వికారాబాద్, డిసెంబర్ 23, (నమస్తే తెలంగాణ) :కేంద్రం అవలంబిస్తున్న రైతు వ్యతిరేక విధానాలపై ఉమ్మడి జిల్లా జనం భగ్గుమన్నారు. ఉపాధి హామీ నిధులను కల్లాల నిర్మాణానికి వినియోగించొద్దని.. ఇప్పటివరకు ఖర్చు చేసినవి తిరిగి చెల్లించాలని రాష్ట్ర సర్కార్కు కేంద్రం హుకుం జారీ చేయడాన్ని నిరసిస్తూ శుక్రవారం పెద్ద ఎత్తున ధర్నా చేశారు. బీఆర్ఎస్ ప్రజాప్రతినిధులు, నాయకుల ఆధ్వర్యంలో అన్నదాతలు రోడ్డెక్కి కేంద్రానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. వికారాబాద్ జిల్లా కేంద్రంలో జరిగిన ధర్నాలో ఎమ్మెల్యేల మెతుకు ఆనంద్, మహేశ్రెడ్డి పాల్గొనగా, చేవెళ్లలో కాలె యాదయ్య నిరసనల్లో పాల్గొన్నారు. మోదీ దిష్టిబొమ్మలతో శవయాత్ర నిర్వహించి చౌరస్తాల్లో దహనం చేశారు. ఆందోళనలు, నిరసన ర్యాలీలు, ధర్నాలతో ఇబ్రహీంపట్నం దద్దరిల్లింది. ఈ సందర్భంగా ఎమ్మెల్యేలు మాట్లాడుతూ ఇతర రాష్ర్టాల్లో చేపలు ఎండబెట్టేందుకు ఉపాధిహామీలో భాగంగా కల్లాల నిర్మాణానికి అవకాశమిస్తున్న కేంద్ర సర్కార్ తెలంగాణలో ధాన్యం ఆరబెట్టే కల్లాలకు ఎందుకివ్వడంలేదని నిలదీశారు. బీఆర్ఎస్ ఏర్పాటుతో బీజేపీలో వణుకు మొదలైందని, అందుకే లేనిపోని సాకులతో రాష్ర్టానికి నిధులివ్వకుండా ఇబ్బందులకు గురి చేస్తున్నదని ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణపై కేంద్రం చూపుతున్న వివక్షను ప్రజలందరూ గమనిస్తున్నారని త్వరలోనే తగిన గుణపాఠం చెప్పడం ఖాయమని హెచ్చరించారు.
రైతు వ్యతిరేక విధానాలు అమలు చేస్తున్న కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా బీఆర్ఎస్ శ్రేణులు పెద్ద ఎత్తున ధర్నా చేశారు. బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఇచ్చిన పిలుపు మేరకు శుక్రవారం వికారాబాద్ జిల్లా కేంద్రంలో బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు, ఎమ్మెల్యే మెతుకు ఆనంద్ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మెతుకు ఆనంద్ మాట్లాడుతూ వ్యవసాయానికి ఉపాధి హామీ పథకాన్ని అనుసంధానం చేయకుండా, తెలంగాణ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ రూ.151 కోట్లను వెనక్కి ఇవ్వాలని, ఉపాధి హామీ పథకంలో కల్లాల నిర్మాణం లేదని బీజేపీ విషప్రచారం చేస్తున్నారన్నారు. ఇతర రాష్ర్టాల్లో చేపలను ఎండబెట్టుకోవడానికి మాత్రం ఉపాధి హామీ పథకంలో కల్లాల నిర్మాణానికి అవకాశమిస్తున్న కేంద్రం, రైతులు కల్లాలను నిర్మించుకుంటామంటే వ్యతిరేకిస్తున్నారన్నారు.
