ఎన్నో ఏండ్ల పోడు భూముల రైతుల కల సాకారమవుతున్నది. నేడు అర్హులైన గిరిజన రైతులకు పోడు భూములపై హక్కులు కల్పిస్తూ ప్రభుత్వం పట్టాలను అందజేయనున్నది. వికారాబాద్ జిల్లాలో విద్యాశాఖ మంత్రి సబితారెడ్డి పోడు రైతులకు పట్టాలను అందజేయనున్నారు. ప్రభుత్వ మార్గదర్శకాల ప్రకారం అధికారులు జిల్లాలో 436 మంది గిరిజనులను అర్హులుగా గుర్తించారు. వీరికి 552.30 ఎకరాలకు సంబంధించి పట్టాలను అందజేసేందుకు సర్వం సిద్ధం చేశారు. అత్యధికంగా కులకచర్ల మండలంలో 216 ఎకరాల పోడు భూములుండగా.. 187 మంది అర్హులున్నట్లు అధికారులు తేల్చారు. పోడు భూముల పట్టాల పంపిణీపై జిల్లావ్యాప్తంగా హర్షం వ్యక్తమవుతున్నది.
-వికారాబాద్, జూన్ 29 (నమస్తే తెలంగాణ)
ఎన్నో ఏండ్ల సంది ఎదురుచూస్తున్నం..
పోడు పట్టాల కోసం ఎన్నో ఏండ్ల సంది ఎదురుచూస్తున్నం. గతంలో సర్వేకూడ చేసిండ్రు. ఇది వరకున్న నాయకులు మా బాధలను పట్టించుకున్న పాపాన పోలేదు. ఆఫీసుల చుట్టూ తిరిగి తిరిగీ యాస్టకొచ్చేది. తెలంగాణ వచ్చినాక సీఎం కేసీఆర్ మాకు భరోసా కల్పించారు. పోడు భూములకు పట్టాలు ఇస్తామని చెప్పిండు. ఇచ్చిన మాట ప్రకారం ఇప్పుడు మాకు పట్టాలు ఇస్తుండడం సంతోషంగా ఉంది. మా చేతికి పట్టా చేతికి అందుతున్నది. మా బతుకుల గురించి ఆలోచన చేసిన సీఎం కేసీఆర్ సారు చాలా గొప్ప మనస్సున్నోడు. ఎప్పటికీ వారికి రుణపడి ఉంటాం.
– హున్నీభాయి, లక్ష్మణ్ దంపతులు, సంగాయిపల్లితండా, తాండూరు
వికారాబాద్, జూన్ 29 (నమస్తే తెలంగాణ): పోడు రైతుల ఎన్నో ఏండ్ల కల సాకారం కానున్నది. కొ న్నేండ్లుగా సాగు చేసుకుంటున్న పోడు భూములపై గిరిజనులు హక్కులు పొందనున్నారు. నేడు అర్హులకు ప్రభుత్వం పట్టాలను అందజేయనున్నది. ఆసిఫాబాద్ జిల్లాలో సీఎం కేసీఆర్ పోడు పట్టాల పంపి ణీ కార్యక్రమాన్ని ప్రారంభించనున్నారు. జిల్లాలో రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితాఇంద్రారెడ్డి, ఎమ్మెల్యేలు ఆనంద్, నరేందర్రెడ్డి, మహేశ్రెడ్డి, రోహిత్రెడ్డి అర్హులకు పట్టాలను అందజేయనున్నారు. 2005కు ముందు నుంచి అటవీ భూములను సా గు చేసుకుంటున్న గిరిజనులకు మాత్రమే పట్టాలివ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. పోడు భూము ల హక్కు పత్రాలకోసం ఎన్నో ఏండ్లుగా గిరిజనులు పోరాటం చేసినా గతంలోని ఏ ప్రభుత్వం కూడా పట్టించుకోలేదు. ప్రతిఏటా భూముల సాగు సమయంలో పోడు భూములను సాగు చేసుకుంటున్న గిరిజనులకు-అటవీ శాఖ సిబ్బందికి మధ్య యుద్ధ వాతావరణం నెలకొని ఉండేది. కొన్ని సందర్భాల్లో పోడు భూముల్లో విత్తనాలు నాటిన అనంతరం కూ డా అటవీ శాఖ సిబ్బంది సంబంధిత పంట పొలాలను దున్నేసిన పరిస్థితులున్నాయి. అయితే పోడుదారుల గోడును గుర్తించిన సీఎం అర్హులకు పట్టాలిచ్చేందుకు గ్రీన్సిగ్నల్ ఇచ్చా రు. నేడు కొన్నేండ్ల కల సాకారం కానుండటంతో జిల్లాలోని పోడు రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
పట్టాలు అందుకోనున్న 436 మంది..
