Rythu Bandhu | మోమిన్పేట, జూలై 1 : తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన మిషన్ కాకతీయ పథకం ద్వారా చెరువుల పునరుద్ధరణతో పాటు పూడికతీతతో చెరువులన్నీ వేసవి కాలంలో కూడా నిండుకుండలా జలకళను సంతరించుకుంటున్నాయి. ఉమ్మడి పాలనలో వ్యవసాయ సాగు విస్తీర్ణం అంతంతమాత్రంగా ఉండేది. చెరువుల్లో పూడిక చేరి అక్కరకు రాకపోయేవి. వానలు ఎక్కువగా పడితే చెరువులకు గండ్లు పడి ఊర్లకు ఊర్లు మునిగిపోయి పంటలు చేతికిరాక రైతులు నానా కష్టాలు పడేవారు. భూగర్భజలాలు అడుగంటి బావులు, బోర్లల్లో నీరులేక రైతులు కన్నీరు మున్నీరయ్యేవారు.
తెలంగాణ రాష్ట్రం వచ్చిన అనంతరం కేసీఆర్ చెరువుల పునరుద్ధరణకు శ్రీకారం చుట్టారు. కాకతీయుల స్ఫూర్తితో రాష్ట్రమంతటా మిషన్ కాకతీయ పథకాన్ని అమలు చేశారు. ఈ పథకంలో భాగంగా మోమిన్పేట మండల పరిధిలోని దేవరంపల్లి, ఎన్కతల, టేకులపల్లి, దుర్గంచెర్వు, మోమిన్పేట, కేసారం తదితర గ్రామాల్లో చెరువుల పూడికతీత, వర్షపు నీరు చెరువుల్లోకి మళ్లించేందుకు కాలువలు, చెరువు కట్టల బలోపేతం చేశారు. మోమిన్పేట నందివాగు కుడి, ఎడమ వాగుల నుంచి రైతులకు నీరు అందించేందుకు రూ.3.53 కోట్లతో పనులను చేపట్టారు. నేడు చెరువుల్లో ఎండకాలం కూడా నీరు పుష్కలంగా ఉంటున్నాయి. భూగర్భజలాలు పెరిగి బోర్లు, బావుల్లోని నీటికి పంటలు పండిస్తున్నారు. రెండు పంటలు సాగు చేసుకుంటూ ఆర్థికంగా అభివృద్ధి చెందుతున్నామని రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
అన్నదాతల కష్టాలు తీర్చిన సీఎం కేసీఆర్ : గొల్ల రామయ్య. టేకులపల్లి
రైతును రాజు చేయాలనే సంకల్పంతో వ్యవసాయం దండుగ కాదు.. పండుగ అనే విధంగా సీఎం కేసీఆర్ రాష్ట్రంలో రైతుల కోసం మిషన్ కాకతీయ, రైతు బంధు, రైతు బీమా, ఉచిత కరెంట్ పథకాలను అమలు చేస్తున్నారు. మిషన్ కాకతీయతో టేకులపల్లి చెరువులో పుష్కలంగా నీరుంటున్నది. ఏడాదికి రెండు పంటలు సాగు చేస్తున్నా. ఆర్థికంగా అభివృద్ధి చెందుతూ నా కుటుంబంతో సంతోషంగా ఉన్నా.