వికారాబాద్ జిల్లాలో ఈ విద్యా సంవత్సరం నుంచే మెడికల్ కాలేజీ అందుబాటులోకి రానున్నది. కళాశాల శాశ్వత భవనాల నిర్మాణానికి రెండేండ్లు పట్టే అవకాశం ఉన్నందున అంతవరకు అనంతగిరిలోని టీబీ శానిటోరియంలో తరగతుల నిర్వహణకు అధికారులు సర్వం సిద్ధం చేస్తున్నారు. ప్రభుత్వం అందించిన నిధులతో అవసరమైన అన్ని మౌలిక వసతులు కల్పిస్తున్నారు. లెక్చర్ హాళ్లు, విద్యార్థుల వసతి గృహాలు, అనాటమీ, ఫిజియోలజీ, బయోకెమిస్ట్రీ ల్యాబ్లు, సెంట్రల్ లైబ్రరీ, తదితర గదుల ఏర్పాటు పనులు దాదాపుగా పూర్తయ్యాయి. 2023-24 విద్యా సంవత్సరానికి సంబంధించి 100 ఎంబీబీఎస్ సీట్లతో మెడికల్ కళాశాల షురూ కానుండగా.. ప్రభుత్వం ఇప్పటికే 39 మంది అసిస్టెంట్ ప్రొఫెసర్లను నియమించింది. మరోవైపు వికారాబాద్ ప్రభుత్వాసుపత్రిని మెడికల్ కాలేజీకి అనుబంధ బోధనాసుపత్రిగా 380 పడకలతో అప్గ్రేడ్ చేసే పనులు శరవేగంగా జరుగుతున్నాయి. ప్రభుత్వం కేటాయించిన రూ.235 కోట్లతో మెడికల్ కాలేజీ నిర్మాణం, ఆసుపత్రి అప్గ్రేడ్, పరికరాలు, ఫర్నిచర్ కొనుగోలు పనులు చేపట్టనున్నారు.
-వికారాబాద్, మే 25 (నమస్తే తెలంగాణ)
వికారాబాద్, మే 25 (నమస్తే తెలంగాణ) : ఒకట్రెండు నెలల్లో 2023-24 విద్యా సంవత్సరానికి సంబంధించి ప్రభుత్వ మెడికల్ కాలేజీ తరగతులు ప్రారంభంకానున్నాయి. కాలేజీ శాశ్వత భవన నిర్మాణం రెండేండ్లలో అందుబాటులోకి వచ్చే అవకాశాలున్న దృష్ట్యా అనంతగిరిలోని టీబీ శానిటోరియంలో తాత్కాలికంగా తరగతులను నిర్వహించేందుకు నిర్ణయించిన విషయం తెలిసిందే. మౌలిక సదుపాయాలకు అవసరమైన నిధులను ప్రభుత్వం విడుదల చేయడంతో పనులు దాదాపు పూర్తయ్యాయి.
తరగతుల నిర్వహణకు రెండు లెక్చర్ హాళ్లు
తరగతుల నిర్వహణకు రెండు లెక్చర్ హాళ్లను సిద్ధం చేస్తున్నారు. ఇప్పటికే ఒక లెక్చర్ హాల్ను సిద్ధం చేయగా, మరో లెక్చర్ హాల్ పనులను వేగవంతం చేశారు. మొదటి సంవత్సరంలో నిర్వహించే అనాటమీ, ఫిజియోలజీ, బయోకెమిస్ట్రీ సబ్జెక్టులకు సంబంధించి ల్యాబ్ గదులను కూడా సిద్ధం చేశారు. అనాటమీ, ఫిజియోలజీ, బయో కెమిస్ట్రీలకు సంబంధించి ల్యాబ్ పరికరాలకు ఇప్పటికే ఆర్డర్ ఇచ్చినట్లు జిల్లా ప్రభుత్వ మెడికల్ కాలేజీ ప్రిన్సిపాల్ తెలిపారు. సెంట్రల్ లైబ్రరీ, విద్యార్థులు, విద్యార్థినులకు ప్రత్యేకంగా వసతి గృహాలు తదితరాల ఏర్పాట్లు పూర్తి చేశారు. టీబీ శానిటోరియంలో గతంలో నర్సుల క్వార్టర్స్గా ఉన్న భవనాన్ని మెడికల్ కాలేజీ విద్యార్థినుల వసతి గృహంగా, గతంలో ఉన్న చిల్డ్రన్స్ క్వార్టర్స్గా ఉన్న భవనాన్ని విద్యార్థుల హాస్టల్గా ఏర్పాటు చేశారు.