జిల్లాలో పోడు భూములను సాగు చేసుకుంటున్న అర్హుల జాబితాను అధికారులు ఇప్పటికే గుర్తించారు. జిల్లాలో గిరిజన, గిరిజనేతరులు కలిపి మొ త్తం 9,973 మంది పోడు భూములను సాగు చేసుకుంటున్నట్లుగా పట్టాలు పొందేందుకు దరఖాస్తు చేసుకోగా వారిలో ప్రభుత్వ మార్గదర్శకాల ప్రకారం 436 మందిని అర్హులుగా అధికారులు తేల్చారు. వారికి నేడు జిల్లా మంత్రి, ఎమ్మెల్యేలు పట్టాలను పంపిణీ చేయనున్నారు. 436 మంది పోడు రైతుల కు 552.30 ఎకరాలకు సంబంధించి పట్టాలను అందజేయనున్నారు. జిల్లాలో అత్యధికంగా కులకచర్ల మండలంలో పోడు రైతులున్నట్లు గుర్తించారు. ధారూరు మండలంలో 54 మంది పోడు రైతులకు 99.30 ఎకరాలు, చౌడాపూర్ మండలంలో 30 మందికి 29.25 ఎకరాలు, పరిగిలో 77 మందికి 78.10 ఎకరాలు, కులకచర్లలో 187 మందికి 216 ఎకరాలు, దోమలో 28 మందికి 28ఎకరాలు, బషీరాబాద్లో ఏడుగురికి 12.10 ఎకరాలు, పెద్దేముల్లో 11 మందికి 33.12 ఎకరాలు, యాలాలలో 30 మందికి 42.20 ఎకరాలు, కొడంగల్ మండలంలో ఆరుగురికి 11 ఎకరాలకు సంబంధించి పో డు భూముల పట్టాలను అందజేయనున్నారు.
పారదర్శకంగా అర్హుల ఎంపిక..
పోడు రైతుల ఎంపిక ప్రక్రియను అధికారులు పారదర్శకంగా చేపట్టారు. మొదట పోడు భూములను సాగు చేసుకుంటున్న రైతుల నుంచి దరఖాస్తులను స్వీకరించి.. దరఖాస్తుల వారీగా క్షేత్రస్థాయిలో సర్వే నిర్వహించారు. అనంతరం నిజమైన పోడుదారులను ఎంపిక చేసేందుకు గ్రామసభలను నిర్వహించారు. రైతుల నుంచి వచ్చిన దరఖాస్తులకు అనుగుణంగా గ్రామసభల్లో పరిశీలించి ప్రభుత్వ మార్గదర్శకాల ప్రకారం 2005కు ముందు నుంచే అడవి భూమిని సాగు చేసుకుంటున్నారా లేదా అనేది చర్చించి లబ్ధిదారులను ఎంపిక చేసి గ్రామసభల్లోనే తీర్మానం చేశారు. అయితే పోడు భూముల సర్వే అనంతరం సంబంధిత వివరాలను ప్రత్యేకంగా రూ పొందించిన యాప్లో పొందుపర్చారు. అదేవిధం గా లబ్ధిదారుల ఎంపిక కోసం గ్రామస్థాయి కమిటీ లో పంచాయతీ కార్యదర్శి, అటవీశాఖ బీట్ అధికా రి, సర్వేయర్, తహసీల్దార్… డివిజన్ స్థాయి కమిటీలో చైర్మన్గా ఆర్డీవో, సభ్యులుగా డీఎఫ్వో, డీజీటీవో, ఇద్దరు గిరిజన జడ్పీటీసీలు…జిల్లా స్థాయి కమిటీకి చైర్మన్గా కలెక్టర్ వ్యవహరించగా, సభ్యులుగా జిల్లా అటవీశాఖ అధికారి, జిల్లా గిరిజన సంక్షేమాధికారి ఉన్నారు. గ్రా మ స్థాయిలో తీర్మా నం అనంతరం డివిజన్ స్థాయిలో తీర్మా నం చేసి, అనంతరం జిల్లాస్థాయి కమిటీ జాబితాను పరిశీలించి అర్హులైన పోడు రైతులను ఎంపిక చేసింది.
436 మందికి పంపిణీ
వికారాబాద్, జూన్ 29 : జిల్లాలో అర్హులైన 436 మంది రైతులకు నేడు పోడు పట్టాలను పంపిణీ చేస్తామని కలెక్టర్ నారాయణరెడ్డి తెలిపారు. గురువారం పోడు పట్టాల పంపిణీపై డీఆర్వో అశోక్కుమార్, ఆర్డీవో విజయకుమారి, డీటీడబ్ల్యూవో కోఠాజీ, తహసీల్దార్లతో ఆయన టెలికాన్ఫరెన్స్ నిర్వహించి పలు సూచనలు చేశారు. జిల్లాలోని 10 మండలాల నుంచి ఎంపిక చేసిన 436 మంది లబ్ధిదారులకు శుక్రవారం కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో మంత్రి సబితాఇంద్రారెడ్డి చేతుల మీదుగా పోడుపట్టాలను పంపిణీ చేస్తామన్నారు. లబ్ధిదారులు సకాలంలో కలెక్టరేట్లోని సమావేశ మందిరానికి వచ్చే లా సంబంధిత మండలాల తహసీల్దార్లు చర్య లు తీసుకోవాలని సూచించారు. రాని వారు నిరాశ చెందొద్దన్నారు.
