక స్థావరాలపై ఇరాన్ దాడులకు దిగుతోంది. తాజాగా బహ్రెయిన్, కువైట్ దేశాలపై దాడులకు పాల్పడ్డట్లు ఇరాన్ ఇస్లామిక్ రెవల్యూషనరీ గార్డ్ కార్ప్స్ (ఐఆర్జీసీ) ప్రకటించింది. రెండు దేశాల్లోని ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్లను ధ్వంసం చేసినట్లు, అలాగే అక్కడి రాడార్ వ్యవస్థపై దాడికి పాల్పడ్డట్లు వెల్లడించింది. అమెరికా వరుసగా పదోరోజు (సోమవారం) రాత్రి ఇరాన్పై దాడులకు దిగింది.
ఇరాన్లోని అనేక ప్రాంతాలపై ఒకేసారి అమెరికా దాడి చేసింది. దీనికి బదులుగా తాము అమెరికా మిత్రదేశాల్లోని స్థావరాలపై దాడి చేశామని పేర్కొంది. మరిన్ని డ్రోన్, క్షిపణి దాడులకు సిద్ధంగా ఉండాలని సూచించింది. మరోవైపు జోర్డాన్పై కూడా ఇరాన్ దాడికి దిగింది. అనేక పౌర నిర్మాణాలపై విరుచుకుపడింది. అయితే, ఇరాన్ ప్రయోగించిన ఐదు డ్రోన్లను, మూడు క్షిపణుల్ని నేల కూల్చామని జోర్డాన్ సైన్యం ప్రకటించింది. కువైట్లోని విద్యుత్ సరఫరా వ్యవస్థలు, నీటి రవాణా వ్యవస్థలపై ఇరాన్ దాడి చేసింది. దీంతో అక్కడ భారీ అగ్నిప్రమాదం సంభవించి, నష్టం జరిగింది. ముఖ్యంగా కువైట్కు చెందిన 90 శాతం నీటి సరఫరా వ్యవస్థ దెబ్బతిన్నట్లు సమాచారం. మరోవైపు ఇరాన్ సైనిక సామర్ధ్యాన్ని దెబ్బతీసేలా అమెరికా దాడి చేస్తోంది.
హార్ముజ్ జలసంధిలోని వాణిజ్య నౌకలపై కూడా అమెరికా దాడికి పాల్పడింది. ఒకపక్క ఇరు దేశాల మధ్య యుద్దం జరుగుతున్నప్పటికీ మరోవైపు శాంతి ప్రయత్నాలు జరుగుతున్నాయి. అమెరికాతో శాంతి చర్చల కోసం ఇరాన్ మంత్రి ఎస్కందర్ మొమేనీ మంగళవారం పాకిస్తాన్ చేరుకున్నారు. అక్కడ పాక్ ఆర్మీ చీఫ్ అసిమ్ మునీర్ను కలిశారు. అనంతరం పాక్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ను కూడా కలిశారు. అయితే, ఈ అంశంపై ఇంతకుమించి వెల్లడించేందుకు సంబంధిత వర్గాలు నిరాకరించాయి. కానీ, ప్రస్తుత పరిస్థితిపై, శాంతి స్థాపన అంశంపై చర్చించినట్లు సమాచారం.