వికారాబాద్, ఆగస్టు 12 (నమస్తే తెలంగాణ) : పేదల సొంతింటి కల సాకారం చేయడమే లక్ష్యంగా ప్రభుత్వం తీసుకొచ్చిన గృహలక్ష్మి పథకానికి ప్రజల నుంచి విశేష స్పందన లభిస్తున్నది. ఈ పథకం కింద జాగ ఉన్న అర్హులైన పేదలకు ఇంటి నిర్మాణానికి రూ.3 లక్షల ఆర్థిక సాయం అందించనున్నది. దీనికోసం ఉమ్మడి జిల్లావ్యాప్తంగా దరఖాస్తులు వెల్లువెత్తాయి. వికారాబాద్ జిల్లాలో మొత్తం 57,571 మంది దరఖాస్తు చేసుకోగా.. రంగారెడ్డి జిల్లాలో 22,252 దరఖాస్తులు వచ్చాయి. సోమవారం నుంచి క్షేత్రస్థాయిలో దరఖాస్తులను పరిశీలించనున్నారు. ఇందుకోసం మండలాలవారీగా ప్రత్యేక బృందాలను నియమించారు. ఈ ప్రక్రియను వారం రోజుల్లోగా పూర్తి చేసేందుకు జిల్లా ఉన్నతాధికారులు చర్యలు తీసుకుంటున్నారు.
సొంత జాగ ఉన్న పేదలు ఇల్లు నిర్మించుకునేందుకు రూ.3 లక్షల ఆర్థిక సహాయం అందించే గృహలక్ష్మి పథకానికి జిల్లావ్యాప్తంగా దరఖాస్తులు వెల్లువలా వచ్చాయి. జిల్లాలోని వికారాబాద్, పరిగి, తాండూరు, కొడంగల్ నియోజకవర్గాల్లోని మున్సిపాలిటీలు, అన్ని మండలాల్లో 57,571 మంది దరఖాస్తు చేసుకున్నారు. పరిగి నియోజకవర్గంలో 13,942., తాండూరులో 13,285., వికారాబాద్లో 14,618., కొడంగల్ నియోజకవర్గంలో 14,548 దరఖాస్తులు వచ్చాయి. గృహలక్ష్మి పథకానికి దరఖాస్తు చేసుకునేందుకు జిల్లా యంత్రాంగం ఈ నెల 10 వరకు అవకాశమిచ్చింది. సోమవారం నుంచి క్షేత్రస్థాయిలో దరఖాస్తులను పరిశీలించే ప్రక్రియను ప్రారంభించనున్నారు. దీనికిగాను మండలాలవారీగా ప్రత్యేక బృందాలను కలెక్టర్ నారాయణరెడ్డి నియమించారు. దరఖాస్తుల పరిశీలన ప్రక్రియను వారం రోజుల్లోగా పూర్తి చేయాలని జిల్లా ఉన్నతాధికారులు ప్రత్యేక బృందాలను ఆదేశించారు.
క్షేత్రస్థాయిలో పరిశీలన
ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ రిజర్వేషన్ల ప్రకారం లబ్ధిదారులను పారదర్శకంగా ఎంపిక చేయనున్నారు. దరఖాస్తులను పరిశీలించేందుకు మండలాల్లో తహసీల్దార్లు, ఎంపీడీవోలు, ఎంపీవోలు, ఏపీవోలతో, మున్సిపాలిటీల్లో కమిషనర్లు, ఎంపీవోలు, ఏఈలతో క్షేత్రస్థాయి పరిశీలనకు ప్రత్యేక బృందాలను నియమించారు. క్షేత్రస్థాయి పరిశీలనలో రేషన్ కార్డు, ఓటర్ ఐడీ కార్డు, సొంత ఇంటి స్థలంతోపాటు స్థానికంగా ఉంటున్నారా లేదనే వివరాలను సేకరించనున్నారు. గృహలక్ష్మి పథకానికి ఎంపికైన లబ్ధిదారులకు మూడు విడుతల్లో రూ.3 లక్షల ఆర్థిక సాయాన్ని అందించనున్నారు. బేస్మెంట్ లెవల్, రూఫ్ లెవల్, ఇంటి పని పూర్తయిన తర్వాత విడుతల వారీగా రూ.లక్ష చొప్పున ఆర్థిక సహాయాన్ని ప్రభుత్వం అందించనుంది. గృహలక్ష్మి పథకం మార్గదర్శకాల ప్రకారం లబ్ధిదారులు రెండు గదులతోపాటు మరుగుదొడ్డిని తప్పనిసరిగా నిర్మించుకోవాలని ప్రభుత్వం నిర్ణయించింది.
ప్రత్యేక కౌంటర్ల ద్వారా దరఖాస్తుల స్వీకరణ
పేదలకు సొంతింటి కల నెరవేర్చాలనే ఉద్దేశంతో ప్రభుత్వం ప్రవేశపెట్టిన గృహలక్ష్మి పథకానికి జిల్లావ్యాప్తంగా దరఖాస్తులు వెల్లువలా వచ్చాయి. మొదటి విడుత గృహలక్ష్మి పథకానికి శనివారం దరఖాస్తులకు గడువు పెట్టడంతో జిల్లావ్యాప్తంగా పెద్దఎత్తున దరఖాస్తు చేసుకున్నారు. జిల్లాలోని గ్రామీణ ప్రాంతాల్లో మండల పరిషత్ కార్యాలయాల్లో దరఖాస్తు చేసుకోగా, అర్బన్ ప్రాంతంలో ఆయా మున్సిపాలిటీల్లో దరఖాస్తులను తీసుకున్నారు. దరఖాస్తుదారులకు ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా అధికార యంత్రాంగం ప్రత్యేక కౌంటర్లను ఏర్పాటు చేసి స్వీకరించారు. రంగారెడ్డిజిల్లాలోని 26 మండలాలు, 13 మున్సిపాలిటీలు, 3 మున్సిపల్ కార్పొరేషన్లకుగాను ఒకొక్క మున్సిపాలిటీలో 2 కౌంటర్లు, మండల పరిషత్ కార్యాలయాల్లో 2 కౌంటర్లు, కార్పొరేషన్లల్లో 3 కౌంటర్ల చొప్పున ఏర్పాటు చేశారు. జిల్లాలో 22,252 వేల మంది దరఖాస్తు చేసుకున్నారు. ఇందులో అత్యధికంగా కేశంపేట మండలం నుంచి 2098, మాడ్గుల నుంచి 1910 దరఖాస్తులు వచ్చినట్లు అధికారులు తెలిపారు.
ఈ పథకం కింద దరఖాస్తు చేసుకోవడానికి లబ్ధిదారులకు ఆదాయం, కులం ధ్రువీకరణ పత్రాలతో పాటు సొంత ఇంటి స్థలాన్ని ధ్రువీకరించే తదితర పత్రాలతో పాటు ధరఖాస్తు చేసుకోవాలన్నారు. కాని, చాలామందికి కులం, ఆదాయంతో పాటు మరికొన్ని పత్రాలు అందుబాటులో లేకపోవడంతో కేవలం దరఖాస్తు మాత్రమే చేసుకున్నారు. అలాంటివారికి విచారణకు వచ్చే సమయంలో సంబంధిత పత్రాలను చూపించాలని వెసులుబాటు కల్పించారు. దీంతో వీరంతా సంబంధిత తహసీల్దార్ కార్యాలయంలో సర్టిఫికెట్లు తీసుకునే పనిలో నిమగ్నమయ్యారు.