కొడంగల్, సెప్టెంబరు 21 : ప్రజల ఉత్సాహాన్ని చూస్త్తుంటే వచ్చే ఎన్నికల్లో కూడా బీఆర్ఎస్ పార్టీ ప్రభంజనమే కొనసాగుతుందని మంత్రి పట్నం మహేందర్రెడ్డి అన్నారు. గురువారం హైదరాబాద్లోని మహేందర్రెడ్డి నివాసంలో మంత్రి, ఎమ్మెల్యే పట్నం నరేందర్రెడ్డి సమక్షంలో నియోజకవర్గంలోని కోస్గి మున్సిపాలిటీకి చెందిన కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు 50 మంది బీఆర్ఎస్ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. బీఆర్ఎస్లో చేరుతున్న ప్రతిపక్ష పార్టీల శ్రేణుల జోరును చూస్తూంటే వచ్చే ఎన్నికల్లో కొడంగల్ గడ్డపై పట్నం నరేందర్రెడ్డి గులాబీ జెండాను ఎగురవేయడం ఖాయంగా పేర్కొన్నారు. కాంగ్రెస్ పార్టీ నాయకులపై ఆ పార్టీ శ్రేణులకు నమ్మకం పోయిందని, బీఆర్ఎస్ పార్టీ అభివృద్ధికి ఆకర్షితులవుతున్నట్లు తెలిపారు. బీఆర్ఎస్ పార్టీలో రోజువారీగా కాంగ్రెస్ శ్రేణులు జోరుగా చేరుతున్నారని, దీంతో కొడంగల్ నియోజకవర్గం గులాబీమయమవుతున్నట్లు తెలిపారు. రాష్ట్రంలో సీఎం కేసీఆర్ ఉన్నంత వరకు ప్రజలకు ఎటువంటి లోటు ఉండదనే నమ్మకం ప్రజల్లో ఏర్పడిందని, అదేవిధంగా బీఆర్ఎస్తోనే తెలంగాణ మనుగడ ముడిపడి ఉందని ప్రతిపక్ష పార్టీల నాయకులు, కార్యకర్తలు కొలిక్కివచ్చినట్లు తెలిపారు. పార్టీలో చేరుతున్న ప్రతి ఒక్కరికీ తమ వంతు పూర్తి సహాయ సహకారాలు ఉంటాయని, పార్టీ పటిష్టతకు పాటుపడే ప్రతి ఒక్కరికీ పార్టీలో మంచి గుర్తింపు ఉంటుందని తెలిపారు. బీఆర్ఎస్లో జోరు చేరికలతో కాంగ్రెస్ పార్టీ నాయకుల్లో గుబులు పుట్టిందన్నారు. గతంలో పది సంవత్సరాలు కొడంగల్ అభివృద్ధిని పట్టించుకోని రేవంత్రెడ్డిని ప్రజలు ఛీకొడుతున్నారని, పేరు గొప్ప ఊరు దిబ్బ అన్న చందంలా చెప్పుకోవడానికే గొప్పగా ఉందని, రేవంత్తో ఒరిగిందేమీ లేదని కాంగ్రెస్ పార్టీ శ్రేణులు చెపుతున్నట్లు మంత్రి పేర్కొన్నారు. కోస్గి మున్సిపల్ పరిధిలోని నవాజ్, ఇస్మాయిల్, ఇర్ఫాన్, ఆసిఫ్, అఫ్రోజ్, షరీఫ్, ముస్తాక్, జహీర్, అర్షద్, గౌస్, సద్దాం, అజ్జూఖాన్, నాగులపల్లి వెంకటయ్య, నాగులపల్లి సాయిలు, శ్రీనివాస్, రాములు తదితరులు బీఆర్ఎస్ పార్టీలో చేరినట్లు ఎమ్మెల్యే తెలిపారు. పార్టీలో చేరుతున్న ప్రతి ఒక్కరికీ మంత్రి, ఎమ్మెల్యే పార్టీ కండువా కప్పి పార్టీలో చేర్చుకున్నారు. రానున్నది మళ్లీ బీఆర్ఎస్ ప్రభుత్వమేనని, బీఆర్ఎస్తోనే అభివృద్ధి సాధ్యపడుతుందని గ్రహించడం వల్లే బీఆర్ఎస్ పార్టీలో చేరుతున్నట్లు వారు తెలిపారు. కార్యక్రమంలో నారాయణపేట గ్రంథాలయ చైర్మన్ రామకృష్ణ, బీఆర్ఎస్ నాయకుడు రాజేశ్ పాల్గొన్నారు.