ఉపాధి హామీ పథకాన్ని పూర్తిగా బంద్ చేయాలనే కుట్ర చేస్తున్నారన్నారు. ఉదయం ఒక ఫొటో, మధ్యాహ్నం ఒక ఫొటో తీసి అప్లోడ్ చేస్తేనే రూ.257ల కూలీ ఇస్తామని ఉపాధి హామీ పథకంలో కొత్తగా కొర్రీలు పెడుతున్నారన్నారు. వ్యవసాయాన్ని కార్పొరేట్ పరం చేసేందుకు బీజేపీ పన్నాగం పన్నుతున్నదన్నారు. బీజేపీ నిర్ణయాలన్నీ రైతు వ్యతిరేకమేనని, టీఆర్ఎస్ బీఆర్ఎస్గా మారినప్పటి నుంచి బీజేపీ వాళ్లకు భయం పట్టుకున్నదని, సీఎం కేసీఆర్ బయలుదేరిన్రు, ఢిల్లీకి వస్తరు, మా గద్దె దించుతారని భయం పెట్టుకున్నారన్నారు. తెలంగాణ రాష్ట్రంలో అమలవుతున్న అన్ని పథకాలను మిగతా రాష్ర్టాల్లో విస్తరింపజేసినట్లయితే బీజేపీ ప్రభుత్వానికి పరిపాలించే హక్కు లేకుండా పోతది, నూకలు చెల్లుతాయనే భయంతో, కక్షపూరితంగా బీజేపీ నిరంకుశ పాలన చేస్తుందని విమర్శించారు. కేంద్ర ప్రభుత్వం వ్యవహరిస్తున్న రైతు వ్యతిరేక పాలనకు వ్యతిరేకంగా ధర్నా చేపట్టామన్నారు. బీఆర్ఎస్ పార్టీ ఎప్పుడు రైతుల పక్షపాతి, బీజేపీ అంటేనే రైతు వ్యతిరేక పార్టీ అని అన్నారు. రైతులు, మహిళలు, యువకులు అందరూ గుర్తు పెట్టుకోవాలని పేర్కొన్నారు.
తెలంగాణపై కక్షగట్టిన కేంద్రం.. పరిగి ఎమ్మెల్యే కొప్పుల మహేశ్ రెడ్డి
తెలంగాణపై కక్షగట్టి రూపాయి నిధులివ్వకుండా ఇబ్బందులు పెడుతున్నారన్నారని పరిగి నియోజకవర్గ ఎమ్మెల్యే కొప్పుల మహేశ్రెడ్డి అన్నారు. రైతుల కోసం సీఎం కేసీఆర్ రైతుబంధు, రైతుబీమా వంటి పథకాలను అమలు చేస్తుండడంతోపాటు పండించిన పంటను కొనుగోలు చేస్తుంటే, కేంద్రం మాత్రం రైతులు పండించిన పంటను కూడా కొనుగోలు చేయకుండా రైతులను ఇబ్బందులు పెడుతుందన్నారు. రైతులకు కల్లాలుండాలన్న సదుద్దేశంతో రూ.151 కోట్లతో కల్లాలను నిర్మిస్తే నిధులివ్వకుండా, కల్లాల నిర్మాణానికి ఖర్చు పెట్టిన నిధులను వెనక్కి చెల్లించాలని కేంద్రం చెప్పడం రైతు వ్యతిరేక ప్రభుత్వమనడానికి నిదర్శనమన్నారు. గతంలో రైతులకు వ్యతిరేకంగా నల్ల చట్టాలను తీసుకొచ్చి అన్ని రాష్ర్టాల్లో ధర్నా చేపట్టడంతో 300-400 మంది రైతులు ప్రాణాలను త్యాగం చేసిన అనంతరం కేంద్రం దిగి వచ్చి క్షమాపణలు చెప్పి నల్ల చట్టాలను వెనక్కి తీసుకున్నారన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ 24 గంటలపాటు ఉచిత కరెంట్, నీళ్లు ఇస్తుండడంతో సాగు రెండు, మూడింతలు పెరిగి రైతులు ఆర్థికంగా వృద్ధి చెందేలా పథకాలను అమలు చేస్తుంటే, కేంద్ర ప్రభుత్వం మాత్రం రైతులకు వ్యతిరేక విధానాలను అవలంబిస్తున్నదని ఎమ్మెల్యే దుయ్యబట్టారు. ఈ ధర్నాలో జిల్లా గ్రంధాలయ సంస్థ చైర్మన్ రాజుగౌడ్, రైతుబంధు సమితి జిల్లా అధ్యక్షుడు రాంరెడ్డి, వికారాబాద్ మార్కెట్ కమిటీ చైర్పర్సన్ దీప, పరిగి మార్కెట్ కమిటీ చైర్మన్ ఆంజనేయులు, పరిగి మున్సిపల్ చైర్మన్ అశోక్, బీఆర్ఎస్ నేతలు, శ్రేణులు పాల్గొన్నారు.
