ఒకప్పుడు మాణిక్యం హోటల్లో మాస్టర్గా పని చేసేవాడు. రోజుకు రూ.600 కూలీ వచ్చేది. హైదరాబాద్లో బతకాలంటే వచ్చే జీతం సరిపోక కుటుంబాన్ని ఊరిలోనే ఉంచాడు.. సీఎం కేసీఆర్ దళితుల అభ్యున్నతి కోసం తీసుకొచ్చిన దళితబంధు పథకం వరంగా మారింది. మొదటి విడుతలో లబ్ధిదారుడిగా అతడి పేరు ఎంపిక కావడంతో జీవితం పూర్తిగా మారిపోయింది. సర్కారు ఇచ్చిన రూ.10 లక్షల సాయంతో పరిగి పట్టణంలో మణికంఠ పేరుతో హోటల్ పెట్టాడు. ఉదయం పూట టిఫిన్స్.. సాయంత్రం ఫాస్ట్ ఫుడ్ తయారు చేయిస్తున్నాడు. తాను ఉపాధి పొందుతూ మరో 10 మందికి ఉపాధి కల్పిస్తున్నాడు మాణిక్యం.
మాస్టర్గా పని చేసిన తాను ప్రస్తుతం నెలకు రూ.40 నుంచి 50 వేల సంపాదిస్తున్నాడు. ‘దళితబంధు’తో దళితుల జీవితాల్లో వెలుగులు నిండుతున్నాయి. వికారాబాద్ జిల్లాలో తొలి విడుత కింద 358 యూనిట్లు మంజూరు కాగా, ఇప్పటికే గ్రౌండింగ్ ప్రక్రియ పూర్తైంది. ఇందుకుగాను ప్రభుత్వం రూ.35.80 కోట్ల నిధులను విడుదల చేయగా, రక్షణ నిధి కింద రూ.35.80 లక్షలను అధికారులు జమ చేశారు. కూలీలుగా, డ్రైవర్లుగా, ఆయా రంగాల్లో పనివాళ్లుగా కాలం వెళ్లదీసి నేడు ‘దళితబంధు’తో ఓనర్లుగా మారుతున్న లబ్ధిదారులు సీఎం కేసీఆర్, తెలంగాణ ప్రభుత్వానికి రుణపడి ఉంటామని కృతజ్ఞతలు తెలుపుతున్నారు.
– వికారాబాద్, మార్చి 9 (నమస్తే తెలంగాణ)
వికారాబాద్, ఫిబ్రవరి 9 (నమస్తే తెలంగాణ): పరిగి మండలం బర్కత్పల్లి గ్రామానికి చెందిన మాణిక్యం ఏడాది క్రితం వరకు హైదరాబాద్లోని ఓ హోటల్లో మాస్టర్గా పనిచేసేవాడు. దళితుల ఆర్థిక అభ్యున్నతే లక్ష్యంగా సీఎం కేసీఆర్ తీసుకువచ్చిన దళిత బంధు పథకంతో మాణిక్యం జీవితం పూర్తిగా మారిపోయింది. మాణిక్యం ఆర్థికంగా ఎదగడంతోపాటు మరికొంత మందికి ఉపాధిని కల్పిస్తూ ఆదర్శంగా నిలుస్తున్నాడు. హైదరాబాద్లోని ద్వారక హోటల్లో మాస్టర్గా పనిచేసే సమయంలో అతడికి రోజుకు రూ.600 చొప్పున చెల్లించేవారు. కుటుంబాన్ని సొంతూరులోనే వదిలి హైదరాబాద్లో పనిచేస్తుండేవాడు.
దళిత బంధు పథకంలో భాగంగా మొదటి విడుతలో మాణిక్యంను ప్రభుత్వం లబ్ధిదారుడిగా ఎంపిక చేసింది. తనకు హోటల్లో మాస్టర్గా పనిచేసిన అనుభవముండడంతో దళితబంధు కింద ప్రభుత్వం ఇచ్చిన రూ.10లక్షల సాయంతో హోటల్ ఏర్పాటు చేసుకున్నాడు. పరిగిలోని బస్స్టాండ్కు సమీపంలో మణికంఠ పేరిట హోటల్ను ఏర్పాటు చేసి, ఉదయం పూట టిఫిన్స్, సాయంత్రం ఫాస్ట్ ఫుడ్ నిర్వహిస్తున్నాడు. తన హోటల్లో 10 మందిని పెట్టుకొని ఉపాధినిస్తున్నాడు. వారికి ఒక్కొక్కరికి రోజుకు రూ.700 వరకు జీతం చెల్లిస్తూ వస్తున్నాడు. రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన ప్రోత్సాహంతో ఉదయం 5 గంటల పాటు సాయంత్రం 5 గంటలపాటు కష్టపడుతూ పనిచేసే వారికి జీతాలు, షటర్ కిరాయి, ఇతర ఖర్చులు పోనూ నెలకు రూ.40-50 వేల వరకు మాణిక్యం సంపాదిస్తున్నాడు.