ఈ జన్మకు చూస్తాననుకోలేదు
మా తాతల కాలం నుంచి పోడు భూముల్లో వ్యవసాయం చేస్తూ జీవిస్తున్నా. గత ఉమ్మడి ప్రభుత్వాల పాలకులు పోడు భూములపై హక్కు కల్పిస్తారని, పట్టాలిస్తారని మా తాతలు, తండ్రులు ఎదురు చూశారు. కానీ వారి కల నెరవేరలేదు. కానీ, సీఎం కేసీఆర్ పోడు భూములకు పట్టాలివ్వాలని నిర్ణయించడం హర్షణీ యం. ఈ జన్మలో పోడు భూములకు హక్కు పత్రాలను చూస్తానో లేదో అనుకు న్నా. నా కల ఇప్పుడు నెరవేరనున్నది.
-హోబ్యానాయక్, ఇస్మాయిల్పూర్తండా
వ్యవసాయమే జీవనాధారం
కొన్నేండ్లుగా సాగు చేసుకుంటున్న పోడు భూములకు తెలంగాణ ప్రభుత్వం పట్టాలు ఇవ్వడం ద్వారా మా సమస్యలను పరిష్కారం లభించినట్లే. ఎందుకంటే మా గిరిజనుల బతుకులు భూమితోనే మూడిపడి ఉన్నాయి. వ్యవసా యం చేస్తేనే బుక్కెడు బువ్వ దొరుకుతుంది. మా పోడు భూములకు సీఎం కేసీఆర్ పట్టాలతోపాటు రైతుబంధు పథకం కింద ఆర్థిక సాయాన్ని కూడా చేస్తారని తెలిసిన చాలా సంతోషపడుతున్నా. పోడు భూములకు పట్టాలిస్తున్న సీఎం సారుకు రుణపడి ఉంటా .
-లలితాబాయి, సంగాయిపల్లి ముందుతండా, తాండూరు
మా కుటుంబాలకు భరోసా లభిస్తుంది
కొన్నేండ్లుగా సాగు చేసుకుంటున్న పోడు భూములకు ప్రభుత్వం పట్టాలను పంపిణీ చేయడం చాలా సంతోషకరం. మా పూర్వీకులు, తాతలు, నా భర్త సుమారు 70 ఏండ్లకు పైగానే జీవనాధారం కోసం అటవీ భూమిని సాగు చేసుకుం టున్నాం. అందులో వరి, మొక్కజొన్న, పత్తి, కంది తదితర పంటలను సాగు చేస్తూ జీవిస్తున్నాం. సీఎం కేసీఆర్ పోడు భూములను పట్టాలతోపాటు రైతుబంధు కూడా ఇస్తామని ప్రకటించి మా కుటుంబానికి భరోసా కల్పించారు.
-ముడావత్ సరోజ, హనుమాన్గండి, పరిగి మండలం
చాలా సంతోషకరం
సీఎం కేసీఆర్ గిరిజనులు సాగు చేసుకుంటున్న పోడు భూములకు పట్టాలను పంపిణీ చేస్తూ ఎస్టీలపై ఉన్న ప్రేమాభిమానాన్ని చాటుకుంటు న్నారు. ఎన్నో ఏండ్లుగా పోడు భూముల్లో వ్య వసాయం చేసుకుంటున్న గిరిజనులకు హక్కు పత్రాలను అందించాలని ప్రభుత్వం నిర్ణయిం చడం చాలా సంతోషకరం. సీఎం కేసీఆర్ గతం లో ఇచ్చిన మాట ప్రకారం పోడు భూములను సాగు చేసుకుంటున్న గిరిజనులకు హక్కు పత్రాలను పంపిణీ చేయడం హర్షణీయం.
-నేనవత్ తారీబాయి, సర్పంచ్ సంగాయిపల్లితండా ,తాండూరు
మా కష్టానికి ఫలితం దక్కింది
మా రెక్కల కష్టానికి ఫలితం దక్కింది. సీఎం కేసీఆర్కు రుణపడి ఉంటా. పోడు భూములపై హక్కు కల్పిస్తూ పట్టాలను పంపిణీ చేయడం చాలా సంతోషంగా ఉన్నది. భూమిపై హక్కును కల్పించడం ద్వారా మా కుటుంబానికి కొండంత ధైర్యంగా ఉంటుంది.
-భీమిలీబాయి, ఇస్మాయిల్పూర్తండా, బషీరాబాద్