రంగారెడ్డి, నమస్తే తెలంగాణ, ఫిబ్రవరి 28: ఎట్టకేలకు సీతారాంపూర్ దేవాదాయ భూములపై నెలకొన్న వివాదానికి తెరపడింది. షాబాద్ మండలం సీతారాంపూర్లోని దేవాదాయ భూముల్లో ఇండస్ట్రియల్ పార్కును ఏర్పాటు చేసేందుకు ప్రభుత్వం నిర్ణయించింది. ఎన్నో ఏండ్లుగా సంబంధిత భూముల్లో సాగు చేసుకుంటున్న రైతులతోపాటు దేవాదాయ శాఖకు పరిహారం అందజేసేందుకు నిర్ణయించగా.. దేవాదాయ శాఖ పరిహారం తీసుకోకుండా వివాదానికి తెరలేపింది. తమను అడుగకుండానే ఇండస్ట్రియల్ పార్కుకు భూములను కేటాయించడంపై దేవాదాయ శాఖ కోర్టుకు వెళ్లింది. అప్పటికే సంబంధిత భూముల్లో సాగు చేస్తున్న రైతులకు ప్రభుత్వం పరిహారాన్ని అందజేసింది. తదనంతరం కోర్టుకెళ్లిన దేవాదాయ శాఖ అధికారులు వెనక్కి తగ్గి పరిహారం తీసుకునేందుకు టీఎస్ఐఐసీని సంప్రదించింది. ఇప్పటికే రైతులకు పూర్తి పరిహారం అందజేయగా, దేవాదాయ శాఖ బ్యాంకు ఖాతాలో 850 ఎకరాలకు సంబంధించి పరిహారాన్ని ప్రభుత్వం జమ చేసింది. సీతారాంపూర్లోని 1200 ఎకరాల దేవాదాయ భూముల్లో 850 ఎకరాలకు రూ.85 కోట్ల పరిహారాన్ని టీఎస్ఐఐసీ దేవాదాయ శాఖకు అందజేసింది. మిగతా 350 ఎకరాలకు సంబంధించిన పరిహారాన్ని త్వరలోనే దేవాదాయ శాఖ బ్యాంకు ఖాతాలో జమ చేయనుంది. మొత్తం 1200 ఎకరాలకు సంబంధించి 776 మంది రైతుల బ్యాంకు ఖాతాల్లో ఇప్పటికే రూ.120 కోట్ల పరిహారాన్ని ఎకరానికి రూ.10లక్షల చొప్పున పరిహారాన్ని అందజేసింది. మొత్తానికి మూడు, నాలుగు నెలలుగా నెలకొన్న వివాదానికి ఫుల్స్టాప్ పడడంతో ఇండస్ట్రియల్ పార్కులో పనులు వేగమందుకున్నాయి.
రాష్ట్ర ప్రభుత్వం పారిశ్రామికాభివృద్ధికి అత్యంత ప్రాధాన్యతనిస్తున్నది. హైదరాబాద్కు కూతవేటు దూరంలోనే ఇండస్ట్రియల్ పార్కులుండడంతోపాటు పరిశ్రమల నిర్వహణకు కావాల్సిన సకల వసతులు కల్పిస్తుండడంతో జిల్లాలో పరిశ్రమల ఏర్పాటుకు ఆసక్తి చూపుతున్నారు. ముఖ్యంగా రంగారెడ్డి జిల్లాలో పరిశ్రమల ఏర్పాటుకు అనువుగా ఉండటంతో ఎంతోమంది పారిశ్రామికవేత్తలు ముందుకొస్తున్నారు. ఎన్నో ఇండస్ట్రియల్ పార్కులు, హార్డ్వేర్ పార్కులు, ఐటీ టవర్స్, మెగా ఉత్పత్తి పరిశ్రమలు జిల్లాలో నెలకొల్పారు. అంతేకాకుండా దేశంలోని అమెజాన్, వెల్స్పన్, క్రోనస్, టాటా, విజయ్నేహా, పోకర్ణ ఇంజనీర్ స్టోన్ పరిశ్రమ, నాట్కో ఫార్మా, రెనెసిస్, కాస్పర్, విప్రో, ఎంఎస్ఎన్లాంటి ప్రముఖ పరిశ్రమల ప్లాంట్లు జిల్లాకు తరలివచ్చాయి. తాజాగా ఎలక్ట్రిక్ వాహనాల పార్కును దేశంలోనే మొదటి ప్లాంట్ను జిల్లాలో ఏర్పాటు చేసేందుకు ముందుకురాగా, ప్రభుత్వం ఇప్పటికే గ్రీన్సిగ్నల్ ఇచ్చింది. వివాదం సమసిపోవడంతో సీతారాంపూర్లో ఇండస్ట్రియల్ పార్కు అభివృద్ధి పనులు వేగవంతమయ్యాయి. ఇప్పటికే ఎలక్ట్రిక్ వాహనాల పార్కుకు భూములను కూడా ప్రభుత్వం కేటాయించింది. త్వరలోనే సంబంధిత సంస్థ తమ తయారీని ప్రారంభించనుంది.