జరుగుతున్న రెండో విడుత లబ్ధిదారుల ప్రక్రియ
దళిత బంధు పథకం అమలుతో జిల్లాలోని దళితుల కుటుంబాల్లో వెలుగులు నిండాయి. మొన్నటి వరకు కూలీలు, కారు డ్రైవర్లుగా తదితర పనులు చేసినవారు నేడు దళిత బంధు పథకంలో భాగంగా ఆర్థిక సాయం అందజేయడంతో రూ.10 లక్షల విలువ చేసే యూనిట్లు సొంతం కావడంతోపాటు దండిగా ఉపాధి పొందుతున్నారు. మరికొంత మందికి ఉపాధిని కల్పిస్తూ ఆదర్శంగా నిలుస్తున్నారు. జిల్లాలో లబ్ధిదారులు చాలా వరకు మినీ డెయిరీ, పౌల్ట్రీపామ్లతోపాటు కార్లు, ట్రాక్టర్ యూనిట్లను ఎంపిక చేసుకున్నారు. యూనిట్లకు సంబంధించి ఆయా రంగాల్లోని నిపుణులతో ప్రత్యేక అవగాహన కల్పించడంతోపాటు శిక్షణ కూడా ఇప్పించారు.
లబ్ధిదారులు వారు ఎంచుకున్న వ్యాపారాల్లో ఏ విధంగానైనా నష్టపోయినట్లయితే వారికి ఆర్థికంగా అండగా ఉండేందుకు ఏర్పాటు చేసిన రక్షణ నిధి కింద ఇప్పటివరకు రూ.35.80 లక్షల నిధులను సంబంధిత అధికారులు జమ చేశారు. మరోవైపు మొదటి విడుతలో జిల్లాలోని ఐదు నియోజకవర్గాల్లో 358 మంది లబ్ధిదారులను ఎంపిక చేయగా, రూ.35.80 కోట్ల నిధులను విడుదల చేసింది. 358 యూనిట్లకు సంబంధించి జిల్లా యంత్రాంగం గ్రౌండింగ్ ప్రక్రియను పూర్తి చేసింది. మొదటి విడుతలో మంజూరైన యూనిట్లలో వికారాబాద్ నియోజకవర్గంలో 100, తాండూరులో 100, పరిగిలో 80, కొడంగల్లో 60, చేవెళ్ల నియోజకవర్గంలో 18 యూనిట్ల గ్రౌండింగ్ ప్రక్రియను పూర్తి చేశారు. రెండో విడుతకు సంబంధించి ఇప్పటికే నియోజకవర్గానికి 500 యూనిట్లను సర్కారు మంజూరు చేయగా, లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియ ఎమ్మెల్యేల ఆధ్వర్యంలో జరుగుతున్నది.
కేసీఆర్కు జీవితాంతం రుణపడి ఉంటాను : మాణిక్యం, దళిత బంధు లబ్ధిదారుడు
గతంలో ఓ హోటల్లో మాస్టర్గా పనిచేస్తున్న నేను దళితబంధు సాయంతో సొంతంగా హోటల్ పెట్టాను. గతంలో ఆర్థికంగా చాలా ఇబ్బందులు పడ్డాను. దళితబంధు కింద వ్యాపారం చేసేందుకు చేసిన రూ.10 లక్షల సాయంతో నాతోపాటు మరో పది మం దికి ఉపాధి కల్పించడడం చాలా సంతోషంగా ఉంది. మణికంఠ పేరిట హోటల్ పెట్టి నెలకు రూ.40-50 వేల వరకు సంపాదిస్తున్నాను. నాలాంటివారి పేదవారి బతుకులు మార్చిన ముఖ్యమంత్రి కేసీఆర్కు జీవితాంతం రుణపడి ఉంటాం.