కేసీఆర్ను ఎదుర్కొనే శక్తి ఏ పార్టీకీ లేదు
కడ్తాల్ : ముఖ్యమంత్రిని కేసీఆర్ను ఎదుర్కొనే శక్తి ఏ పార్టీకీ లేదని, బీఆర్ఎస్ పార్టీకి కార్యకర్తలే బలగమని ఎమ్మెల్యే జైపాల్యాదవ్ అన్నారు. గురువారం కడ్తాల్లోని ఎమ్మెల్యే నివాసంలో నిర్వహించిన కార్యక్రమంలో.. ముద్విన్ సర్పంచ్ నక్కపోతు యాదయ్య, బీఆర్ఎస్ గ్రామాధ్యక్షుడు పొగాకు రాజు, ఉప సర్పంచ్ పొగాకు వినోద్ ఆధ్వర్యంలో గ్రామానికి చెందిన 30 మంది బీజేపీ నాయకులు, కార్యకర్తలు జైపాల్యాదవ్ సమక్షంలో బీఆర్ఎస్లో చేరారు. పార్టీలో చేరిన గుడిగ యాదయ్య, ఎల్లయ్య, మహేశ్, విజయ్, జంగయ్య, నర్సింహ, శ్రీను, ఆడివయ్య, విష్ణు, రాములు, రమేశ్, సత్యమ్మ, అలివేలు, భద్రమ్మ, ఈదయ్య, యశోద, రాములమ్మ, లక్ష్మమ్మ, యాదమ్మ, అనురాధతోపాటు కార్యకర్తలకు ఎమ్మెల్యే గులాబీ కండువాలు వేసి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఎమ్మెల్యే మాట్లాడారు. సీఎం కేసీఆర్ అమలు చేస్తున్న సంక్షేమ పథకాలకు ఆకర్షితులై వివిధ పార్టీలకు చెందిన నాయకులు, కార్యకర్తలు బీఆర్ఎస్లో చేరుతున్నారని తెలిపారు. బడుగు, బలహీన వర్గాల సంక్షేమానికి అనేక పథకాలను అమలు చేసి, దేశంలోనే తెలంగాణను సీఎం కేసీఆర్ ఆదర్శంగా నిలిపారని వివరించారు. రాష్ట్రంలో ప్రతిపక్షాలకు చోటులేదని, తమ ఉనికిని కాపాడుకోవడం కోసమే బీఆర్ఎస్ ప్రభుత్వంపై అనవసర రాద్ధాంతం చేస్తున్నాయి. కాంగ్రెస్ నాయకులు అధికారం కోసం అచరణకు సాధ్యం కాని హామీలను ప్రకటించి ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని ఆరోపించారు. కాంగ్రెస్ నాయకులు ప్రకటించిన హామీలను ఆ పార్టీ అధికారంలో ఉన్న రాష్ర్టాల్లో అమలు చేసే దమ్ముందా అని సవాల్ చేశారు. రాష్ర్టాన్ని ఎక్కువ కాలం పాలించిన కాంగ్రెస్ నాయకులు తెలంగాణను ఎందుకు అభివృద్ధి చేయలేదని, పాలమూరు జిల్లాకు ఎందుకు సాగునీటిని అందించలేకపోయారని ప్రశ్నించారు. ఎన్నికలు సమీపిస్తుడంటంతో కాంగ్రెస్ నాయకులు ఊర్లల్లో తిరుగుతూ ప్రజలకు మాయ మాటలు చెబుతున్నారని విమర్శించారు. తెలంగాణలో అమలవుతున్న సంక్షేమ పథకాలు, అభివృద్ధిని చూసి ఓర్వలేని ప్రతిపక్షాలు బీఆర్ఎస్ ప్రభుత్వంపై బురదజల్లే ప్రయత్నాలు చేస్తున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ పార్టీ తెలంగాణపై సవతితల్లి ప్రేమ చూపిస్తున్నదని ఆరోపించారు. తెలంగాణకు రావాల్సిన జీఎస్టీ నిధులు రూ.75 వేల కోట్లను కేంద్ర ప్రభుత్వం అడ్టుకుంటున్నదన్నారు. కాంగ్రెస్, బీజేపీ పార్టీలకు హైకమాండ్ ఢిల్లీలో ఉంటుందని, బీఆర్ఎస్ పార్టీకి తెలంగాణ ప్రజలే బాసులని తెలిపారు. రాష్ట్రంలో ప్రతి ఎకరాకు సాగునీటిని అందించడానికి ప్రాజెక్టుల నిర్మాణాలు చేపట్టినట్లు తెలిపారు. పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతలతో కల్వకుర్తి నియోజకవర్గంలోని 1.25 లక్షల ఎకరాలకు సాగునీరు అందనున్నదని తెలిపారు. కొత్తగా పార్టీలో చేరిన వారికి సముచిత స్థానం కల్పిస్తామని, అందరూ కలిసికట్టుగా గ్రామాలను అభివృద్ధి చేసుకోవాలని ఎమ్మెల్యే వివరించారు.
