బొంరాస్ పేట : కంది పంటను డిబ్లింగ్, జంట సాలు పద్ధతిలో సాగు చేయడం వల్ల అధిక దిగుబడులు సాధించవచ్చని జిల్లా వ్యవసాయాధికారి గోపాల్ అన్నారు. జాతీయ ఆహార భద్రత మిషన్ (ఎన్ఎఫ్ఎస్ఎం) పథకంలో మండలంలోని ఎన్నెమీది తండాకు చెందిన రైతు గోపాల్నాయక్కు ఆత్మ, వ్యవసాయ అధికారులు వానాకాలంలో ఎల్ఆర్జి 152, పీఆర్జి 176 రకం కంది విత్తనాలను పంపిణీ చేశారు. ఈ విత్తనాలను రైతు డిబ్లింగ్, జంట సాలు పద్ధతిలో సాగు చేసి అధిక దిగుబడులు సాధించాడు. ఈ నేపథ్యంలో బుధవారం గోపాల్ పొలంలో క్షేత్ర ప్రదర్శన నిర్వహించి రైతులతో ఆయన మాట్లాడారు. డిబ్లింగ్ పద్ధతిలో మొక్కకు మొక్కకు మధ్య దూరం 20సెంటీ మీటర్లు, జంటసాళ్ల పద్ధతిలో 45సెంటీ మీటర్ల దూరం ఉండే విధంగా కంది విత్తనాలు నాటుకోవడం, ఎప్పటికప్పుడు వ్యవసాయాధికారులు ఇచ్చిన సూచనలు, సలహాలు పాటించడం వల్ల ఒకటిన్నర ఎకరాలో 16క్వింటాళ్ల దిగుబడి వచ్చిందని గోపాల్ అన్నారు.
విత్తనాలను విత్తే ముందు విత్తనశుద్ధి చేసుకోవడం వల్ల పంటకు ఎండు తెగులు సోకలేదన్నారు. కంది పంటలో గోపాల్ సాధించిన అధిక దిగుబడిని చూసిన రైతులు తాము కూడా ఇదే విధమైన పద్ధతిలో కంది పంటను సాగు చేస్తామని మాకు కూడా విత్తనాలు ఇవ్వాలని రైతులు అధికారులను కోరారు. సమావేశంలో సర్పంచ్ రుక్కీబాయి, శాస్త్రవేత్తలు సుధాకర్, రాజేశ్వర్రెడ్డి, మిన్నీ, కొడంగల్ ఏడీఏ వినయ్కుమార్, ఏవో రాజేశ్కుమార్, ఏఈవోలు ఇసాక్ హెరాల్డ్, రేణుక, మొహియొద్దీన్, శైలజ, భార్గవి, వసీం, రైతులు పాల్గొన్నారు.