పటాన్చెరు టౌన్, జూలై 30 : పదిహేడు రోజుల క్రితం తప్పిపోయిన కొడుకు ఆచూకీ సోషల్ మీడియాలో వైరల్ అయిన వీడియో ద్వారా తల్లిదండ్రులు గుర్తించారు. సంగారెడ్డి జిల్లా పటాన్చెరుకు చెందిన మంజుల, మల్లేశ్ దంపతులకు ఒక్కగానొక్క కుమారుడైన మహేశ్ మానసిక దివ్యాంగుడు. అతడు 17 రోజుల క్రితం ఇంటి నుంచి తప్పిపోవడంతో కుటుంబసభ్యులు ఆందోళనకు గురయ్యారు.
బంధువులు, తెలిసిన వారి వద్ద విచారించినా ఆచూకీ లభించలేదు. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ పుట్టిన రోజు సందర్భంగా సికింద్రాబాద్ బన్సీలాల్పేట్లోని హోమ్ ఫర్ డిసేబుల్డ్ అనాథాశ్రమంలో నిర్వహించిన గిఫ్ట్ ఏ స్మైల్ కార్యక్రమంలో అక్కడ ఆశ్రయం పొందుతున్న మహేశ్ పాల్గొన్నాడు.
బీఆర్ఎస్ సోషల్ మీడియా కార్యకర్తలు నిర్వహించిన అన్నదాన కార్యక్రమానికి సంబంధించిన వీడియోను సోషల్ మీడియాలో పోస్టు చేయగా, అది వైరల్ అయ్యింది. ఆ వీడియోలో మహేశ్ను చూసిన తల్లిదండ్రులు ఒక్కసారిగా భావోద్వేగానికి గురయ్యారు. వెంటనే అనాథాశ్రమానికి చేరుకున్న మంజుల, మల్లేశ్ దంపతులు తమ కుమారుడిని గుండెలకు హత్తుకొని కన్నీటి పర్యంతం అయ్యారు. 17 రోజులుగా కొడుకు కోసం ఆందోళనలో ఉన్న కుటుంబానికి సోషల్ మీడియా ఒక వరంగా మారడంతో ఈ ఘటన పలువురిని భావోద్వేగానికి గురి చేసింది. మహేశ్కు ఆశ్రయం కల్పించిన అనాథాశ్రమ నిర్వాహకులకు తల్లిదండ్రులు కృతజ్ఞతలు తెలిపారు.