నకిలీ విత్తనాలను విక్రయించే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని, అవసరమైతే పీడీ యాక్ట్ నమోదు చేయాలని విద్యాశాఖమంత్రి సబితారెడ్డి అన్నారు. బుధవారం మద్గుల్ చిట్టంపల్లిలోని డీఆర్సీ భవనంలో నిర్వహించిన జడ్పీ సర్వసభ్య సమావేశానికి ఆమె ముఖ్యఅతిథిగా పాల్గొని మాట్లాడారు. విస్తృతంగా తనిఖీలు నిర్వహించి నకిలీ విత్తనాల విక్రయానికి అడ్డుకట్ట వేయాలన్నారు. వ్యవసాయాధికారులు క్షేత్రస్థాయిలో పర్యటించి పంటల పరిస్థితిపై ఆరా తీసి రైతులకు భరోసా కల్పించాలన్నారు. ఆయిల్ పామ్ సాగుపై అవగాహన కల్పించాలన్నారు. ‘మన ఊరు-మన బడి’లో భాగంగా ప్రభుత్వ స్కూళ్లలో వసతుల కల్పన పనులను వేగవంతం చేయాలన్నారు. సీజనల్ వ్యాధుల వ్యాప్తిని ఆదిలోనే అరికట్టాలన్నారు. వర్షానికి ధ్వంసమైన రోడ్లకు మరమ్మతులు చేయాలన్నారు.
-వికారాబాద్, జూలై 19 (నమస్తే తెలంగాణ)
వికారాబాద్, జూలై 19, (నమస్తే తెలంగాణ): నకిలీ విత్తనాలను విక్రయిస్తూ వరుసగా పట్టుబడితే సంబంధిత వ్యక్తులపై పీడీ యాక్ట్ అమలు చేయాలని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి పి.సబితాఇంద్రారెడ్డి అన్నారు. బుధవారం మద్గుల్ చిట్టంపల్లిలోని డీఆర్సీ భవనంలో నిర్వహించిన జడ్పీ సర్వసభ్య సమావేశానికి మంత్రి సబితాఇంద్రారెడ్డి ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. సమావేశంలో వ్యవసాయ శాఖతోపాటు వైద్యారోగ్య శాఖ, విద్యాశాఖ, గ్రామీణాభివృద్ధి, పంచాయతీ, పంచాయతీరాజ్, ఆర్అండ్బీ, మిషన్ భగీరథ, సంక్షేమ శాఖలకు సంబంధించిన సమస్యలపై చర్చించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ జిల్లా అంతటా విస్తృతంగా తనిఖీలు నిర్వహించి నకిలీ విత్తనాలను విక్రయించే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలన్నారు. అదేవిధంగా వర్షాలు కురుస్తున్నందున వ్యవసాయాధికారులు క్షేత్రస్థాయిలో పర్యటించి పంటల పరిస్థితిని ఎప్పటికప్పుడు తెలుసుకోవాలని సూచించారు. జిల్లాలో ఆయిల్ ఫామ్ సాగుపై రైతులకు అవగాహన కల్పించాలని, అన్ని రైతు వేదికల్లో ఆయిల్ పామ్ సాగుపై వివరాలను ప్రదర్శించాలన్నారు. మన ఊరు-మన బడి కార్యక్రమంలో భాగంగా ప్రభుత్వ స్కూళ్లలో మౌళిక వసతులను కల్పించే పనులను వేగవంతం చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు.
ఇప్పటివరకు 20 స్కూళ్లను ప్రారంభించారని, మరో 16 పాఠశాలల్లో పనులు పూర్తికాగా, వాటిని ప్రారంభించాల్సి ఉందని తెలిపారు. మరో 20 బడుల్లో ఈనెలాఖరులోగా పనులు పూర్తి చేసేందుకు చర్యలు చేపట్టారన్నారు. మన ఊరు-మన బడి కింద జిల్లాకు రూ.11.65 కోట్ల నిధులను ప్రభుత్వం విడుదల చేసినట్లు పేర్కొన్నారు. ఆరు నుంచి పదో తరగతి విద్యార్థులకు ఉచితంగా నోట్ బుక్స్ను ఈ విద్యా సంవత్సరం నుంచి అందజేస్తున్నామని మంత్రి వెల్లడించారు. మరోవైపు జిల్లాలోని 47 పాఠశాలల్లోని 5వేల మంది విద్యార్థులకు రాగి జావా అందిస్తున్నారన్నారు. పదో తరగతిలో మెరుగైన ఫలితాలు సాధించేలా మోటివేషనల్ స్పీచ్, పర్సనాలిటీ డెవలప్మెంట్పై తరగతులు నిర్వహించాలని సూచించారు. అదేవిధంగా జిల్లాలోని మూడు పీహెచ్సీల్లో ఆరోగ్య మహిళా పథకం అమలు చేస్తున్నామని, ఇప్పటివరకు 803 మంది మహిళలకు ఉచిత వైద్య పరీక్షలు నిర్వహించడం తెలిపారు. దెబ్బతిన్న వికారాబాద్-సదాశివపేట్ రోడ్డుతోపాటు పలు రోడ్లకు ఇప్పటికీ మరమ్మతులు చేపట్టకపోవడంపై ఆర్అండ్బీ అధికారులపై మంత్రి ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంట్రాక్టర్ నిర్లక్ష్యం వహిస్తే మరో కాంట్రాక్టర్తో పనులు పూర్తి చేయాలన్నారు.
మిషన్ భగీరథ నీటినే తాగండి
మిషన్ భగీరథ నీరు వందశాతం ప్యూరిఫైడ్ చేస్తారని, అంతేకాకుండా అధిక మొత్తం మినరల్స్ ఉంటాయని, తప్పకుండా మిషన్ భగీరథ నీటిని ప్రతి ఒక్కరూ తాగాలని కలెక్టర్ సి.నారాయణరెడ్డి జిల్లా ప్రజలకు సూచించారు. మినరల్స్ లేని వాటర్ ప్లాంట్లు, ఇతర బాటిల్స్ నీటిని తాగుతూ అనేక రోగాలను కొనితెచ్చుకుంటున్నారన్నారు. జిల్లాకు మంజూరైన గ్రామ పంచాయతీ భవన నిర్మాణాలను వెంటనే గ్రౌండింగ్ చేసి, త్వరగా పూర్తి చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. సమావేశంలో పరిగి ఎమ్మెల్యే మహేశ్రెడ్డి, జిల్లా అదనపు కలెక్టర్ రాహుల్శర్మ, ట్రైనీ కలెక్టర్, జడ్పీ వైస్ చైర్మన్ బి.విజయ్కుమార్, ఇన్చార్జి జడ్పీ సీఈవో సుభాషిణి ఆయా శాఖల జిల్లా అధికారులు, జడ్పీటీసీలు, ఎంపీపీలు పాల్గొన్నారు.