తెలంగాణలో వ్యవసాయాన్ని నిర్వీర్యం చేసేందుకు కేంద్ర ప్రభుత్వం కుట్ర చేస్తున్నదని చేవెళ్ల ఎమ్మెల్యే కాలె యాదయ్య మండిపడ్డారు. బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు, మంత్రి కేటీఆర్ అదేశాల మేరకు చేవెళ్ల ఎమ్మెల్యే కాలె యాదయ్య అధ్వర్యంలో తెలంగాణలో ఉపాధి హామీ పనులపై కేంద్రం చేస్తున్న దుష్ప్రచారానికి వ్యతిరేకంగా శుక్రవారం చేవెళ్లలోని బీజాపూర్-రహదారిపైన చేవెళ్ల నియోజకవర్గ నాయకులతో కలిసి ధర్నా నిర్వహించారు. మోడీ డౌన్, డౌన్ అంటూ నినాదాలు చేసి దిష్టిబొమ్మను దహనం చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ తెలంగాణలో రైతు, ఉపాధి హామీ పథకం నిధులు విడుదల చేయకుండా కేంద్ర ప్రభుత్వం వారి జీవితాలతో ఆడుకుంటున్నదన్నారు. ఉపాధి నిధులతో కల్లాలు నిర్మించుకుంటే మోదీ కండ్లల్లో నిప్పులు పోసుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. కేసీఆర్ ముఖ్యమంత్రి అయిన తర్వాతే రైతులకు మంచి రోజులు వచ్చాయన్నారు. రైతుల శ్రేయస్సు కోసం సీఎం కేసీఆర్ చేస్తున్న కృషిని చూసి మోదీ ఓర్వలేక పోతున్నారన్నారు. రైతులు పండించిన ధాన్యాన్ని రోడ్ల, అద్దె పడాల్లో ఆరబోయడం వల్ల ప్రమాదాలు జరుగుతున్నాయని, వాటిని అరికట్టేందుకు కల్లాల నిర్మాణానికి చర్యలు చేపడుతుంటే బీజేపీ తెలంగాణపైన దుష్ప్రచారాలు చేస్తుందన్నారు.
కార్యక్రమంలో షాబాద్ జడ్పీటీసీ పట్నం అవినాష్రెడ్డి, శంకర్పల్లి ఎంపీపీ గోవర్ధన్రెడ్డి, శంకర్పల్లి మున్సిపాలిటీ అధ్యక్షుడు వాసుదేవు కన్న, చేవెళ్ల వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ మిట్ట వెంకటరంగారెడ్డి, రైతుబంధు సమితి జిల్లా మెంబర్ కొలన్ ప్రభాకర్రెడ్డి, చేవెళ్ల, శంకర్పల్లి, షాబాద్, మొయినాబాద్ నవాపేట్ మండలాల బీఆర్ఎస్ మండలాల అధ్యక్షులు ప్రభాకర్, గోపాల్, నర్సింగ్రావు, మహేందర్ రెడ్డి, నాగిరెడ్డి, బీసీ సెల్ మండల అధ్యక్షుడు రామగౌడ్, సర్పంచ్ల సంఘం మండల అధ్యక్షుడు శివారెడ్డి, మండల ఎంపీటీసీల ఫోరం అధ్యక్షుడు రవిందర్రెడ్డి, రైతుబంధు సమితి అధ్యక్షుడు నాగార్జునరెడ్డి, సర్పంచ్లు మాణిక్యరెడ్డి, మల్లారెడ్డి, నర్సింలు, నరహరిరెడ్డి, మండల యూత్ అధ్యక్షుడు తోట శేఖర్, వ్యవసాయ మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ నర్సింలు, మాజీ వైస్ చైర్మన్ మాణిక్యరెడ్డి, డైరెక్టర్లు సాయికుమార్, కృష్ణా, మాజీ డైరెక్టర్ గని, నాయకులు మర్పల్లి కృష్ణారెడ్డి, జేవంత్, రవికాంత్రెడ్డి, దర్శన్, చింటు పాల్గొన్నారు.
