పల్లెల్లోనూ మెరుగైన వైద్యసేవలను అందుబాటులోకి తెచ్చేందుకు తెలంగాణ సర్కార్ చర్యలు చేపట్టింది. దీనికోసం హైదరాబాద్లోని బస్తీ దవాఖానల మాదిరిగా.. జిల్లాల్లోనూ పల్లె దవాఖానలను ఏర్పాటు చేస్తున్నది. వికారాబాద్ జిల్లాకు 87 పల్లె దవాఖానలను మంజూరు చేయగా.. ఇప్పటికే 17 దవాఖానలను ప్రజలకు అందుబాటులోకి తెచ్చింది. మరో 70 ఆస్పత్రులను ఈ నెలాఖరులోగా ఏర్పాటు చేయాలని నిర్ణయించగా, వైద్యుల భర్తీ కోసం జిల్లా వైద్యారోగ్య శాఖ సోమవారం ఇంటర్వ్యూలు నిర్వహించింది. కాగా, గతంలో ఏఎన్ఎంల ఆధ్వర్యంలో కొనసాగిన ఉప కేంద్రాలను ప్రభుత్వం పల్లె దవాఖానాలుగా మార్చి ఎంబీబీఎస్ వైద్యుల సేవలను అందుబాటులోకి తెచ్చింది. దీంతో ఏడాదిగా గ్రామీణ ప్రజలకు మెరుగైన వైద్యం అందుతున్నది. పల్లె దవాఖానల్లో ప్రాథమిక ఆరోగ్య కేంద్రం మాదిరిగా అన్ని రకాల వైద్య సేవలు అందుతున్నాయి
వికారాబాద్, నవంబర్ 14 (నమస్తే తెలంగాణ) : గ్రామీణ ప్రజలకు మెరుగైన, నాణ్యమైన వైద్య సేవలు చేరువయ్యాయి. జిల్లాలో పల్లె దవాఖానలను ఏర్పాటు చేస్తూ ప్రభుత్వం నిర్ణయించింది. ఇందులోభాగంగా జిల్లాలోని 87 ఉపకేంద్రాలను వెల్నెస్ సెంటర్లుగా గుర్తించి పల్లె దవాఖానలుగా మార్చింది. ఇప్పటివరకు 17 పల్లె దవాఖానలు అందుబాటులోకి రావడంతోపాటు గ్రామీణ ప్రజలకు సమగ్ర వైద్య సేవలనందిస్తున్నారు. ఇప్పటికే ఉప కేంద్రాలుగా కొనసాగుతున్న ఆస్పత్రులను పల్లె దవాఖానలుగా మారుస్తూ ప్రభుత్వం నిర్ణయించిన సంగతి తెలిసిందే. ఉపకేంద్రాల్లో కేవలం టీకాలు, తల్లీబిడ్డలకు సంబంధించిన కార్యక్రమాలు నిర్వహిస్తుండేవారు.
ఏఎన్ఎంల ఆధ్వర్యంలో కొనసాగిన పల్లె దవాఖానలు ప్రస్తుతం ఎంబీబీఎస్ వైద్యుల ఆధ్వర్యంలో నడుస్తున్నాయి. గతేడాది నుంచే పల్లె దవాఖానలు అందుబాటులోకి వచ్చాయి. మలేరియా, డెంగ్యూ, విషజ్వరాలు తదితర వ్యాధులతో బాధపడుతున్నవారికి వైద్య సేవలనందిస్తున్నారు. అవసరమైన వారిని జిల్లా దవాఖానలకు పంపుతూ నిరంతరం పర్యవేక్షిస్తున్నారు. గ్రామీణ ప్రాంత ప్రజలకు సంబంధించి గుండె జబ్బులు, క్యాన్సర్, బీపీ, షుగర్, కిడ్నీ సంబంధిత వ్యాధులను ముందే గుర్తించి తగు జాగ్రత్తలు తీసుకునేలా సూచనలతోపాటు అవసరమైన మందులను కూడా అందిస్తున్నారు. ఆదివారం మినహా మిగతా అన్ని రోజుల్లో పల్లె దవాఖానలు ప్రజలకు వైద్య సేవలనందిస్తున్నాయి. పల్లె దవాఖానలతో గ్రామీణ ప్రజల ఆరోగ్య జీవన ప్రమాణాలు కూడా మెరుగుపడే అవకాశాలున్నట్లు అధికారులు చెబుతున్నారు.
అందుబాటులోకి 17 పల్లె దవాఖానలు
జిల్లాకు 87 పల్లె దవాఖానలు మంజూరు కాగా.. 17 దవాఖానలు గతేడాది నుంచి అందుబాటులోకి వచ్చాయి. మిగతా 60 దవాఖానలను ఈ నెలాఖరులోగా అందుబాటులోకి తీసుకువచ్చేలా జిల్లా యంత్రాంగం చర్యలు చేపట్టింది. అర్హులైన వైద్యుల భర్తీకి నిమిత్తం జిల్లా వైద్యారోగ్య శాఖ అధికారి పాల్వకుమార్ ఆధ్వర్యంలో సోమవారం ఇంటర్వ్యూలు నిర్వహించారు. అర్హులైన వారిని ఎంపిక చేసిన అనంతరం మూడు రోజుల్లో బాధ్యతలనప్పగించనున్నారు.
గ్రామీణ ప్రజలకు మెరుగైన వైద్యం
– డా.పాల్వన్కుమార్, జిల్లా వైద్యారోగ్య శాఖ అధికారి
జిల్లాలో 17 పల్లె దవాఖానలు క్షేత్రస్థాయిలో అందుబాటులోకి వచ్చాయి. గతేడాది నుంచి గ్రామీణ ప్రాంత ప్రజలకు నాణ్యమైన వైద్య సేవలనందిస్తున్నారు. జిల్లాలో అందుబాటులోకి వచ్చిన అన్ని దవాఖానల్లో ఓపీ సేవలందుతున్నాయి. సీజనల్ వ్యాధులతోపాటు దీర్ఘకాలిక వ్యాధులను కూడా ముందే గుర్తించేందుకు పల్లె దవాఖానలు ఉపయోగపడుతున్నాయి. అర్హులైన ఎంబీబీఎస్ వైద్యులను నియమిస్తున్నాం. దీంతో గ్రామీణ ప్రాంత ప్రజలకు మెరుగైన, నాణ్యమైన వైద్యం అందుబాటులోకి వచ్చింది.