వంద సీట్లతో మొదటి సంవత్సరం ప్రారంభం
2023-24 విద్యా సంవత్సరంలో జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ మెడికల్ కాలేజీలో 100 మంది విద్యార్థులకు ఎంబీబీఎస్ మొదటి సంవత్సరంలో ప్రవేశాలు కల్పించనున్నారు. జిల్లాలోని ప్రభుత్వ మెడికల్ కాలేజీలో ప్రతి ఏటా 100 సీట్లను పెంచనున్నారు. ఒకట్రెండు నెలల్లో విద్యార్థులను జిల్లాకు కేటాయించనున్నారు. మెడికల్ కాలేజీకి అవసరమైన మౌలిక సదుపాయాలు, బోధనా సిబ్బందిని ప్రభుత్వం ఇప్పటికే నియమించింది. జిల్లాలోని ప్రభుత్వ మెడికల్ కాలేజీలో బోధనా సిబ్బందికి సంబంధించి వివిధ విభాగాలకు 39 మంది అసిస్టెంట్ ప్రొఫెసర్లను ప్రభుత్వం నియమించింది. అనాటమీ-1, ఫిజియోలజీ-1, బయో కెమిస్ట్రీ-2, పాతాలజీ-2, మైక్రో బయోలజీ-1, ఫోరెన్సిక్ మెడిసిన్-1, కమ్యూనిటీ మెడిసిన్-1, జనరల్ మెడిసిన్-5, పెడియాట్రిక్స్-3, డీవీఎల్-1, సైకియాట్రిక్-1, జనరల్ సర్జరీ-5, ఆర్థోపెడిక్స్-2, ఈఎన్టీ-1, ఓబీజీ-6, అనస్తీషియా-4, రేడియో డయాగ్నోసిస్-2, హాస్పిటల్ అడ్మిన్-1 అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులను మంజూరు చేసింది.
రెండేండ్లలో శాశ్వత మెడికల్ కాలేజీ అందుబాటులోకి..
శాశ్వత మెడికల్ కాలేజీ భవనం రెండేండ్లలోగా అందుబాటులోకి తీసుకువచ్చేందుకు అధికారులు చర్యలు చేపట్టారు. ప్రభుత్వ మెడికల్ కాలేజీ ఏర్పాటుకు అనువైన స్థలాలకై పలు ప్రాంతాల్లో స్థలాలను పరిశీలించిన జిల్లా ఉన్నతాధికారులు, ప్రజాప్రతినిధులు రెండు స్థలాలకు సంబంధించిన వివరాలను ప్రభుత్వానికి అందజేశారు. ప్రభుత్వ మెడికల్ కాలేజీ ఏర్పాటుకు సంబంధించి అనంతగిరిలోని వైద్యారోగ్య శాఖకు సంబంధించిన స్థలంతోపాటు ఎస్ఏపీ కాలేజీ సమీపంలోని బిల్లా దాఖలా స్థలాల వివరాలను జిల్లా యంత్రాంగం ప్రభుత్వానికి అందజేశారు. ప్రభుత్వ మెడికల్ కాలేజీకి అనంతగిరిలోని వైద్యారోగ్య శాఖకు సంబంధించిన టీబీ శానిటోరియం స్థలాన్నే ప్రభుత్వం ఖరారు చేసింది. రెండేండ్లలోగా అనంతగిరిలోని టీబీ శానిటోరియం స్థలంలోనే ప్రభుత్వ మెడికల్ కాలేజీని నిర్మించి అందుబాటులోకి తీసుకురానున్నారు.