తెలంగాణపై కేంద్ర ప్రభుత్వం కక్షసాధింపు చర్యలు మానుకోవాలని రైతుబంధు సమితి జిల్లా అధ్యక్షుడు వంగేటి లక్ష్మారెడ్డి, బీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు క్యామ మల్లేశ్ అన్నారు. కల్లాల నిర్మాణంపై కేంద్ర ప్రభుత్వ వైఖరిని నిరసిస్తూ ఇబ్రహీంపట్నం అంబేద్కర్ చౌరస్తాలో భారీ ఎత్తున బీఆర్ఎస్ శ్రేణులు నిరసన వ్యక్తం చేశారు. అనంతరం సాగర్హ్రదారిపై రాస్తారోకో చేసి మోడీ దిష్టిబొమ్మను దహనం చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధిపై కేంద్ర ప్రభుత్వం మోకాలడ్డుతున్నదని ఆగ్రహం వ్యక్తం చేశారు. కల్లాల నిర్మాణాలకు కేటాయించిన నిధులను తిరిగి చెల్లించాలని అనడం సరికాదన్నారు.
బీఆర్ఎస్ ఇబ్రహీంపట్నం మండల అధ్యక్షుడు బుగ్గ రాములు ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో ఇబ్రహీంపట్నం ఎంపీపీలు కృపేష్, నర్మద, డీసీసీబీ వైస్ చైర్మన్ కొత్తకుర్మ సత్తయ్య, రైతుబంధు సమితి మండల అధ్యక్షుడు మొద్దు అంజిరెడ్డి, మున్సిపల్ వైస్ చైర్మన్ ఆకుల యాదగిరి, సహకార సంఘం చైర్మన్లు వెంకట్రెడ్డి, సుదర్శన్రెడ్డి, మహేందర్రెడ్డి, పుల్లారెడ్డి, సర్పంచ్ల ఫోరం జిల్లా అధ్యక్షుడు రాంరెడ్డి, ఎంపీటీసీ ఫోరం మండల అధ్యక్షుడు భరత్రెడ్డి, బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు చీరాల రమేశ్, రమేశ్గౌడ్, కిషన్గౌడ్, మున్సిపాలిటీల పార్టీ అధ్యక్షులు అల్వాల్ వెంకట్రెడ్డి, జంగయ్య, మున్సిపల్ మాజీ చైర్మన్ భరత్కుమార్, అమరేందర్రెడ్డి, కృష్ణారెడ్డి, బీఆర్ఎస్ మండల ప్రధాన కార్యదర్ళులు భాస్కర్రెడ్డి, బహదూర్, బాష, సర్పంచ్లు యాదగిరి, హంసమ్మ, మల్లీశ్వరి జంగయ్య, ఆండాలు గిరి, పవిత్రకుమార్, గీతారాంరెడ్డి, బీఆర్ఎస్ యువజన విభాగం నియోజకవర్గ అధ్యక్షుడు జెర్కోని రాజు, కర్నె అరవింద్, మంద సురేశ్, బుట్టి మహేశ్, బాలుగౌడ్, వనమాల రవిందర్, చంద్రయ్య, జంగయ్య, లింగస్వామి తదితరులు పాల్గొన్నారు.