సీఎంఆర్ఎఫ్ చెక్కులు అందజేత
ముఖ్యమంత్రి సహాయనిధి పథకం నిరుపేదలకు వరంలా మారిందని ఎమ్మెల్యే జైపాల్యాదవ్ అన్నారు. కడ్తాల్ గ్రామానికి చెందిన మాలే వెంకటయ్యగౌడ్కు రూ.48,500, మొగిళ్ల శేఖర్కు రూ.15వేలు, ముద్విన్ గ్రామానికి చెందిన రమణమోని శివకు రూ.16వేలు, కిష్టారాంపల్లి గ్రామానికి చెందిన వల్లభ్దాసు లింగమ్మకు రూ.12వేలు మంజూరైన సీఎంఆర్ఎఫ్ చెక్కులను ఎమ్మెల్యే అందజేశారు. నిరుపేదల ఆరోగ్యానికి బీఆర్ఎస్ ప్రభుత్వం భరోసా కల్పిస్తున్నదని ఎమ్మెల్యే అన్నారు. కార్యక్రమంలో జడ్పీటీసీ దశరథ్నాయక్, వైస్ ఎంపీపీ ఆనంద్, డీసీసీబీ డైరెక్టర్ వెంకటేశ్గుప్తా, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ రాజేందర్యాదవ్, రైతు బంధు సమితి మండల, గ్రామాధ్యక్షులు వీరయ్య, జంగయ్యయాదవ్, సర్పంచ్లు కృష్ణయ్యయాదవ్, సులోచన, ఎంపీటీసీ మంజుల, పీఏసీఎస్ డైరెక్టర్ వెంకటయ్య, నాయకులు గోపాల్, జంగయ్య, పెద్దయ్య, వెంకటయ్య, రాజు, సాయిలు, చంద్రమౌళి, కృష్ణ, గణేశ్, మహేందర్, మహేశ్, సురేశ్ పాల్గొన్నారు.
పథకాలకు ఆకర్షితులై..
తాండూరు : సీఎం కేసీఆర్ అమలు చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలకు అకర్షితులై గురువారం బషీరాబాద్ మండలం బహదూర్పూర్కు చెందిన 50 మందికిపైగా యువకులు తాండూరు ఎమ్మెల్యే పంజుగుల రోహిత్రెడ్డి ఆధ్వర్యంలో బీఆర్ఎస్లో చేరారు. వారికి ఎమ్మెల్యే రోహిత్రెడ్డి గులాబీ కండువా కప్పి పార్టీలోకి స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. తాండూరు నియోజకవర్గం ప్రజలే తన బలం.. బలగమన్నారు. నియోజకవర్గంలోని అన్ని గ్రామాలకు కావాల్సిన నిధులు మంజూరు చేసినట్లు తెలిపారు. బీఆర్ఎస్ పాలనలో పల్లెల్లో పకృతితో పాటు జనంలో సంతోషం కనిపిస్తున్నదన్నారు. యువత అభివృద్ధి కోసం త్వరలో ప్రత్యేక కార్యక్రమాలకు శ్రీకారం చుట్టనున్నట్లు తెలిపారు. ప్రజల నమ్మకాన్ని వమ్ముచేయకుండా మరింత పట్టుదలతో పాలన చేస్తున్నామని తెలిపారు. ప్రజలకు ఇచ్చిన హామీలన్నీ నెరవేరుస్తున్నట్లు తెలిపారు. రానున్న ఎన్నికల్లో బీఆర్ఎస్ అత్యధిక మెజార్టీతో ఘన విజయం సాధించడానికి కార్యకర్తలు సైనికుల్లా పనిచేయాలని ఎమ్మెల్యే కోరారు. వచ్చే ఎన్నికల్లో బీఆర్ఎస్కు ఓటు వేసి అత్యధిక మెజార్టీతో ఎమ్మెల్యేను గెలిపిస్తామని యువకులు హామీ ఇచ్చారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు నర్సిరెడ్డి, వెంకట్రాంరెడ్డి, శ్రీకాంత్ ఉన్నారు.