రూ.30 కోట్లతో రెండంతస్తుల నిర్మాణం
వికారాబాద్ ప్రభుత్వాసుపత్రిని మెడికల్ కాలేజీకి అనుబంధ బోధనాసుపత్రిగా అప్గ్రేడ్ చేసేందుకు ఇప్పటికే ప్రభుత్వం గ్రీన్సిగ్నల్ ఇవ్వగా, అనుబంధ ఆసుపత్రి నిర్మాణ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. ప్రభుత్వ మెడికల్ కాలేజీకి అనుబంధంగా 380 పడకలతో బోధనాసుపత్రిని అందుబాటులోకి తీసుకువచ్చేందుకు రూ.30 కోట్లతో ఏరియా ఆసుపత్రిపై మరో రెండంతస్తుల నిర్మాణాన్ని చేపట్టారు. బోధనాసుపత్రి నిర్మాణ పనులను నెలరోజుల్లో పూర్తి చేసేందుకు టీఎస్ఎంఐడీసీ అధికారులు చర్యలు చేపట్టారు. 100 సీట్లతో జిల్లాకు ప్రభుత్వ మెడికల్ కాలేజీని మంజూరు చేయడంతోపాటు మెడికల్ కాలేజీ నిర్మాణం, ఆసుపత్రి అప్గ్రేడింగ్, పరికరాలు, ఫర్నీచర్ కొనుగోలుకు రూ.235 కోట్లను ప్రభుత్వం కేటాయించింది.
జిల్లా ప్రజలకు సత్వర, నాణ్యమైన వైద్యసేవలు
జిల్లాకు ప్రభుత్వ మెడికల్ కాలేజీని మంజూరు చేసిన దృష్ట్యా ప్రస్తుతమున్న వికారాబాద్ ఏరియా ఆసుపత్రిని 380 పడకల బోధనాసుపత్రిగా అప్గ్రేడ్ చేసే ప్రక్రియ శరవేగంగా కొనసాగుతున్నది. వైద్య కళాశాల ఏర్పాటుతో అన్నిరకాల వైద్య సేవలు అందుబాటులోకి రానున్నాయి. ప్రస్తుతం 12 వైద్య సేవలు కొనసాగుతుండగా, బోధనాసుపత్రి అందుబాటులోకి వచ్చినట్లయితే 26 రకాల వైద్య సేవలు గ్రామీణ ప్రాంతంతో కూడుకొని ఉన్న జిల్లా ప్రజలకు అందనున్నాయి.
ఐసీయూ, ట్రామా కేంద్రాలు అందుబాటులోకి రానున్నాయి. మరోవైపు ఇప్పటికే రెగ్యులర్ పోస్టుల్లో భాగంగా ప్రొఫెసర్, అసోసియేట్ ప్రొఫెసర్, అసిస్టెంట్ ప్రొఫెసర్, ట్యూటర్, ల్యాబ్ టెక్నీషియన్, స్టోర్ కీపర్, చీఫ్ బయో కెమిస్ట్, మెడికో సోషల్ వర్కర్, గ్రేడ్-1, 2 సీనియర్, జూనియర్ రెసిడెంట్లు, ఈసీజీ టెక్నీషియన్, టీబీ అండ్ చెస్ట్ డిసీజ్ హెల్త్ విజిటర్, హెల్త్ ఎడ్యుకేటర్, చైల్డ్ సైకాలజిస్ట్, ఫిజియో థెరపిస్ట్, ఆడియోమెట్రీ టెక్నీషియన్, ఆప్టీషియన్, థియేటర్ అసిస్టెంట్, మేల్ నర్సింగ్, బ్లడ్ బ్యాంక్ అధికారి పోస్టులు మంజూరైన దృష్ట్యా సంబంధిత సేవలు అందుబాటులోకి రానున్నాయి. జిల్లాలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలన్నీ కమ్యూనిటీ హెల్త్ సెంటర్లుగా మారనున్నాయి. జిల్లాలోనే మెడికల్ కాలేజీతోపాటు బోధనాసుపత్రి అందుబాటులోకి వస్తే అన్ని రకాల వైద్య సేవలు, చికిత్సలు నిరంతరం అందుబాటులోకి రానున్నాయి.