ఇబ్రహీంపట్నం, ఫిబ్రవరి 8 : కార్పొరేషన్లు, మున్సిపాలిటీల పరిధిలోని గ్రామపంచాయతీలు, కాలనీలు, గేటెడ్ కమ్యూనిటీలకు తాగునీటిని అందించేందుకు రూ.1200కోట్లతో ఓఆర్ఆర్ ప్రాజెక్టు ఫేజ్-2 పనులను పురపాలక శాఖ మంత్రి కేటీ రామారావు ఇటీవల ప్రారంభించారు. ఇందులోభాగంగానే బుధవారం ఇబ్రహీంపట్నంలో రూ.221కోట్ల అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలకు మంత్రి కేటీఆర్ ముఖ్య అతిథిగా పాల్గొననున్నారు. ఈ మేరకు హయత్నగర్, ఇబ్రహీంపట్నం మండలాల్లో సుమారు రూ.134 కోట్లతో ఇన్లెట్, ఔట్లెట్, పైపులైన్ వ్యవస్థ, సర్వీస్ రిజర్వాయర్ల నిర్మాణం తదితర పనులు జరుగనున్నాయి. ఈ పనులకు మంత్రులు ప్రశాంత్రెడ్డి, సబితారెడ్డిలతో కలిసి మంత్రి కేటీఆర్ నియోజకవర్గంలో పర్యటిస్తారు. బుధవారం ఉదయం 9గంటల నుంచి సాయంత్రం 4గంటల వరకు తుర్కయాంజాల్, ఆదిబట్ల, ఇబ్రహీంపట్నం మున్సిపాలిటీల్లో పర్యటించనున్నారు. అనంతరం 2గంటలకు ఇబ్రహీంపట్నంలో జరుగనున్న బహిరంగసభలో మంత్రులు పాల్గొననున్నట్లు ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్రెడ్డి తెలిపారు. ప్రభుత్వం ఔటర్ లోపలి గ్రామాలకు శాశ్వతంగా తాగునీటి సమస్యను పరిష్కరించాలనే ఉద్దేశంతో హెచ్ఎండీఏ ఆధ్వర్యంలో రూ.146 కోట్లను కేటాయించింది. ఈ నిధులతో ఔటర్ లోపలి అన్ని గ్రామాలకు ఇక నుంచి పూర్తిస్థాయి తాగునీరు అందించే వాటర్ గ్రిడ్ పథకాన్ని మంత్రులు ప్రారంభించనున్నారు.
ఇబ్రహీంపట్నం నియోజకవర్గంలో బుధవారం రాష్ట్ర మంత్రులు పర్యటిస్తున్నందున వారు ప్రారంభించే అభివృద్ధి కార్యక్రమాల పనులను మంగళవారం ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్రెడ్డి పరిశీలించారు. ముందుగా ఆయన అంబేద్కర్ చౌరస్తా నుంచి అనాజ్పూర్ వరకు రోడ్డు వెడల్పు పనుల కోసం, తహసీల్దార్ కార్యాలయం వద్ద నూతన భవన నిర్మాణానికి, రిజిస్ట్రార్ కార్యాలయం కోసం వేసిన శిలాఫలకాల పనులపై ఆయన దృష్టి సారించారు. బహిరంగసభ ఏర్పాట్లను ఆయన స్వయంగా పరిశీలించారు. అలాగే, మంచాల రోడ్డులో నిర్మించిన నూతన ఇంటిగ్రేటెడ్ మార్కెట్ పనులపై ఆయన పలు సూచనలు చేశారు. ఎటువంటి ఇబ్బందులు తలెత్తవద్దని ఆయన మున్సిపల్ చైర్పర్సన్ స్రవంతి, వైస్ చైర్మన్ యాదగిరి, కమిషనర్ యూసుఫ్, మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ వెంకటరమణారెడ్డి, ప్రశాంత్కుమార్రెడ్డిలకు సూచించారు.
ప్రస్తుతం నీరందుతున్న ప్రజలకు నీటి సరఫరా మరింత మెరుగవుతుంది. ఇప్పటివరకు నీటి సరఫరా వ్యవస్థలేని ప్రాంతాలకూ నీరందుతుంది. మూడు రోజులకోసారి, అంతకంటే ఎక్కువ రోజులకు ఒకసారి నీటి సరఫరా జరుగుతున్న ప్రాంతాలకు రోజు విడిచి రోజు నీటి సరఫరా జరుగుతుంది. లోప్రెషర్ సమస్యకు శాశ్వత పరిష్కారం లభించనుంది.
నియోజకవర్గంలోని అభివృద్ధి కార్యక్రమాల అనంతరం మధ్యాహ్నం 2గంటలకు ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం నుంచి టీఆర్ఎస్పార్టీ ఆధ్వర్యంలో నిర్వహించనున్న బహిరంగసభకు మంత్రులు హాజరుకానున్నారు. నియోజకవర్గంలోని ఇబ్రహీంపట్నం, మంచాల, యాచారం, అబ్దుల్లాపూర్మెట్, హయత్నగర్ మండలాలతోపాటు ఇబ్రహీంపట్నం, ఆదిబట్ల, తుర్కయాంజాల్, పెద్దఅంబర్పేట్ మున్సిపాలిటీల నుంచి భారీఎత్తున టీఆర్ఎస్పార్టీ శ్రేణులు ఈ బహిరంగసభకు తరలిరానున్నారు. ఇందుకోసం ఇప్పటికే సాగర్ రహదారి పక్కన బహిరంగసభకు అన్ని ఏర్పాట్లు పూర్తిచేశారు. ప్రజాప్రతినిధులు, మహిళలు, అనుబంధ సంఘాల నాయకులు అధిక సంఖ్యలో హాజరు కావాలని ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్రెడ్డి పిలుపునిచ్చారు.
