పరిగి, జూన్ 7 : వికారాబాద్ జిల్లా కులకచర్లకు చెందిన శ్రీరామలింగేశ్వర ఎఫ్పీవో ఆధ్వర్యంలో ఉద్యానవన శాఖ, సెర్ప్ సహకారంతో ఢిల్లీలో మామిడిపండ్ల విక్రయాలు ప్రారంభమయ్యాయి. ‘అనంతగిరి మ్యాంగోస్’ బ్రాండ్ పేరిట ఢిల్లీకి మామిడిపండ్ల ఎగుమతిని ఇటీవల రాష్ట్ర విద్యా శాఖ మంత్రి ప్రారంభించారు. ఢిల్లీలో ‘అనంతగిరి మ్యాంగోస్’ విక్రయానికి ధుని స్టార్టప్ సంస్థతో ఒప్పందం కుదిరింది. ఈమేరకు శ్రీరామలింగేశ్వర ఎఫ్పీవో ఆధ్వర్యంలో ప్రత్యేక వాహనంలో కులకచర్ల మండలంలోని పలువురు మామిడి రైతుల నుంచి కిలో రూ.50 చొప్పున చెల్లించి ఢిల్లీకి 2 టన్నుల పైచిలుకు మామిడిపండ్లను ఎగుమతి చేశారు.
ఒక్కో బాక్సులో 5కిలోల మామిడికాయలు ప్యాక్ చేసి తరలించారు. రవాణా భారం అధికంగా ఉండడంతో ఢిల్లీలోని తెలంగాణ భవన్లో 5 కిలోల మామిడిపండ్ల బాక్స్ రూ.700 చొప్పున విక్రయిస్తున్నట్లు జిల్లా ఉద్యానవన శాఖ అధికారి చక్రపాణి తెలిపారు. సీజన్ చివరి దశకు చేరుకోవడంతో ఈసారి 20 మెట్రిక్ టన్నుల ఎగుమతికి నిర్ణయించారు. వచ్చేసారి ఈ ఎగుమతులను సీజన్ ప్రారంభం నుంచే ప్రణాళికాబద్ధంగా చేపట్టడానికి అధికారులు చర్యలు తీసుకోనున్నట్లు తెలిసింది. సేంద్రియ పద్ధతుల్లో మామిడితోటల పెంపకం చేపడుతున్న వారి నుంచే మామిడిపండ్లు సేకరించి పంపించినట్లు అధికారులు తెలిపారు.