చందన్వెల్లి ఇండస్ట్రియల్ పార్కులో భాగంగా ప్రస్తుతం సేకరిస్తున్న భూముల్లో 200 ఎకరాలను ఎలక్ట్రిక్ వాహనాల పార్కుకు కేటాయించారు.
ప్రస్తుతం 600 ఎకరాల్లో నెలకొని ఉన్న చందన్వెల్లి ఇండస్ట్రియల్ పార్కులో అమెజాన్, వెల్స్పన్, కుందన్, కటేరా వంటి ప్రముఖ పరిశ్రమలున్నాయి. ఇప్పటికే 600 ఎకరాల్లో ఉన్న చందన్వెల్లి ఇండస్ట్రియల్ పార్కు విస్తీర్ణం సీతారాంపూర్ భూములతో 1800 ఎకరాలకు చేరింది. అదేవిధంగా టీఆర్ఎస్ ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకువచ్చిన టీఎస్-ఐపాస్ ద్వారా పారిశ్రామికరంగంలో చాలా మార్పు వచ్చింది. గతంలో ఓ భారీ పరిశ్రమను ఏర్పాటు చేయాలంటే ఆరు నెలల వరకు సమయం పట్టేది. అంతేకాకుండా అనుమతి వస్తుందా, రాదనేది కూడా గ్యారంటీ ఉండేది కాదు. కానీ టీఎస్-ఐపాస్ విధానంతో ఎంత భారీ పరిశ్రమ ఏర్పాటుకైనా కేవలం పదిహేను రోజుల్లోగా అనుమతులు లభిస్తుండడంతో అధిక మొత్తంలో పారిశ్రామికవేత్తలు ముందుకొస్తున్నారు. పరిశ్రమలకు నాణ్యమైన 24 గంటల నిరంతర విద్యుత్తు సరఫరా చేస్తుండడంతో కూడా పరిశ్రమలను నెలకొల్పేందుకు పారిశ్రామికవేత్తలు ఉత్సాహం చూపుతున్నారు.
– రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితారెడ్డి
టీఆర్ఎస్ ప్రభుత్వం పారిశ్రామికాభివృద్ధికి అధిక ప్రాధాన్యతనిస్తున్నది. టీఎస్-ఐపాస్తో పారిశ్రామిక రంగంలో చాలా మార్పులు వచ్చాయి. ఫార్మా, ఏరోస్పేస్, సైబర్ సంస్థలెన్నో జిల్లాలో నెలకొల్పారు. సీతారాంపూర్లో ఇండస్ట్రియల్ పార్కు అభివృద్ధి పనులు వేగంగా జరుగుతున్నాయి. ఇప్పటికే ఎలక్ట్రిక్ వాహనాల పార్కు ఏర్పాటుకు ప్రభుత్వం గ్రీన్సిగ్నల్ ఇవ్వడంతోపాటు సంబంధిత సంస్థకు టీఎస్ఐఐసీ భూములను కేటాయించింది. సీతారాంపూర్లో సేకరించిన 1200 ఎకరాల దేవాదాయ భూములకు సంబంధించి రైతులకు ఎకరాకు రూ.10లక్షల చొప్పున ఇప్పటికే అందగా, దేవాదాయ శాఖకు రూ.85 కోట్లను ప్రభుత్వం అందజేసింది. మిగతా పరిహారాన్ని త్వరలోనే అందజేయనున్నారు.