తుర్కయంజాల్ మాసాబ్ చెరువు నుంచి ఖానాపూర్ గేటు వరకు గల సాగర్ రహదారిపై టీఆర్ఎస్ జెండాలతో పాటు భారీ ఫ్లెక్సీలను పెట్టారు. ఇబ్రహీంపట్నం అంబేద్కర్ చౌరస్తాలో భారీ కేటీఆర్ ఆర్చీలను ఏర్పాటు చేశారు. ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం ఎదుట జరిగే బహిరంగసభ వేదిక వద్ద ఆ పార్టీ రాష్ట్ర నాయకులు ప్రశాంత్కుమార్రెడ్డి, క్యామ మల్లేశ్, యాచారం మాజీ జడ్పీటీసీ రమేశ్గౌడ్, యాచారం గిరిజన నాయకుడు రాజునాయక్ ఆధ్వర్యంలో భారీ ఎత్తున గులాబీ జెండాలతో కూడిన హోర్డింగ్లను ఏర్పాటు చేశారు.
మంత్రుల పర్యటన సందర్భంగా తుర్కయాంజాల్ నుంచి ఇబ్రహీంపట్నం వరకు రాష్ట్ర నాయకుడు ప్రశాంత్కుమార్రెడ్డి ఆధ్వర్యంలో బైక్ ర్యాలీ నిర్వహించేందుకు ఏర్పాట్లు చేశారు. సుమారు వెయ్యి బైకులతో సాగర్ రహదారి పొడవునా ర్యాలీ నిర్వహించాలని నిర్ణయించారు. ఇందుకోసం ప్రతి గ్రామం నుంచి టీఆర్ఎస్వీ శ్రేణులంతా తమ బైకులతో ఉదయం 8గంటలకే ఇబ్రహీంపట్నం చేరుకునేలా ఏర్పాట్లు చేశారు.
ఇబ్రహీంపట్నం అభివృద్ధికి తెలంగాణ ప్రభుత్వం భారీగా నిధులను కేటాయించింది. సుమారు రూ.221కోట్లతో పలు అభివృద్ధి పనులకు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేసేందుకు రాష్ట్ర ఐటీ శాఖా మాత్యులు కల్వకుంట్ల తారకరామారావు బుధవారం ఇబ్రహీంపట్నానికి రానుండడంతో పట్టణంతో పాటు సాగర్ రహదారి గులాబీమయమైంది. టీఆర్ఎస్ జెండాలు, ఫ్లెక్సీలు, హోర్డింగ్లతో రహదారంతా కళకళలాడుతున్నది. ఉదయం 9 నుంచి సాయంత్రం 4 గంటల వరకు తుర్కయాంజాల్, ఆదిబట్ల, ఇబ్రహీంపట్నం మున్సిపాలిటీల్లో మంత్రి కేటీఆర్ పర్యటించనుండగా, మంత్రులు సబితారెడ్డి, వేముల ప్రశాంత్రెడ్డిలు పాల్గొననున్నారు. అనంతరం మధ్యాహ్నం 2 గంటలకు ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం ఎదుట బహిరంగసభ జరుగనుండడంతో ఏర్పాట్లను ఎమ్మెల్యే కిషన్రెడ్డి మంగళవారం పరిశీలించారు. ఔటర్రింగ్రోడ్డు లోపలి గ్రామాల్లో శాశ్వతంగా తాగునీటి సమస్యను పరిష్కరించాలనే ఉద్దేశంతో హెచ్ఎండీఏ ఆధ్వర్యంలో రూ.146కోట్లతో ఏర్పాటు చేసిన వాటర్గ్రిడ్ పథకాన్ని మంత్రులు ప్రారంభించనున్నారు. బహిరంగసభకు టీఆర్ఎస్ శ్రేణులతో పాటు ప్రజాప్రతినిధులు, మహిళలు, అనుబంధ సంఘాల నాయకులు అధిక సంఖ్యలో హాజరు కావాలని ఎమ్మెల్యే మంచిరెడ్డి పిలుపునిచ్చారు.
– ఇబ్రహీంపట్నం, ఫిబ్రవరి 8
వివరాలు మొత్తం
ప్రాజెక్టు వ్యయం 134 కోట్లు
రిజర్వాయర్లు 7
రిజర్వాయర్ల సామర్థ్యం 8 ఎంఎల్
రిజర్వాయర్ల వ్యయం 12 కోట్లు
ప్రతిపాదిత పైపులైన్ పొడవు 394 కి.మీలు
పైపులైన్ వ్యయం 121 కోట్లు
లబ్ధిపొందనున్న ప్రజలు 100105
లబ్ధిపొందనున్న గృహాలు 20021